Last Updated:
తిరుమలలో పోగొట్టుకున్న పర్సును పోలీసులు ఎడ్ల అప్పమ్మకు తిరిగి అప్పగించారు. క్రైమ్ కమాండ్ కంట్రోల్ రూమ్ను ఆశ్రయించగా, పోలీసులు స్పందించి పర్సును గుర్తించారు.
శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన ఓ భక్తురాలికి పర్సు పోవడంతో ఆందోళనకు గురయ్యారు. అందులో నగదు, ఇతర విలువైన వస్తువులు ఉండటంతో ఏం చేయాలో తెలియక తిరుమల క్రైమ్ కమాండ్ కంట్రోల్ రూమ్ను ఆశ్రయించారు. ఆమె ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు స్పందించి.. పోయిన పర్సును గుర్తించి సురక్షితంగా ఆమెకు తిరిగి అందజేశారు.
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం పైడాయవలస గ్రామానికి చెందిన ఎడ్ల అప్పమ్మ (48) శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చారు. ఈ క్రమంలో ఆమె తన పర్సును ఎక్కడో పోగొట్టుకున్నారు. పర్సు కనిపించకపోవడంతో వెంటనే తిరుమల క్రైమ్ కమాండ్ కంట్రోల్ రూమ్కు వెళ్లి పోలీసులను సంప్రదించారు. పర్సులో ఉన్న నగదు, ఇతర వస్తువుల వివరాలను సిబ్బందికి తెలియజేశారు.
అప్పమ్మ చెప్పిన వివరాలను కమాండ్ కంట్రోల్లోని డీఎస్పీ, సీఐ, సిబ్బంది పరిశీలించారు. మరోవైపు గుర్తించిన పర్సులో ఉన్న నగదు, వస్తువులను సరిచూశారు. అవన్నీ అప్పమ్మకు సంబంధించినవేనని నిర్ధారించుకున్న తర్వాత పర్సును సురక్షితంగా ఆమెకు అప్పగించారు. దీంతో పోయిందనుకున్న పర్సు తిరిగి దక్కడంతో అప్పమ్మ ఊపిరి పీల్చుకున్నారు.
పర్సును వెతికి తిరిగి అందించిన తిరుమల క్రైమ్ పోలీసులకు అప్పమ్మ కృతజ్ఞతలు తెలిపారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన సమయంలో పర్సు తిరిగి లభించడం స్వామివారి అనుగ్రహంగా భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో నగదు, మొబైల్ ఫోన్లు, ఆభరణాలు, పర్సులు వంటి విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
రద్దీ ప్రాంతాల్లో పిల్లలను తమతోనే ఉంచుకోవాలని, పిల్లలు లేదా వృద్ధులు తప్పిపోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పోలీస్ శాఖ కోరింది. పిల్లల వద్ద తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు ఉండేలా చూసుకోవాలని సూచించింది. వస్తువులు పోగొట్టుకున్నా, ఎవరైనా తప్పిపోయినా, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపించినా వెంటనే సమీపంలోని పోలీసులను సంప్రదించాలని తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో డయల్-112కు కాల్ చేసి పోలీసు సహాయం పొందవచ్చని పేర్కొంది. భక్తులు పోలీసుల సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండి.. శ్రీవారి బ్రహ్మోత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.














