Last Updated:
జనసేనపై తప్పుడు వ్యాఖ్యలు చేశారంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్పై ఏపీ పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ వచ్చారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న పొలిటికల్ అనలిస్ట్, ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. జనసేన పార్టీపై ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు చిలికి చిలికి గాలివానలా మారి ఏకంగా అరెస్టుల దాకా వెళ్లింది. ఆయనను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు హైదరాబాద్ రావడంతో ఈ వ్యవహారం మరింత ఉద్రిక్తంగా మారింది.
సియాసాత్ డైలీ కథనం ప్రకారం.. మే 19వ తేదీన 99టీవీ చానల్లో జరిగిన రాజకీయ చర్చా కార్యక్రమంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారని.. ఆ మీటింగ్లో మాజీ సీఎం వైఎస్ జగన్ను అరెస్ట్ చేయాలని వారు కోరారని” ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి కేవలం తాత్కాలికమేనని, తమకు జగన్ మోహన్ రెడ్డే దీర్ఘకాలిక మిత్రుడని సాక్షాత్తు అమిత్ షా పవన్ తో అన్నట్లుగా నాగేశ్వర్ బాంబు పేల్చారు.
ఈ వ్యాఖ్యలను జనసేన తీవ్రంగా ఖండించింది. ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ.. ఇవన్నీ పచ్చి అబద్ధాలని, పార్టీ పరువు తీసేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జనసేన నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో ఏపీలో ఇంద్రపాలెం, బందర్ తాలూకా, సర్పవరం పోలీస్ స్టేషన్లలో నాగేశ్వర్తో పాటు 99టీవీ, సాక్షి మీడియా, గ్రేట్ ఆంధ్ర వెబ్ సైట్లపై పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే నాగేశ్వర్ను విచారించేందుకు మే 26న ఏపీ పోలీసుల బృందం ఆయన నివాసానికి చేరుకుంది. దీంతో అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు వెంటనే నాగేశ్వర్ ఇంటికి చేరుకుని ఆయనకు భద్రత కల్పించారు. అనంతరం నాగేశ్వర్ నేరుగా తెలంగాణ డీజీపీని కలిసి తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు ఈ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజమండ్రి సభలో ఆయన మాట్లాడుతూ.. “ఇన్నాళ్లూ ఓపిక పట్టాను.. కానీ కొందరు మేధావులు శృతి మించుతున్నారు. జగన్ను అరెస్ట్ చేయాలని నేను ఎందుకు అడుగుతాను? ఆ లాజిక్ నాకే అర్థం కాలేదు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడే నేను చక్రం తిప్పేవాడిని కదా? నాకు మరణం అంటే భయం లేదు.. ఎవరితోనైనా, ఎక్కడైనా తేల్చుకునేందుకు నేను సిద్ధం” అంటూ పరోక్షంగా నాగేశ్వర్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే మీడియా సంస్థలపై కూడా జనసేన ఇకపై దాడులు చేస్తుందని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
పరిస్థితి తీవ్రతను గమనించిన ప్రొఫెసర్ నాగేశ్వర్ వెంటనే టీవీ ఛానల్ వేదికగా జనసేన నేతలకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. తనకు అందిన సమాచారం తప్పని, తాను ముందే సరిచూసుకోవాల్సిందని వివరణ ఇస్తూ.. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. అయితే, నాగేశ్వర్ పై పెట్టిన కేసులను తెలంగాణ ప్రతిపక్ష నేతలు హరీష్ రావు, సీపీఐ కునమనేని సాంబశివరావు తీవ్రంగా తప్పుబట్టారు. ఇది రాజకీయ కక్షసాధింపు చర్య అని మండిపడ్డారు. బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు సైతం స్పందిస్తూ.. మేధావులపై ఇలాంటి కేసులు పెట్టడం వల్ల తప్పుడు సంకేతాలు వెళతాయని, వెంటనే కేసులను ఉపసంహరించుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.
Hyderabad,Hyderabad,Telangana













