తండ్రి అంత్యక్రియలకు అనుమతి ఇవ్వండి.. పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకున్న దళిత యువకుడు..! | | ACTPnews

News18


Last Updated:

తిరుపతిలో దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు అడ్డుపడటంతో ఉద్రిక్తత. వైఎస్సార్‌సీపీ మాజీ కార్పొరేటర్ అనిల్ పోలీసుల కాళ్లు పట్టుకున్నారు.

+

News18

తిరుపతిలో ఓ దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి అంత్యక్రియల సందర్భంగా చోటుచేసుకున్న ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వైఎస్సార్‌సీపీ మాజీ కార్పొరేటర్ బోకం అనిల్ తండ్రి చంద్రయ్య మృతి చెందడంతో, కుటుంబ సభ్యులు తమ పూర్వీకులను దాదాపు వందేళ్లుగా ఖననం చేస్తున్న శ్మశానవాటికలోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతదేహాన్ని అక్కడికి తీసుకెళ్లారు. అయితే ఆ స్థలం ప్రస్తుతం లేఅవుట్ పరిధిలో ఉందంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ క్రమంలో తన తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బోకం అనిల్ పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకున్న ఘటన అక్కడున్న వారిని భావోద్వేగానికి గురి చేసింది. ఈ దృశ్యాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, కుటుంబ సభ్యులు తమ పూర్వీకులు దశాబ్దాలుగా అదే స్థలాన్ని శ్మశానవాటికగా వినియోగిస్తున్నారని పేర్కొన్నారు.

అంత్యక్రియలను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు మృతదేహంతోనే రోడ్డుపై ధర్నాకు దిగారు. శ్మశానవాటికగా ఉపయోగిస్తున్న భూమిని ఆక్రమించి, దళిత కుటుంబానికి అంత్యక్రియలు నిర్వహించే హక్కును కూడా నిరాకరిస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై అధికార పార్టీ నాయకుల వైఖరిని విమర్శిస్తూ, దళితుల హక్కులను పరిరక్షించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై స్పందించిన తిరుపతి వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ భూమన అభినయ్ రెడ్డి, శ్మశానవాటికగా వినియోగిస్తున్న భూమిలో అంత్యక్రియలను అడ్డుకోవడం అమానుషమని ఆరోపించారు. మృతదేహంతో వచ్చిన కుటుంబ సభ్యులను, బంధువులను ఇబ్బందులకు గురిచేయడం బాధాకరమని అన్నారు. తమ కుటుంబం తరతరాలుగా ఉపయోగిస్తున్న స్థలంలోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇరువర్గాల మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు పోలీసు బలగాలను మోహరించి ఇరువర్గాలను శాంతింపజేశారు. ఈ ఘటన తిరుపతిలో రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీయగా, శ్మశానవాటిక భూమిపై నెలకొన్న వివాదానికి సంబంధించి అధికారుల చర్యలపై అందరి దృష్టి నెలకొంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed