Last Updated:
హైదరాబాద్ మెట్రోలో ఇతడి నిర్వాకం చూస్తే మీ రక్తం మరిగిపోవడం ఖాయం. పబ్లిక్ మెట్రోను తన సొంత ఇల్లులా ఫీల్ అవుతున్నాడు! వైరల్ వీడియో.
నిత్యం లక్షలాది మంది ప్రయాణించే హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికులకు దైనందిన సమస్యలు తప్పడం లేదు. ఎప్పుడూ రద్దీగా ఉండే రైళ్లు, ఇయర్ఫోన్స్ పెట్టుకోకుండా మొబైల్లో పెద్ద శబ్దంతో వీడియోలు చూసే వారు, మహిళల కోసం కేటాయించిన సీట్లలో కూర్చునే పురుషులు.. ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో నెటిజన్లను తీవ్రంగా కలచివేస్తోంది. కనీస పౌర స్పృహ లేకుండా ఒక వ్యక్తి మెట్రో సీటుపై తన కాళ్లు పెట్టుకుని దర్జాగా కూర్చున్న వైనం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జూన్ 1న వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మెట్రో ప్రయాణికుల క్రమశిక్షణపై పలు ప్రశ్నలు రేకెత్తిస్తోంది.
సియాసాత్ కథనం ప్రకారం.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో సదరు వ్యక్తి ప్రవర్తన అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. తోటి ప్రయాణికుడు కూర్చున్న సీటు పక్కనే ఏమాత్రం సంకోచం లేకుండా తన కాళ్లను విండో వైపు పైకి పెట్టుకుని కూర్చున్నాడు. పబ్లిక్ ప్రదేశంలో పద్ధతిగా ప్రవర్తించాలని, కాలు కిందకు దించాలని ఇతర ప్రయాణికులు ఎంత నచ్చజెప్పినా అతడు ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా తన కాలు పక్కన ఉన్న వ్యక్తికి తగలడం లేదు కదా అంటూ వారిపైనే ఎదురుదాడికి దిగాడు. తోటి వారితో ఏమాత్రం మర్యాద లేకుండా దురుసుగా వాదనకు దిగిన తీరు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
అదే సమయంలో మరో ప్రయాణికుడు వచ్చి, తాను కూర్చోవడానికి వీలుగా కాళ్లు తీయాలని కోరాడు. అప్పుడు కూడా ఆ వ్యక్తి తన కాళ్లను పూర్తిగా కిందకు దించకుండా, ఉద్దేశపూర్వకంగా ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తూ “కూర్చో.. కూర్చో” అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. ఇది సరైన పద్ధతి కాదని, ఇది మీ ఇల్లు కాదని చుట్టుపక్కల ఉన్నవారు హెచ్చరించినప్పటికీ అతని ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. తోటి ప్రయాణికులు అతడికి ఎంతలా సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో అక్కడున్న వారంతా తీవ్ర అసహనానికి గురయ్యారు. అక్కడితో ఆ వీడియో ముగిసినప్పటికీ, అతడి మొండి వైఖరి నెట్టింట పెద్ద దుమారాన్నే రేపుతోంది.
ఈ వీడియో వైరల్ కావడంతో ఆ వ్యక్తి తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఇలాంటి అసభ్యకరమైన ప్రవర్తనను ఉపేక్షించకూడదని డిమాండ్ చేస్తున్నారు. అతడిని వెంటనే గుర్తించి హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించకుండా శాశ్వతంగా నిషేధం విధించాలని పలువురు కోరుతున్నారు. ఇలాంటి వ్యక్తిని పెంచినందుకు అతడి తల్లిదండ్రులు సిగ్గుపడాలని ఒకరు కామెంట్ చేయగా.. ఇదే ఘటన ఢిల్లీ మెట్రోలో జరిగి ఉంటే ఇంత చర్చ జరిగేది కాదని, ఈపాటికే డబ్ల్యూడబ్ల్యూఈ రేంజ్లో రెండు మూడు రౌండ్ల కొట్లాట జరిగి ఉండేదని మరొకరు వ్యంగ్యంగా స్పందించారు.
A video of a man putting his bare feet up on the seat in the Hyderabad Metro and not budging even after other passengers confront him has sparked a fresh debate on civic sense. pic.twitter.com/VfvME4FgQ7
— The Siasat Daily (@TheSiasatDaily) June 2, 2026
తోటి ప్రయాణికులకు కనీస గౌరవం ఇవ్వకుండా, పబ్లిక్ ఆస్తిని దుర్వినియోగం చేసిన ఈ ఘటనపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతున్నప్పటికీ.. హైదరాబాద్ మెట్రో అధికారులు ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు. మెట్రోలో ప్రయాణించేటప్పుడు పాటించాల్సిన నియమనిబంధనలపై సంస్థ తరఫున మరింత విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రయాణికుల్లో కనీస పౌర బాధ్యత పెరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అధికారులు ఈ ఘటనపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Hyderabad,Hyderabad,Telangana













