తెలంగాణలో వర్షాలు జోరందుకోవడంతో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అలర్ట్ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. పోలీసులు, మున్సిపల్, హైడ్రా, విద్యుత్ శాఖల అధికారులు కలిసి పనిచేయాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
2. దోషిని ఉరితీయాలి
ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన అమానుష దాడిపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని ఆమె పరామర్శించారు. ఈ ఘోరానికి ఒడిగట్టిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు.
3. నా మీద ఉన్న కోపం నేతన్నల మీద చూపించొద్దు:
తనపై ఉన్న కోపంతో సిరిసిల్ల నేతన్నల పొట్ట కొట్టొద్దని సీఎం రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేశారు కేటీఆర్. బతుకమ్మ చీరల ఆర్డర్లు రద్దు చేయడం సరికాదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా.. ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతోందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను మళ్లీ సీఎం చేయాల్సిన అవసరం ఉందని కోరారు.
4. చంద్రబాబు, పవన్, లోకేష్పై కేఏ పాల్ ఫైర్!
ఆంధ్రప్రదేశ్ అధికార కూటమి నేతలపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను ప్రపంచ శాంతి కోసం పోరాడుతుంటే తనపై కక్ష గట్టారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ కలిసి తన చారిటీ ఆస్తులను దోచుకోవాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి అక్రమాల్ని చూస్తూ ఊరుకోనననీ, బయటపెడతానని హెచ్చరించారు.
5. విమానాల రాకపోకలకు అంతరాయం
హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రతికూల వాతావరణం కారణంగా అధికారులు కొన్ని విమానాలను దారి మళ్లించారు. ముంబై, ఢిల్లీ, సింగపూర్ నుంచి వచ్చే విమానాల ల్యాండింగ్కు అనుమతి నిరాకరించారు. ఈ పరిస్థితుల వల్ల ప్రయాణికులు ఎయిర్పోర్టులో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
6. జీ7 సదస్సు.. ఫ్రాన్స్కు బయలుదేరిన మోదీ
ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ బయలుదేరి వెళ్లారు. ఎవియాన్ నగరంలో జరిగే 52వ జీ7 దేశాల సదస్సులో ఆయన పాల్గొంటారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, స్లొవేకియా ప్రధానితో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఈ పర్యటనలో కొన్ని కీలక అంతర్జాతీయ ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది.
7. ట్రంప్ బర్త్డే.. రూ.500 కోట్ల ఖర్చు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 80వ పుట్టినరోజు వేడుకలకు సిద్ధమయ్యారు. ఇందుకోసం వైట్హౌస్లో తొలిసారిగా భారీ ‘కేజ్ ఫైట్’ ఈవెంట్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆదివారం రాత్రి జరిగే వేడుకల కోసం దాదాపు రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. దేశ 250వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి ‘ఫ్రీడమ్ 250’ అని పేరు పెట్టారు.
8. భారత నౌకలపై దాడి చేసిందెవరు?
ఒమన్ తీరంలో భారత వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ఇరానే కారణమని డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అమెరికా సెంట్రల్ కమాండ్ మాత్రం ఆ దాడులు తామే చేశామని ప్రకటించింది. నిబంధనలు ఉల్లంఘించి చమురు రవాణా చేసినందుకే నౌకలపై దాడి చేసినట్లు సైన్యం చెప్పింది. ఇలా ట్రంప్ తన సొంత సైన్యానికి భిన్నంగా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.
9. ‘పెద్ది’ చిత్రానికి భారీ వసూళ్లు
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తోంది. ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రం కేవలం 9 రోజుల్లోనే రూ.366 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ ఏడాది సౌత్ ఇండియాలోనే అతిపెద్ద విజయంగా నిలిచింది. రామ్ చరణ్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
10. అమితాబ్ స్పీడ్కు ఫ్యాన్స్ ఫిదా!
అమితాబ్ బచ్చన్ తన 82 ఏళ్ల వయసులోనూ ఒకే రోజులో 12 షార్ట్ ఫిల్మ్స్, రెండు స్టిల్ ఫొటోషూట్లను పూర్తి చేసి, వయసు కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపించారు. ఈ విషయాన్ని ఆయన తన బ్లాగ్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ, పని విషయంలో ఎప్పుడూ రాజీ పడకూడదని అన్నారు. ప్రస్తుతం బిగ్బీ, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, కమల్ హాసన్ నటిస్తున్న ‘కల్కి 2898 AD’ సీక్వెల్లో నటిస్తున్నారు.












