Last Updated:
నమ్మిన స్నేహితుడే కాలయముడయ్యాడు.. తిరుపతిలో దారుణం. పూర్తి వివరాలు తెలుసుకోండి.
సమాజంలో శాంతిభద్రతలను కాపాడి ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఒక పోలీసు దారి తప్పాడు. బాధ్యతాయుతమైన విధుల్లో ఉంటూ చట్టాన్ని గౌరవించాల్సిన వాడే స్వయంగా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. మద్యం మత్తులో విచక్షణ పూర్తిగా కోల్పోయి అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. మూగ జీవాలను ప్రాణాపాయం నుంచి కాపాడే ఓ పశువైద్యుడిపై కిరాతకంగా దాడి చేసి ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించాడు. తిరుపతి రూరల్ మండలంలో బుధవారం వెలుగుచూసిన ఈ సంచలన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. రక్షకుడే భక్షకుడిగా మారిన తీరు చూసి స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పోలీసు వ్యవస్థకే తలవంపులు తెచ్చేలా ఉన్న ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ షాకింగ్ ఘటన చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని ఉప్పరపల్లిలో చోటుచేసుకుంది. చంద్రగిరి పోలీస్ స్టేషన్లో వెంకటరమణ అనే వ్యక్తి చాలాకాలంగా కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. వృత్తిరిత్యా ఇతనికి స్థానికంగా ఉన్న ఓ వెటర్నరీ డాక్టర్తో సన్నిహిత పరిచయం ఏర్పడింది. స్నేహితులుగా మారిన ఆ ఇద్దరూ తరచుగా కలుసుకునేవారు. ఈ క్రమంలోనే సమయం దొరికినప్పుడల్లా పార్టీలు చేసుకునే అలవాటు కూడా వారికి ఉంది. ఆ అలవాటులో భాగంగానే ఇద్దరూ కలిసి ఉప్పరపల్లిలో ఉన్న ఓ మద్యం దుకాణానికి వెళ్లారు. అక్కడ కూర్చుని ఇద్దరూ కలిసి పీకల దాకా మద్యం సేవించారు.
మద్యం మత్తు నెత్తికెక్కడంతో ఆ ఇద్దరి మధ్య ఏదో ఒక చిన్న విషయమై అకారణంగా వాగ్వాదం మొదలైంది. ప్రారంభంలో కేవలం మాటలకే పరిమితమైన ఆ గొడవ క్రమంగా తీవ్రరూపం దాల్చింది. మద్యం మత్తులో ఇద్దరూ పంతానికి పోవడంతో మాటా మాటా పెరిగి ఒకరిపై ఒకరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ వివాదం కాస్తా ముదిరిపోయి ఇద్దరూ పరస్పరం భౌతిక దాడికి దిగే పరిస్థితికి దారితీసింది. ఆ సమయంలో విపరీతమైన కోపంతో ఊగిపోయిన కానిస్టేబుల్ వెంకటరమణ తనను తాను అదుపు చేసుకోలేకపోయాడు. ఎదురుగా ఉన్నది తన ప్రాణ స్నేహితుడు అనే విషయాన్ని కూడా పూర్తిగా విస్మరించాడు.
క్షణికావేశంలో కళ్ళు మూసుకుపోయిన ఆ కానిస్టేబుల్ విచక్షణ మరిచిపోయి రాక్షసంగా ప్రవర్తించాడు. అక్కడే చేతికి అందిన ఒక ఖాళీ మద్యం సీసాను తీసుకుని బలంగా కింద కొట్టి పగలగొట్టాడు. ఆ పగిలిన గాజు సీసాతో వెటర్నరీ డాక్టర్ గొంతుపై అత్యంత కిరాతకంగా పొడిచాడు. ఊహించని ఈ దారుణ పరిణామానికి అక్కడున్న వారు సైతం తీవ్ర షాక్కు గురయ్యారు. ఈ దాడిలో పశువైద్యుడికి తీవ్ర రక్తస్రావం కావడంతో క్షణాల్లోనే ఆయన అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. పరిస్థితి చేయి దాటిపోయిందని గ్రహించిన వెంకటరమణ అక్కడి నుంచి వెంటనే పరారయ్యాడు.
తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఆ పశువైద్యుడిని గమనించిన స్థానికులు వెంటనే మానవత్వంతో స్పందించారు. అత్యవసర చికిత్స నిమిత్తం ఆయనను హుటాహుటిన తిరుపతిలో ఉన్న ప్రసిద్ధ రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో డాక్టర్ల బృందం ఆయనకు ముమ్మరంగా చికిత్స అందిస్తోంది. బాధితుడి పరిస్థితి అత్యంత విషమంగానే ఉన్నట్లు సమాచారం అందుతోంది. మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న తిరుపతి రూరల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పూర్తి స్థాయిలో వివరాలు సేకరించారు. బాధితుడి తరపు వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు కానిస్టేబుల్ వెంకటరమణ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Tirumala,Chittoor,Andhra Pradesh













