ఈ ఆసక్తికరమైన విషయాలు ప్రముఖ పారిశ్రామికవేత్త, దాత, కళా సేకర్త అయిన దీవాన్ బహదూర్ రాధాకృష్ణ జలాన్ సేకరణలో భద్రపరిచిన అరుదైన పత్రాలు, ఫోటోల ద్వారా వెలుగులోకి వచ్చాయి. 1934లో నిర్వహించిన పాట్నా సిటీ బ్రిడ్జ్ టోర్నమెంట్కు సంబంధించిన ఫోటోలు, నిబంధనల జాబితా, పాల్గొన్న ఆటగాళ్ల వివరాలు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. ఈ చారిత్రక పత్రాలను ఆయన మునిమనవడు ఆదిత్య జలాన్ సంరక్షిస్తూ, తన ప్లానెట్ పాట్నా మ్యూజియంలో ప్రజల సందర్శన కోసం ఉంచారు.
ఆ కాలంలో టోర్నమెంట్లకు ప్రధానంగా పాట్నా నగర మున్సిపల్ ప్రాంతానికి చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలు, భూస్వాములు, అధికారులు హాజరవుతుండేవారు. పేకాట పోటీలు గంటల తరబడి సాగేవి. కొన్ని సందర్భాల్లో ఈ కార్యక్రమాలు అర్ధరాత్రి వరకు కొనసాగేవని పాత రికార్డులు చెబుతున్నాయి. అప్పట్లో ఈ ఆట వినోదంతో పాటు సామాజిక సంబంధాలకు, ప్రతిష్టకు కూడా ఒక గుర్తింపుగా ఉండేది.
ప్లానెట్ పాట్నా ఎండీ మహమ్మద్ అజ్ఫర్ అహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం, భారతదేశంలో పేకాట సంప్రదాయం బ్రిటిష్ పాలన కంటే ముందే ఉండేది. అప్పట్లో చేతితో తయారు చేసిన గుండ్రని పేకాట కార్డులు విస్తృతంగా ఉపయోగించేవారు. వాటిపై దశావతారం, రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాల దృశ్యాలు చిత్రీకరించబడేవి. రాజకుటుంబాలు, కళాకారుల వర్గాలు, రాజదర్బార్లలో ఈ కార్డులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండేది. అవి కేవలం ఆటకు మాత్రమే కాకుండా కళాఖండాలుగా కూడా గుర్తింపు పొందాయి.
అయితే 20వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ పాలనతో పాటు “బ్రిడ్జ్” అనే ఆధునిక పేకాట ఆట భారతదేశానికి పరిచయమైంది. వ్యూహాత్మక ఆలోచన, భాగస్వామ్య సమన్వయం ప్రధానంగా ఉండే ఈ ఆటను భారతీయులు త్వరగా స్వీకరించారు. నలుగురు ఆటగాళ్లు రెండు జట్లుగా ఏర్పడి ఆడే ఈ ఆటలో తెలివితేటలు, వ్యూహరచన కీలక పాత్ర పోషించేవి.
1934లో నిర్వహించిన పాట్నా సిటీ బ్రిడ్జ్ టోర్నమెంట్కు ప్రత్యేక నిబంధనలు అమలు చేశారు. 18 సంవత్సరాలు పైబడిన పురుషులు, మహిళలు మాత్రమే ఇందులో పాల్గొనే అర్హత పొందారు. పాట్నా నగర మున్సిపాలిటీ లేదా పరిపాలనా పరిధిలో నివసించే వారికే ప్రవేశం కల్పించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి ప్రవేశ రుసుము కేవలం ఒక రూపాయి మాత్రమే ఉండేది.
ప్రతి ఆటగాడు తన భాగస్వామిని తానే ఎంపిక చేసుకునే అవకాశం ఉండేది. అయితే ఒకసారి జట్టు ఏర్పడిన తర్వాత టోర్నమెంట్ మొత్తం అదే జట్టుతో ఆడాల్సి ఉండేది. మధ్యలో భాగస్వామిని మార్చుకునే అవకాశం ఉండేది కాదు. మ్యాచ్ల తేదీలు, సమయాలు ముందుగానే ప్రకటించేవారు. సమయానికి హాజరుకాని జట్టును ఓడిపోయినట్లుగా పరిగణించేవారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే నిర్వాహకుల అనుమతితో తేదీలను మార్చుకునే వెసులుబాటు ఉండేది.
ప్రేక్షకులకు కూడా టోర్నమెంట్ వీక్షించే అవకాశం ఉండేది. అయితే ఆటలో జోక్యం చేసుకోవడం, ఆటగాళ్లను ప్రభావితం చేయడం కఠినంగా నిషేధించబడింది. వివాదాలు తలెత్తితే రిఫరీ లేదా ఛైర్మన్ నిర్ణయాన్నే తుది నిర్ణయంగా పరిగణించేవారు.
ఈ పాత పత్రాలు పరిశీలిస్తే దాదాపు తొమ్మిది దశాబ్దాల క్రితం పాట్నాలో పేకాటను కేవలం కాలక్షేపంగా కాకుండా, క్రమశిక్షణ, ప్రతిష్ఠ, మేధో సామర్థ్యానికి ప్రతీకగా నిర్వహించిన పోటీ క్రీడగా భావించేవారని స్పష్టమవుతోంది. నేటి తరానికి ఇది ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ, అప్పట్లో పేకాట టోర్నమెంట్లు సామాజిక జీవితంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి.












