శ్రీవారి దర్శనం పేరుతో భారీ మోసం.. భక్తుల నుంచి వేల రూపాయలు వసూలు చేసిన ఇద్దరి అరెస్ట్..! Tirumala TTD ticket scam. | | ACTPnews

News18


Last Updated:

తిరుమలలో శ్రీవారి దర్శనం, శ్రీవాణి టిక్కెట్లు, వసతి పేరుతో భక్తులను మోసం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్, 15 రోజుల రిమాండ్, ఎస్పీ జాగ్రత్తలు సూచించారు

News18
News18

తిరుమలలో శ్రీవారి దర్శనం, శ్రీవాణి టిక్కెట్లు, ప్రత్యేక సేవలు, వసతి సౌకర్యాలు కల్పిస్తామని నమ్మించి అమాయక భక్తులను మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను తిరుమల టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి నగదు, ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు, బ్యాంక్ పాస్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో ఒకరు గతంలో టీటీడీలో మజ్దూర్‌గా పనిచేసి ఉద్యోగం కోల్పోయిన మాలే శంకరయ్య కాగా, మరొకరు అన్నమయ్య జిల్లా పీలేరు మండలం కోళ్ళఫారం గ్రామానికి చెందిన మూడే వెంకటరమణ నాయక్‌గా పోలీసులు గుర్తించారు.

పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తిరుమలకు వచ్చే భక్తులను లక్ష్యంగా చేసుకుని తాము టీటీడీకి చెందిన వ్యక్తులమని పరిచయం చేసుకుంటూ శ్రీవారి దర్శనం, శ్రీవాణి టిక్కెట్లు, అర్చన, తోమాల సేవలు, వసతి సౌకర్యాలు కల్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తేలింది. ముఖ్యంగా తొలిసారి తిరుమలకు వచ్చే భక్తులను టార్గెట్ చేస్తూ వారి విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ మోసం వెలుగులోకి రావడానికి విజయవాడకు చెందిన ఓ భక్తుడి ఫిర్యాదే కారణమైంది. బాధితుడికి, అతని కుటుంబ సభ్యులకు శ్రీవాణి టిక్కెట్లు, వసతి సౌకర్యం ఏర్పాటు చేస్తామని చెప్పి రూ.51,800 వసూలు చేసిన నిందితులు, అనంతరం ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా తప్పించుకున్నారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తులో భాగంగా పోలీసులు జూన్ 3న తిరుమల ముళ్ళగుంట కార్ పార్కింగ్ ప్రాంతంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని న్యాయస్థానంలో హాజరుపరచగా, వారి గత నేరచరిత్రను పరిగణనలోకి తీసుకున్న కోర్టు 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ప్రధాన నిందితుడు మాలే శంకరయ్య గతంలో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడి మూడు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

విచారణలో మరో కీలక విషయం బయటపడింది. తన మొబైల్ నంబర్ ద్వారా భక్తులను సంప్రదిస్తూ తాను టీటీడీ ఉద్యోగినని చెప్పుకునే శంకరయ్య, దర్శనం మరియు వసతి కల్పిస్తానంటూ ముందుగానే డబ్బులు తీసుకునేవాడు. భక్తులు తిరుమలకు చేరుకునే సమయానికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకుండా పోయేవాడని పోలీసులు గుర్తించారు. ఈ విధంగా పలువురిని మోసం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు భక్తులకు కీలక సూచనలు చేశారు. దర్శనం, ప్రత్యేక సేవలు, శ్రీవాణి టిక్కెట్లు లేదా వసతి పేరుతో ఎవరైనా వ్యక్తులు, మధ్యవర్తులు సంప్రదించినా వారిని నమ్మి డబ్బులు చెల్లించవద్దని హెచ్చరించారు. కేవలం అధికారిక టీటీడీ వెబ్‌సైట్ మరియు గుర్తింపు పొందిన అధికారిక మార్గాల ద్వారానే టిక్కెట్లు, సేవలు పొందాలని సూచించారు. వివరాలు ధృవీకరించకుండా నగదు లేదా ఆన్‌లైన్ చెల్లింపులు చేస్తే మోసాలకు గురయ్యే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు.

అమాయక భక్తులను మోసం చేసే వ్యక్తులపై తిరుపతి జిల్లా పోలీసులు, టీటీడీ విజిలెన్స్ విభాగం సంయుక్తంగా కఠిన నిఘా కొనసాగిస్తున్నాయని అధికారులు తెలిపారు. దర్శనం, సేవలు, వసతి పేరుతో అక్రమాలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భక్తులు ఏవైనా అనుమానాలు, ఫిర్యాదులు లేదా సమాచారం కోసం టీటీడీ టోల్ ఫ్రీ నంబర్ 1800-425-3333 లేదా అత్యవసర సేవల నంబర్ 112ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports