ఖండాంతరాలు దాటిన ఇష్టం.. జపాన్ అమ్మాయిని రాజస్థానీగా మార్చిన అద్భుతమైన కథ! | | ACTPnews

News18


Last Updated:

జపాన్‌ దేశానికి చెందిన మయూమి అలియాస్ ‘మధు’ పక్కా రాజస్థానీ వేషధారణలో కనిపించడమే కాకుండా, అనర్గళంగా మార్వాడీ భాష మాట్లాడుతుంటే చూసిన వారంతా అవాక్కవుతారు.

+

News18

రాజస్థాన్ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. అయితే ఒక విదేశీ మహిళ ఆ సంస్కృతికి ఎంతగా ముచ్చటపడిందంటే, ఏకంగా అచ్చం మార్వాడీ ఆడపడుచులా మారిపోయి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. జపాన్‌ దేశానికి చెందిన మయూమి అలియాస్ ‘మధు’ పక్కా రాజస్థానీ వేషధారణలో కనిపించడమే కాకుండా, అనర్గళంగా మార్వాడీ భాష మాట్లాడుతుంటే చూసిన వారంతా అవాక్కవుతారు. ఆమె స్వదేశీయా లేక విదేశీయా అని ఒక్క క్షణం ఎవరైనా పొరబడాల్సిందే. ఖండాంతరాలు దాటి వచ్చిన ఈ జపనీస్ వనిత అచ్చమైన రాజస్థానీ రంగుల్లో పూర్తిగా మిళితమైపోయి, ఇక్కడి స్థానికుల ప్రేమాభిమానాలను విశేషంగా చూరగొంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

న్యూస్18 హిందీ ప్రకారం..  జపాన్‌కు చెందిన మధుకు రాజస్థాన్‌ గడ్డతో ఉన్న ఈ అద్భుతమైన అనుబంధం దాదాపు దశాబ్దంన్నర కిందట మొదలైంది. సరిగ్గా పదిహేనేళ్ల క్రితం రాజస్థానీ ప్రసిద్ధ ‘కల్బేలియా’ నృత్యం చూసి ఆమె తీవ్రంగా ఆకర్షితురాలైంది. ఆ ఆసక్తితోనే 2013 సంవత్సరంలో తొలిసారిగా మన దేశానికి వచ్చింది. కేవలం కల్బేలియా నృత్యంతో మొదలైన ఆమె ప్రయాణం అక్కడికే పరిమితం కాలేదు. క్రమంగా అక్కడి స్థానిక జానపద కళలు, సంప్రదాయాలను దగ్గరి నుంచి గమనిస్తూ వాటిని లోతుగా అర్థం చేసుకోవడం ప్రారంభించింది. కాలక్రమంలో ఆ ప్రత్యేకమైన సంస్కృతికి పూర్తి స్థాయిలో ఆకర్షితురాలై రాజస్థానీ భాషను, ఆత్మీయమైన పాటలను కూడా ఎంతో ఇష్టంగా నేర్చుకుంది.

ఇది కూడా చదవండి: 108 దేశాలు, 12 వేల మందిలో తెలుగమ్మాయి గ్రేట్ ఎచీవ్‌మెంట్.. మిషన్ శక్తిశాట్ ఎంపికవడంపై పవన్ కల్యాణ్ విషెస్

మధు వేషధారణ, నడవడిక చూస్తే ఆమె జపాన్ నుంచి వచ్చిందని ఎవరూ సులభంగా నమ్మలేరు. రాజస్థానీ సంస్కృతి పట్ల ఆమెకున్న అపారమైన మక్కువ ఆమె రోజూ ధరించే వస్త్రధారణలో స్పష్టంగా ఉట్టిపడుతుంది. నిత్యం రాజస్థానీలు ధరించే ఘాగ్రా, ఓణీతో పాటు సాంప్రదాయ ఆభరణాలు, రంగురంగుల గాజులు ధరించడం ఆమెకు ఎంతో ఇష్టం. ఆ సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై జానపద గీతాలు పాడుతున్నా, ఉత్సాహంగా కల్బేలియా నృత్యం చేస్తున్నా అచ్చం రాజస్థాన్ గడ్డపై పుట్టి పెరిగిన అమ్మాయిలాగే కనిపిస్తుంది. విదేశీ మహిళ అయినా ఏమాత్రం తడబాటు లేకుండా స్పష్టమైన, స్వచ్ఛమైన మార్వాడీ భాషలో మాట్లాడే తీరు అక్కడి స్థానికులను సైతం తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఇది కూడా చదవండి: Health Alert: మీకు వచ్చింది నార్మల్ ఫీవరా లేక డెంగ్యూనా..? మరి కరోనానా? డాక్టర్ చెప్పిన ఈ 2 లక్షణాలుంటే డేంజర్!

ఇటీవల ఆమె చేపట్టిన జోధ్‌పూర్ పర్యటనలో స్థానికులతో పూర్తిగా కలిసిపోయిన తీరు అక్కడి వారిని ఎంతో ఆకట్టుకుంది. సుప్రసిద్ధ మెహరాన్‌గఢ్ కోట దిగువ ప్రాంతంలో స్థానిక రాజస్థానీ మహిళల మధ్య కూర్చుని ఆమె ఉత్సాహంగా జానపద గీతాలు నేర్చుకోవడంతో పాటు స్వయంగా పాటలు పాడి అలరించింది. తాను నేర్చుకున్న ఈ అద్భుతమైన కళను కేవలం తన వరకే పరిమితం చేసుకోకుండా, అల్లంత దూరంలో ఉన్న జపాన్‌లోనూ రాజస్థానీ సంస్కృతిని విస్తృతంగా వ్యాప్తి చేస్తోంది. తన సొంత దేశంలో రాజస్థానీ జానపద నృత్యాలు, పాటల కోసం ప్రత్యేకంగా శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది. ఖండాంతరాల్లో మన దేశీయ కళలకు ప్రాచుర్యం కల్పిస్తూ ఎంతో మంది విదేశీయులకు రాజస్థాన్ సంస్కృతిని చేరువ చేస్తోంది.

మధు దృష్టిలో రాజస్థాన్ కేవలం ఒక అందమైన పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు, ఎంతో భావోద్వేగం, ఆత్మీయతతో ముడిపడి ఉన్న ఒక అద్భుతమైన ప్రపంచం. ఇక్కడి అపురూపమైన జానపద సంప్రదాయాలు, పాటలు, సంగీతం, నృత్యం, వేషధారణ, ముఖ్యంగా స్థానిక ప్రజల ఆత్మీయత ఆమెను అమితంగా ఆకట్టుకున్నాయి. అందుకే వాటిని నేర్చుకోవడమే కాకుండా ఏకంగా తన దైనందిన జీవితంలో ఒక ముఖ్య భాగం చేసుకుంది. ఏ సాంస్కృతిక కార్యక్రమం జరిగినా మనస్ఫూర్తిగా అందులో పాల్గొంటూ ఎంతో సందడి చేస్తుంది. విదేశాల్లో ఉంటున్నప్పటికీ రాజస్థానీ సంస్కృతితో ఆమె ఏర్పరుచుకున్న ఈ అంతులేని బంధం వల్ల నేడు ఆమె ఆ సంస్కృతికి ఒక అందమైన బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయి ప్రశంసలు అందుకుంటోంది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports