Last Updated:
మీరు హైదరాబాద్లో ఉంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఈ రోజు నుంచి ఈ దారి 3 నెలలు క్లోజ్లోనే ఉంటుంది.
హైదరాబాద్లో ఇంటున్న వారికి కీలక అలర్ట్. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఐటీ కారిడార్ వాహనదారులకు కీలక సూచనలు జారీ చేశారు. గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో నూతనంగా నిర్మిస్తున్న మల్టీ లెవల్ ఫ్లైఓవర్, అండర్ పాస్ పనుల దృష్ట్యా భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. డీఎల్ఎఫ్ గెట్ నంబర్ 1 నుంచి గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వరకు ఉన్న మార్గాన్ని పూర్తిగా మూసివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. జూలై 1 నుంచి ప్రారంభమయ్యే ఈ ఆంక్షలు రాబోయే మూడు నెలల పాటు కచ్చితంగా అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. ఈ మార్గంలో నిత్యం ప్రయాణించే ఐటీ ఉద్యోగులు, సాధారణ ప్రజలు ఈ విషయాన్ని తప్పక గమనించాలని ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రత్యేక ప్రకటనలో కోరారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలను శాశ్వతంగా పరిష్కరించే ఉద్దేశంతోనే ఈ అభివృద్ధి పనులు చేపట్టారు.
రాడిసన్ హోటల్ నుంచి డీఎల్ఎఫ్ మీదుగా ట్రిపుల్ ఐటీ (IIIT) జంక్షన్ వైపు వెళ్లే వాహనదారులకు ప్రత్యేక దారి మళ్లింపులు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో వచ్చే వాహనాలను కేవలం డీఎల్ఎఫ్ గెట్ నంబర్ 1 వరకే అనుమతిస్తారు. ఆ తర్వాత ముందుకు వెళ్లేందుకు దారి పూర్తిగా మూసివేశారు. కాబట్టి ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. వీరు గచ్చిబౌలి జంక్షన్ మీదుగా వెళ్లి ఇందిరానగర్ వద్ద కుడివైపుకు తిరిగి ట్రిపుల్ ఐటీ జంక్షన్ చేరుకోవాలని అధికారులు సూచించారు. ఈ మార్పులను గమనించి ముందుగానే ప్రయాణ ప్రణాళిక సిద్ధం చేసుకోవడం ఉత్తమం. ట్రాఫిక్ సిబ్బంది ఎప్పటికప్పుడు అక్కడ ఉండి వాహనాలను దారి మళ్లిస్తూ సహాయపడతారు.
గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి డీఎల్ఎఫ్ గుండా రాడిసన్ హోటల్ వైపు వెళ్లే ప్రయాణికులు సైతం తమ రూట్ మార్చుకోవాలి. లింగంపల్లి వైపు నుంచి డీఎల్ఎఫ్ రోడ్డు వైపు వచ్చే అన్ని వాహనాలను గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద మళ్లిస్తారు. అక్కడి నుంచి వీరు ట్రిపుల్ ఐటీ జంక్షన్, గచ్చిబౌలి జంక్షన్ గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎడమ వైపునకు తిరిగి రాడిసన్ జంక్షన్ మీదుగా డీఎల్ఎఫ్ చేరుకునేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. వాహనదారులు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా ట్రాఫిక్ పోలీసులు సూచించే బోర్డులను గమనిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలి. సిగ్నల్స్ వద్ద నిబంధనలు పాటించడం చాలా అవసరం.
ఐటీ కారిడార్లోని ఉద్యోగుల సౌకర్యార్థం కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చారు. ముఖ్యంగా టీసీఎస్ (TCS) సంస్థలో పనిచేసే ఉద్యోగులకు సంబంధించి ప్రత్యేక సూచనలు ఉన్నాయి. నాన్-సెజ్ (CMC) గేటును వినియోగించే టీసీఎస్ ఉద్యోగులు ఎప్పటిలాగే తమ రాకపోకలు సాగించవచ్చు. వారు తమ రెగ్యులర్ నాన్-సెజ్ గేటు ద్వారానే లోపలికి ప్రవేశించడానికి, పని ముగించుకుని బయటకు రావడానికి పూర్తి అనుమతి ఉంటుంది. వీరికి ఈ ట్రాఫిక్ ఆంక్షల వల్ల గేటు వద్ద ఎలాంటి అడ్డంకులు ఉండవని పోలీసులు స్పష్టం చేశారు. ఈ వెసులుబాటుతో ఆ సంస్థ ఉద్యోగులకు భారీ ఊరట లభించింది. విధులకు వెళ్లేవారికి ఆటంకం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణ పనులు పూర్తిగా ముగియడానికి కనీసం ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సుదీర్ఘ కాలం పాటు ట్రిపుల్ ఐటీ జంక్షన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. అందుకే ప్రయాణికులు ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ సమస్యల్లో చిక్కుకుని ఆఫీసులకు వెళ్లే సమయంలో వృథా చేసుకోకుండా ముందుగానే వేరే రూట్లలో గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. నగర అభివృద్ధి కోసం జరుగుతున్న ఈ పనులకు వాహనదారులు, ప్రజలంతా తమ వంతు సహకారం అందించాలని కోరారు.
Hyderabad,Telangana













