Last Updated:
నార్వే చెస్ టోర్నమెంట్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ టైటిల్ గెలుచుకున్న 20 ఏళ్ల భారత గ్రాండ్మాస్టర్ ఆర్ ప్రజ్ఞానందను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈ విజయం భారత చెస్ రికార్డుల్లో ఒక మైలురాయి అని కొనియాడారు.
భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద అంతర్జాతీయ చదరంగ వేదికపై సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రతిష్టాత్మక నార్వే చెస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన తొలి భారతీయ ఆటగాడిగా ఆయన రికార్డు సృష్టించారు. ఈ అద్భుత విజయంపై స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా ప్రజ్ఞానందకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రజ్ఞానంద సాధించిన ఈ ఘనత భారత చెస్ రంగానికి ఒక గొప్ప మైలురాయి అని, అంతర్జాతీయ స్థాయిలో ఆయన చూపిస్తున్న ప్రతిభ అద్భుతమని ప్రధాని కొనియాడారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. నార్వే రాజధాని ఓస్లోలో జరిగిన ఈ టోర్నమెంట్లో సాధించిన విజయం ప్రజ్ఞానంద కెరీర్లోనే అత్యుత్తమమైనదిగా నిలిచిపోతుంది.
Congratulations to Praggnanandhaa for this remarkable feat!
This is indeed an incredible milestone that highlights his continued excellence.My best wishes to him for his future endeavours. @rpraggnachess https://t.co/ryE0qElL9G
— Narendra Modi (@narendramodi) June 6, 2026
ఈ టోర్నమెంట్లో ఒక దశలో వెనుకబడిన చెన్నై యువ సంచలనం ప్రజ్ఞానంద, ద్వితీయార్థంలో అద్భుతంగా పుంజుకుని ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లను ఓడించారు. చివరి రౌండ్కు ముందు అమెరికా గ్రాండ్మాస్టర్ వెస్లీ సో స్వల్ప పాయింట్ల ఆధిక్యంతో టైటిల్ రేసులో ముందున్నారు. అయితే చివరి క్లాసికల్ గేమ్లో వెస్లీ సో డ్రా చేసుకోవడంతో ప్రజ్ఞానందకు సువర్ణావకాశం లభించింది. ఆఖరి పోరులో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్ను తెల్ల ముక్కలతో ఎదుర్కొన్న ప్రజ్ఞానంద, ఒత్తిడిని అధిగమించి అద్భుతమైన ఆటతీరుతో విజయం సాధించారు. వరుసగా నాలుగో క్లాసికల్ విజయాన్ని నమోదు చేయడం ద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని నార్వే చెస్ చాంపియన్షిప్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు.
ఈ టోర్నమెంట్లో ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్లసన్, ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ డి గుకేష్, వెస్లీ సో, అలీరెజా ఫిరౌజ్జా వంటి దిగ్గజాలు బరిలో నిలిచారు. ఇంతటి కఠినమైన పోటీలో ప్రజ్ఞానంద కేవలం ఒకే వారంలో కార్లసన్, గుకేష్, ఫిరౌజ్జా, కీమర్లను క్లాసికల్ గేమ్లలో ఓడించడం విశేషం. ముఖ్యంగా హోమ్ గ్రౌండ్లో ఆడుతున్న ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్లసన్ను ఒకే టోర్నమెంట్లో రెండుసార్లు క్లాసికల్ చెస్లో ఓడించిన రెండో భారతీయ ఆటగాడిగా (విశ్వనాథన్ ఆనంద్ తర్వాత) ప్రజ్ఞానంద అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. ఈ అద్భుత ప్రదర్శన ద్వారా లైవ్ రేటింగ్స్లో ఆయన ప్రపంచవ్యాప్తంగా 11వ స్థానానికి ఎగబాకారు.
లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ అప్డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana













