Last Updated:
స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్.. అన్నీ బంద్? అసలు హైదరాబాద్లో ఏం జరగబోతోంది?
హైదరాబాద్ నగరంలో యాప్ ఆధారిత సేవలు వాడుకునే ప్రయాణికులకు, ఆహార ప్రియులకు తీవ్ర ఇబ్బందులు ఎదురుకానున్నాయి. తమ న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే శనివారం, ఆగస్టు 8 నుంచి తెలంగాణవ్యాప్తంగా సేవలను పూర్తిగా నిలిపివేసి నిరవధిక సమ్మెకు దిగుతామని వివిధ గిగ్, ప్లాట్ఫారమ్ కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ముషీరాబాద్ వేదికగా గురువారం నిర్వహించిన తెలంగాణ యాప్ బేస్డ్ డ్రైవర్స్ ఫోరం (TADF) కమిటీ సమావేశంలో ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఫలితంగా నగరంలో క్యాబ్లు, ఆటోలు, ఫుడ్ డెలివరీ సేవలు పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం కనిపిస్తోంది.
సియాసాత్ ప్రకారం.. ఈ నిరవధిక సమ్మె పిలుపునకు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫారమ్ వర్కర్స్ యూనియన్ (TGPWU), సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (CITU), భారతీయ రోడ్ ట్రాన్స్పోర్ట్ యూనియన్ (BRTU), ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఫెడరేషన్ (INTUC-F) ప్రతినిధులు పూర్తి మద్దతు ప్రకటించారు. ఇండియన్ లేబర్ వెల్ఫేర్ ఫెడరేషన్ (ILWF), ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ (IFAT), తెలంగాణ మైనారిటీస్ క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్, ఇతర ప్రజాసంఘాలు కలసికట్టుగా ముందుకు సాగుతున్నాయి. వేల సంఖ్యలో ఉన్న కార్మికుల హక్కులను కాపాడేందుకు ఈ పోరాటం తప్పడం లేదని యూనియన్ నేతలు తెలిపారు.
కార్మికులు ప్రభుత్వం ముందు పలు ప్రధాన డిమాండ్లను ఉంచారు. యాప్ ఆధారిత రవాణా సేవలకు ప్రభుత్వం స్వయంగా కనీస బేస్ ఫేర్ను ఖరారు చేసి జీవో విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కిలోమీటరు, నిమిషం ప్రాతిపదికన న్యాయమైన ధరలను నిర్ణయించాలని స్పష్టం చేశారు. డ్రైవర్లు, డెలివరీ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ గిగ్ వర్కర్ల నిబంధనలను తక్షణమే అమలు చేయాలని, మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు 2025ను సమర్థవంతంగా అమలులోకి తీసుకురావాలని పట్టుబడుతున్నారు.
సొంత అవసరాలకు వాడే ప్రైవేట్ (వైట్ ప్లేట్) ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలను యాప్ సంస్థలు వాణిజ్య రవాణాకు వాడటాన్ని పూర్తిగా నిషేధించాలని సంఘాలు డిమాండ్ చేశాయి. చట్టబద్ధంగా వాణిజ్య రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రైవేట్ వాహనాలు యథేచ్ఛగా వాణిజ్య కార్యకలాపాలు సాగించడం వల్ల కమర్షియల్ లైసెన్సులు కలిగిన డ్రైవర్ల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ విజ్ఞప్తులపై ప్రభుత్వం, ప్లాట్ఫారమ్ యాజమాన్యాలు స్పందించకుంటే ఆగస్టు 8 నుంచి తెలంగాణవ్యాప్తంగా రవాణా, డెలివరీ సేవలు నిలిచిపోతాయని ఫెడరేషన్ హెచ్చరించింది. సమ్మె కారణంగా ప్రజలకు కలిగే ఇబ్బందులకు, ఉత్పన్నమయ్యే పరిణామాలకు ప్రభుత్వంతో పాటు సదరు యాప్ కంపెనీలే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని నాయకులు తేల్చిచెప్పారు. లక్షలాది మంది గిగ్ కార్మికుల భద్రత, ఉపాధి రక్షణ కోసం ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Hyderabad,Telangana














