Last Updated:
Arunachalam Yatra | అరుణాచలం, రామేశ్వరంతో పాటు దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలనుకునేవారి కోసం ఐఆర్సీటీసీ టూరిజం మరోసారి ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. రూ.14 వేలకే 7 పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు.
వేసవి సెలవుల్లో పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త. ఐఆర్సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి అద్భుతమైన టూర్ ప్యాకేజీ ప్రకటించింది. కేవలం 14 వేలకే 7 పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది. మే 24న హైదరాబాద్లో యాత్ర మొదలవుతుంది. ఇది 7 రాత్రులు, 8 రోజుల టూర్ ప్యాకేజీ. హైదరాబాద్ నుంచి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో బయల్దేరి తిరువన్నామలైలో అరుణాలేశ్వర ఆలయం, రామేశ్వరంలో రామనాథస్వామి ఆలయం, మదురైలో మీనాక్షి అమ్మవారి ఆలయం, కన్యాకుమారిలో కుమారి అమ్మన్ ఆలయం, తంజావూరులో బృహదీశ్వర ఆలయం, చిదంబరంలో నటరాజ ఆలయం దర్శించుకోవచ్చు. దివ్యదక్షిణ్ యాత్ర విత్ అరుణాచలం, చిదంబరం పేరుతో ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో స్లీపర్ బెర్తులు 160, థర్డ్ ఏసీ బెర్తులు 490, సెకండ్ ఏసీ బెర్తులు 52 ఉంటాయి.
ఐఆర్సీటీసీ దివ్యదక్షిణ్ యాత్ర ఎలా సాగుతుందో చూస్తే మొదటి రోజు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరతారు. దారిలో జనగాం, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటలో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ఎక్కొచ్చు. రెండో రోజు ఉదయం 6.15 గంటలకు తిరువన్నామలై స్టేషన్కు చేరుకుంటారు. ఫ్రెషప్ అయిన తర్వాత అరుణాచల ఆలయ దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత రామేశ్వరం బయల్దేరాలి. మూడో రోజు ఉదయం కుడల్నగర్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడ్నుంచి రోడ్డు మార్గంలో రామేశ్వరం వెళ్లాలి. రామేశ్వరం ఆలయంతో పాటు స్థానిక ఆలయాలను చూడొచ్చు. రాత్రికి రామేశ్వరంలో బస చేయాలి.
నాలుగో రోజు రామేశ్వరం నుంచి మదురై బయల్దేరాలి. సాయంత్రం మీనాక్షి అమ్మవారి ఆలయ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత కన్యాకుమారి బయల్దేరాలి. ఐదో రోజు ఉదయం కన్యాకుమారి చేరుకుంటారు. ఫ్రెషప్ అయిన తర్వాత రాక్ మెమొరియల్, గాంధీ మండపం, సన్సెట్ పాయింట్ చూడొచ్చు. ఆ తర్వాత తిరుచిరాపల్లి బయల్దేరాలి. ఆరో రోజు ఉదయం తిరుచిరాపల్లి చేరుకుంటారు. ఫ్రెషప్ అయిన తర్వాత శ్రీరంగం ఆలయం దర్శించుకోవాలి. ఆ తర్వాత తంజావూరు బయల్దేరాలి. తంజావూరులో బృహదీశ్వర ఆలయ దర్శనం ఉంటుంది. రాత్రికి తిరుచిరాపల్లిలో బస చేయాలి. ఏడో రోజు ఉదయం చిదంబరం బయల్దేరాలి. చిదంబరం చేరుకున్న తర్వాత నటరాజ ఆలయం దర్శించుకోవాలి. ఆ తర్వాత తిరుగు ప్రయాణం మొదలవుతుంది. ఎనిమిదో రోజు ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
లేటెస్ట్ బిజినెస్ న్యూస్, పర్సనల్ ఫైనాన్స్ టిప్స్, బిజినెస్ ఐడియాస్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ అప్డేట్స్, బంగారం ధరలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు బిజినెస్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













