ప్రతి సంవత్సరం భారతదేశంలో మామిడి సీజన్ ప్రారంభం కావడానికి ముందు జపాన్ తన క్వారంటైన్ బృందాన్ని భారతదేశానికి పంపుతుంది. జపాన్కు రవాణా చేయడానికి మామిడి పండ్లను సిద్ధం చేసే వేపర్ హీట్ ట్రీట్మెంట్ (VHT) ప్రక్రియను ఈ అధికారులు తనిఖీ చేస్తారు. ఈ ప్రక్రియలో పండ్ల ఈగలు, ఇతర కీటకాలను తొలగించడానికి మామిడి పండ్లను వేడి, తేమతో కూడిన గాలికి గురిచేస్తారు. జపాన్కు మామిడి పండ్లను ఎగుమతి చేయడానికి ఈ ప్రక్రియ అవసరమైనదిగా పరిగణించబడుతుంది.
మనీకంట్రోల్ నివేదిక ప్రకారం ఈ ఏడాది మార్చిలో ఉత్తరప్రదేశ్లోని రెహమాన్పూర్లో ఉన్న వీహెచ్టీ (VHT) కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆ నివేదిక ప్రకారం జపాన్ అధికారులు ఫ్యూమిగేషన్ (ధూపనం) , పారిశుధ్యానికి సంబంధించిన కొన్ని లోపాలను కనుగొన్నారు. అయితే ఇరు దేశాల ప్రభుత్వాలు ఈ సాంకేతిక లోపాలపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
జపాన్ మొక్కల క్వారంటైన్ ప్రక్రియలో సహాయపడే సంస్థ అయిన యోకోహామా ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ మార్చి 31, 2026 తేదీన ఒక అధికారిక నోటీసును జారీ చేసింది. జపాన్ ప్లాంట్ ప్రొటెక్షన్ స్టేషన్ నుండి వచ్చిన ఆదేశం మేరకు మార్చి 25, 2026న లేదా ఆ తర్వాత జారీ చేయబడిన తనిఖీ ధృవపత్రాలతో భారతదేశం నుండి వచ్చే మామిడి పండ్ల రవాణాను అంగీకరించబోమని ఆ నోటీసులో పేర్కొంది. అక్కడి కార్యాచరణ, తనిఖీ వ్యవస్థలు మెరుగుపరచబడ్డాయని జపాన్ అధికారులు సంతృప్తి చెందే వరకు భారతీయ కేంద్రాల నుండి మామిడి దిగుమతులను నిలిపివేస్తామని ఆ నోటీసులో పేర్కొంది. ఈ నిర్ణయం భారతీయ మామిడి ఎగుమతిదారులు , రైతులలో ఆందోళనలను రేకెత్తించింది.
యోకోహామా మొక్కల పరిరక్షణ సంఘం జారీ చేసిన నోటీసులో భారతదేశం నుండి మామిడి దిగుమతులు ఎప్పుడు పునఃప్రారంభమవుతాయో స్పష్టంగా పేర్కొనలేదు. భారతీయ కేంద్రాలలో కార్యాచరణ ప్రమాణాలు మెరుగుపడే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని మాత్రమే అందులో పేర్కొన్నారు. ప్రస్తుత మామిడి ఎగుమతి సీజన్లో ఈ సమస్య పరిష్కారమవుతుందో లేదో ప్రస్తుతం స్పష్టంగా లేదు. జపాన్ మొక్కల పరిరక్షణ కేంద్రం, భారతదేశ APEDA ఈ సవరణ ప్రక్రియపై జరిగిన చర్చలను గానీ లేదా కాలపరిమితిని గానీ ఇంకా బహిరంగంగా వెల్లడించలేదు.
పండుగ ఈగలు (ఫ్రూట్ ఫ్లై) సోకే ప్రమాదం కారణంగా జపాన్ 1986లో భారత మామిడిని నిషేధించింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత 2006 జూన్ 23న జపాన్ ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. ఆ సమయంలో జపాన్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ , భారతదేశంలోని జపాన్ రాయబార కార్యాలయం దీనిని రెండు దేశాల మధ్య బలపడుతున్న సంబంధాలకు చిహ్నంగా అభివర్ణించాయి. దీని తరువాత భారతదేశం నుండి జపాన్కు మామిడి ఎగుమతులు పునఃప్రారంభమయ్యాయి.గత సీజన్ వరకు ఎగుమతులు కొనసాగుతూ వచ్చాయి.
రెండు దేశాల మధ్య ఉన్న నిబంధనల ప్రకారం జపాన్కు ఎగుమతి చేసే భారతీయ మామిడి పండ్లకు ముందుగా ఆవిరి ఉష్ణ చికిత్స (VHT) ప్రక్రియను తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ , పశ్చిమ బెంగాల్లోని ఆమోదిత కేంద్రాలలో ఈ సదుపాయం కల్పించబడింది. జపాన్ కేవలం ఆరు రకాల మామిడి పండ్ల దిగుమతిని మాత్రమే అనుమతించింది. అవి ఏమిటంటే అల్ఫోన్సో, కేసర్, బంగనపల్లి, లంగ్రా, చౌసా , మాలికా. ప్రతి సీజన్లో జపాన్ అధికారులు VHT ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించారు. ఈ నిబంధనలకు అనుగుణంగా భారతదేశం కూడా VHT ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ 2006 నుండి అమలులో ఉంది.
2024-25 సంవత్సరానికి APEDA గణాంకాల ప్రకారం భారతీయ తాజా మామిడి పండ్లను అత్యధికంగా కొనుగోలు చేసే దేశాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, కువైట్ , ఖతార్. భారతీయ మామిడి పండ్లకు జపాన్ అతిపెద్ద మార్కెట్ కాదు. బిజినెస్ టుడే నివేదిక ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా సుమారు 29,938 మెట్రిక్ టన్నుల తాజా మామిడి పండ్లను ఎగుమతి చేసింది. దీని విలువ సుమారు $56.50 మిలియన్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం చెప్పుకుంటే రూ. 537.88 కోట్లతో సమానం.
భారతీయ మామిడి పండ్లకు జపాన్ అతిపెద్ద కొనుగోలుదారు కానప్పటికీ ఈ మార్కెట్ను పూర్తిగా చిన్నదిగా పరిగణించలేము. 2025-26లో జపాన్కు తాజా ప్రాసెస్ చేసిన మామిడి ఉత్పత్తుల ఎగుమతులు సుమారు $1.54 మిలియన్ల విలువైనవి అంటే మన భారతీయ కరెన్సీ ప్రకారం రూ.14.80 కోట్లు. జపాన్లో అధిక డిమాండ్ ఉన్న గుజరాత్ ప్రసిద్ధ కేసర్ మామిడి, ఈ మార్కెట్లో అతిపెద్ద వాటాను కలిగి ఉంది.
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వ్యవసాయ దిగుమతి నిబంధనలు కలిగిన దేశాలలో జపాన్ ఒకటిగా పరిగణించబడుతుంది. అక్కడి భారతీయ మామిడి ఎగుమతిదారులు ఇతర మార్కెట్ల కంటే అధిక ధరలను పొందుతారు. కాబట్టి ఈ నిషేధం వాణిజ్యంపై మాత్రమే కాకుండా ఎగుమతిదారుల ఆదాయంపై కూడా గణనీయంగా ప్రభావం చూపుతుంది. జపాన్లో భారతీయ మామిడి పండ్లు ప్రీమియం నాణ్యత గల ఉత్పత్తిగా పరిగణించబడతాయి, కాబట్టి ఈ మార్కెట్ మూసివేత ఎగుమతిదారులకు ఆందోళన కలిగించే విషయం.
భారతీయ మామిడి ఎగుమతిదారులు ఇప్పటికే కష్టకాలం ఎదుర్కొంటున్న తరుణంలో జపాన్ ఈ నిషేధాన్ని విధించింది. కొంకణ్ ప్రాంతంలో దీర్ఘకాలం పాటు కొనసాగిన వడగాలుల కారణంగా ఈ ఏడాది మహారాష్ట్ర ప్రసిద్ధ అల్ఫోన్సో మామిడి పంట తీవ్రంగా దెబ్బతింది. అల్ఫోన్సో మామిడి పండ్లను అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత ఖరీదైన , ప్రజాదరణ పొందిన రకాల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఫలితంగా ఉత్పత్తి తగ్గడం ఇప్పటికే ఎగుమతులపై ఒత్తిడిని పెంచింది. దీనికి తోడు భారతీయ ఎగుమతిదారులు పెరుగుతున్న రవాణా మ, లాజిస్టిక్స్ ఖర్చులను ఎదుర్కొంటున్నారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు రవాణా ఖర్చులను పెంచాయి. ఇది ముఖ్యంగా త్వరగా పాడైపోయే ఉత్పత్తుల ఎగుమతిపై ప్రభావం చూపుతోంది. దీనివల్ల విదేశీ మార్కెట్లకు మామిడి పండ్ల రవాణా మరింత ఖరీదైనదిగా మారింది.












