ఆరోగ్యం, నిద్ర, దినచర్య:
ఈ ఆత్మీయ సమావేశంలో కొందరు సభ్యులు ప్రధాని మోదీని ఆయన అలుపెరగని పనితీరు, నిరంతర ఉత్సాహం వెనుక ఉన్న రహస్యం గురించి అడిగారు. దీనికి బదులిస్తూ మోదీ తన వ్యక్తిగత దినచర్యను వివరించారు. “నేను రోజుకు కేవలం మూడున్నర గంటలు మాత్రమే నిద్రపోతాను. కానీ, మంచంపై పడుకున్న 8 సెకన్లలోపే నేను గాఢ నిద్రలోకి జారుకుంటాను” అని మోదీ వెల్లడించారు. ఇంత తక్కువ విశ్రాంతి తీసుకున్నప్పటికీ తాను రోజంతా ఎంతో చురుకుగా ఉండటానికి యోగా ప్రధాన కారణమని ఆయన తెలిపారు. తాను క్రమం తప్పకుండా ప్రతిరోజూ యోగా చేస్తాననీ, ఇది శారీరక, మానసిక సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందని చెప్పారు. రాజ్యసభ సభ్యులు కూడా ఒత్తిడిని జయించేందుకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలనీ, ప్రతిరోజూ విధిగా యోగా చేయాలని ఆయన హితవు పలికారు.
కొత్తగా పార్లమెంట్లో అడుగుపెడుతున్న సభ్యులను ఉద్దేశించి మోదీ ప్రాక్టికల్ రాజకీయ పాఠాలు బోధించారు. ఢిల్లీ కేంద్రంగా జరిగే రాజకీయ వ్యవహారాలు, వివిధ కల్పిత కథనాల వలలో చిక్కుకోవద్దని ఆయన ఎంపీలను హెచ్చరించారు. ఢిల్లీ మాయాజాలంలో పడొద్దని, ఎవరిని కలుస్తున్నారు, ఎవరితో కూర్చుంటున్నారు అనే విషయాల్లో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ప్రధాని సూచించారు. అదే సమయంలో అధికార పక్షంతో పాటు, ప్రతిపక్ష పార్టీల సభ్యులతో కూడా స్నేహపూర్వక, సుహృద్భావ సంబంధాలను కొనసాగించాలనీ, వారి నుంచి కూడా మంచి విషయాలను నేర్చుకోవాలని మోదీ ఉద్బోధించారు.
పార్లమెంట్ ఒక అద్భుత విశ్వవిద్యాలయం:
పార్లమెంట్ అనేది ఒక సువిశాలమైన విశ్వవిద్యాలయం లాంటిదనీ, ఇక్కడ నేర్చుకోగలిగినన్ని వాస్తవిక విషయాలు మరే ఇతర విశ్వవిద్యాలయంలోనూ దొరకవని ప్రధానమంత్రి మోదీ కొత్త ఎంపీలకు స్పష్టం చేశారు. సభ ఎప్పుడూ సజావుగా సాగేలా చూడాలనీ, ఎలాంటి అంతరాయాలు కలిగించకుండా హుందాగా వ్యవహరించాలని కోరారు. ప్రతి సభ్యుడు పార్లమెంట్ నిర్మాణం, చట్టాల గురించి తెలుసుకోవాలని సూచించారు. ఎంపీలు ప్రతిరోజూ కనీసం ఒకటి లేదా రెండు గంటల పాటు పార్లమెంట్ లైబ్రరీలో గడపాలని, తద్వారా దేశంలోని విభిన్న వాస్తవాలను, చరిత్రను లోతుగా అధ్యయనం చేయవచ్చని ఆయన సలహా ఇచ్చారు.
అధికారిక లావాదేవీలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ఎంపీలు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రధాని కోరారు. ఎంపీల అధికారిక ‘లెటర్ హెడ్’ (Letterhead)ను కేవలం నిజమైన ప్రజా సంక్షేమ ప్రయోజనాల కోసమే ఉపయోగించాలనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని దుర్వినియోగం చేయవద్దని హెచ్చరించారు. అలాగే టెలివిజన్ ఛానెళ్లతో మాట్లాడేటప్పుడు, సోషల్ మీడియాను వాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా, సంయమనంతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. సాంకేతికత ఎంత లాభదాయకమో, ఏమరుపాటుగా వాడితే అంతే నష్టదాయకమని ఆయన అన్నారు. యువతతో నిరంతరం మమేకం కావాలనీ, ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో చురుకుగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. తమ నియోజకవర్గాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు ఎంపీ నిధులను (MPLADS) విరివిగా ఉపయోగించాలని సూచించారు.
వర్తమానంలోనే జీవించండి:
తీరికలేని షెడ్యూల్స్ మధ్య ఒత్తిడి లేకుండా అన్ని బాధ్యతలను సమర్థవంతంగా ఎలా నిర్వహిస్తారని ఎంపీలు అడిగిన ప్రశ్నకు ప్రధాని మోదీ తన ఫిలాసఫీని వివరించారు. “నేను ఎప్పుడూ వర్తమానంలోనే జీవిస్తాను. ఇప్పుడు నేను మీ అందరితో మాట్లాడుతున్నాను కాబట్టి పూర్తిగా ఇక్కడే ఉన్నాను, ఈ క్షణంలో నా మదిలో ఇంకే ఆలోచనా లేదు” అని మోదీ తన వ్యక్తిగత తత్వాన్ని వివరించారు. గతం గురించి అనవసరంగా బాధపడకుండా, భవిష్యత్తు గురించి ఊహాజనిత ఆందోళన చెందకుండా వర్తమానంలోనే ఉంటూ దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరం కష్టపడి పనిచేయాలని సభ్యులకు మోదీ మార్గనిర్దేశం చేశారు. విదేశీ పర్యటనలకు వెళ్లే సమయంలో, విమానం ఎక్కిన వెంటనే వెళ్లే దేశం కాలమానానికి తగ్గట్టు తన గడియారాన్ని సెట్ చేసుకుంటాననీ, ఈ క్రమశిక్షణ వల్ల తనకు సమయ నిర్వహణ సులువవుతుందని మోదీ తన సక్సెస్ సీక్రెట్ పంచుకున్నారు.













