Last Updated:
అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ దిల్లీ ఎంబసీకి ఫోన్ చేసి భారత్కు వంద శాతం మద్దతు ఇస్తానని ప్రకటించారు. ప్రధాని మోదీకి తాను పెద్ద అభిమానినని, త్వరలోనే ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరనుందని స్పష్టం చేశారు.
న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో ఆదివారం జరిగిన ఆ దేశ 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ఒక ఆసక్తికరమైన ఘట్టం చోటుచేసుకుంది. భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఈ వేడుకల మధ్యలో అకస్మాత్తుగా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు ఫోన్ చేసి స్పీకర్ ఆన్లో పెట్టారు. రాయబారులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కిక్కిరిసి ఉన్న సభను ఉద్దేశించి ట్రంప్ ఫోన్ లో మాట్లాడుతూ, భారత్ దేశం పట్ల, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల తనకున్న అపారమైన అభిమానాన్ని చాటుకున్నారు. తాను భారత్ను, ప్రధాని మోదీని ఎంతగానో ప్రేమిస్తున్నానని ట్రంప్ ప్రకటించడంతో సభలో ఒక్కసారిగా చప్పట్లు మిన్నంటాయి. భారత్ ఎప్పుడైనా, ఎలాంటి సహాయం కోరినా 100 శాతం అండగా ఉంటానని, తమకు సహాయం కావాలన్నప్పుడు ఎక్కడికి ఫోన్ చేయాలో దిల్లీకి బాగా తెలుసని ట్రంప్ స్పష్టం చేశారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం రికార్డు స్థాయి లాభాలతో దూసుకుపోతోందని, స్టాక్ మార్కెట్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. భారత్ కు ఏది కావాలన్నా అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ వేడుకలలో పాల్గొన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోను దేశ చరిత్రలోనే అత్యంత గొప్ప విదేశాంగ మంత్రిగా ట్రంప్ అభివర్ణించారు. ప్రధాని మోదీకి తన తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేయాలని రాయబారి గోర్కు సూచించారు. తామిద్దరం ఎప్పుడు మాట్లాడుకున్నా ప్రధాని మోదీ క్షేమసమాచారాల గురించే ట్రంప్ మొదట అడుగుతారని రాయబారి సెర్గియో గోర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.
భారత్-అమెరికా భాగస్వామ్యం ట్రంప్, మోదీల వ్యక్తిగత బంధం వల్ల సరికొత్త ఎత్తుకు చేరుకుందని రాయబారి గోర్ కొనియాడారు. అమెరికా ఫస్ట్ అంటే అమెరికా ఒంటరిగా ఉండటం కాదని, రెండు దేశాలకు లబ్ధి చేకూర్చే అంశాలపై తాము కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. తాను దిల్లీకి వచ్చి ఐదు నెలలు మాత్రమే అవుతోందని, ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పందం రాబోయే కొన్ని వారాల్లోనే అధికారికంగా ఖరారు కానుందని ఆయన కీలక ప్రకటన చేశారు. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల్లో పెట్టుబడులు పెరిగి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ చారిత్రాత్మక స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దిల్లీ నగరంలో అమెరికా రాయబార కార్యాలయం సరికొత్త ప్రచారానికి తెరలేపింది. నగరంలోని వేలాది ఆటో రిక్షాలపై అమెరికాకు చెందిన చారిత్రాత్మక చిత్రాలతో పాటు డోనాల్డ్ ట్రంప్ చిత్రాలను ముద్రించి ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రత్యేక ఆటోలు దిల్లీ వీధుల్లో తిరుగుతూ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు, ఈ పర్యటనలో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్తో కలిసి ఇరు దేశాల రక్షణ, ఇంధన రంగాల పురోగతిపై సుదీర్ఘ చర్చలు జరిపారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
May 24, 2026 10:56 PM IST













