Last Updated:
జర్నలిస్టులు AIని ఉపయోగించవచ్చు, కానీ వార్తల విశ్వసనీయతకు బాధ్యత AIపై నెట్టలేరు అంటున్నారు సుధాకర్ రెడ్డి ఉడుముల. హైదరాబాద్ ప్రెస్క్లబ్లో AI ప్రొవెనెన్స్ శిక్షణ కార్యక్రమంలో పలు కీలక సూచనలు చేశారు.
జర్నలిస్టులు తమ విధుల్లో భాగంగా కృత్రిమ మేధను (ఏఐ) వినియోగించవచ్చు. అయితే దాని సాయంతో రూపొందించిన వార్తల విశ్వసనీయత బాధ్యత మాత్రం ఏఐపై నెట్టేయలేరని సీనియర్ జర్నలిస్టు సుధాకర్ రెడ్డి ఉడుముల అన్నారు. హైదరాబాద్ ప్రెస్క్లబ్లో శనివారం నిర్వహించిన ఏఐ ప్రొవెనెన్స్ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గూగుల్ న్యూస్ ఇనిషియేటివ్, డేటాలీడ్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా హైదరాబాద్ ప్రెస్క్లబ్ ఆతిథ్యం ఇచ్చింది. ఈ శిక్షణకు సుమారు 70 మంది జర్నలిస్టులు హాజరయ్యారు. వార్తా రచనలో ఏఐని బాధ్యతాయుతంగా ఉపయోగించడం, సరైన ప్రాంప్ట్లు ఇవ్వడం, సమాచారాన్ని నిర్ధారించడం, మూలాలను రక్షించడం, డిజిటల్ కంటెంట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునే సాధనాలపై శిక్షణ ఇచ్చారు. సుధాకర్ రెడ్డి ఉడుముల ‘జర్నలిజంలో ఏఐకి 12 నియమాలు’ అనే అంశాన్ని వివరించారు. వాటన్నింటికంటే బాధ్యతకే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. “ఏఐ ఒక సహాయకుడు మాత్రమే. జర్నలిస్టు కాదు. మానవ జర్నలిజానికి అది తోడ్పడాలి తప్ప జర్నలిస్టు విచక్షణను భర్తీ చేయకూడదు” అని చెప్పారు.














