NEET UG Re Exam 2026: నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌పై కేంద్రం కీలక నిర్ణయాలు.. కఠిన భద్రతతో పరీక్ష నిర్వహణ | | ACTPnews

NEET UG Re Exam 2026: నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌పై కేంద్రం కీలక నిర్ణయాలు.. కఠిన భద్రతతో పరీక్ష నిర్వహణ |


ఈ ఉన్నతస్థాయి సమావేశంలో ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, గతంలో జరిగిన NEET UG పరీక్షలో బయటపడిన లోపాలు, అవకతవకలు మళ్లీ పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రీ-ఎగ్జామ్‌ను పూర్తిగా భద్రతతో, ఎలాంటి లోపాలకు తావులేకుండా నిర్వహించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.

NEET UG రీ-పరీక్ష జూన్ 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు నిర్వహించనున్నారు. భారత్‌తో పాటు విదేశాల్లోని పలు నగరాల్లో ఈ పరీక్ష పెన్-అండ్-పేపర్ విధానంలో జరగనుంది. ఇంగ్లీష్, ఒడియా, హిందీ, తమిళం, తెలుగు, బెంగాలీ, ఉర్దూ, మరాఠీ, మలయాళం, గుజరాతీ, పంజాబీ, అస్సామీ, కన్నడ భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు.

అధికారిక ప్రకటన ప్రకారం, రాష్ట్రాలవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష కేంద్రాల్లో పర్యవేక్షణ మరింత బలంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పరీక్ష కేంద్రాల్లో భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థులకు రవాణా, తాగునీరు, ఇతర ప్రాథమిక సౌకర్యాలు సమృద్ధిగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు.

NEET UG రీ-ఎగ్జామ్‌కు అదనపు ఫీజు వసూలు చేయబోమని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇప్పటికే ప్రకటించింది. అంతేకాకుండా, ఇప్పటికే చెల్లించిన ఫీజును కూడా తిరిగి చెల్లించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ విషయంపై ధర్మేంద్ర ప్రధాన్ కూడా హామీ ఇచ్చారు.

మే 21 నుంచి అభ్యర్థులు తమ బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేసుకునేందుకు ప్రత్యేక మాడ్యూల్‌ను NTA ప్రారంభించనుంది. రీఫండ్ పొందేందుకు విద్యార్థులు తమ బ్యాంక్ వివరాలను అందులో నమోదు చేయాల్సి ఉంటుంది.

గత మే 3న నిర్వహించిన NEET UG పరీక్షపై ప్రశ్నాపత్ర లీక్, అవకతవకల ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆ పరీక్షను రద్దు చేశారు.

ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సుమారు 22 లక్షల మంది విద్యార్థులు మోసపోయారని ఆరోపిస్తూ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు.

మే 21న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఎడ్యుకేషన్, ఉమెన్, చిల్డ్రన్, యూత్ అండ్ స్పోర్ట్స్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రశ్నాపత్ర లీక్ ఆరోపణలు, NTAలో చేపట్టాల్సిన సంస్కరణలపై ఉన్నత విద్యాశాఖ అధికారుల అభిప్రాయాలను కమిటీ కోరనుంది.

ఇక మే 15న జరిగిన ప్రెస్ మీట్‌లో ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, రీ-టెస్ట్ జూన్ 21న జరుగుతుందని ప్రకటించారు. అలాగే వచ్చే ఏడాది నుంచి NEET పరీక్షను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే యోచనలో ఉన్నామని తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports