Last Updated:
భారతదేశంలో అత్యధిక రోజులు నిరంతరాయంగా ప్రధానిగా పనిచేసిన నేతగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. ప్రజలచేత ఎన్నుకోబడి నేటికి 4,399 రోజులు పూర్తి చేసుకున్న మోదీ.. నెహ్రూ పేరిట ఉన్న రికార్డును అధిగమించారు.
భారత రాజకీయ చరిత్రలో జూన్ 10న ఒక సరికొత్త అధ్యాయం లిఖితమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోనే అత్యధిక కాలం నిరంతరాయంగా సేవలు అందించిన ప్రధానిగా సరికొత్త రికార్డు సృష్టించారు. అధికారంలో 4,399 రోజులు పూర్తి చేసుకున్న మోదీ, తొలి సాధారణ ఎన్నికల తర్వాత సుదీర్ఘకాలం ప్రధానిగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న 4,398 రోజుల రికార్డును దాటేశారు. ఈ చారిత్రాత్మక సందర్భంలో ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ, సుపరిపాలనకు ప్రజాసేవే పరమావధి అని పేర్కొన్నారు. వినయం, నిబద్ధత, కర్తవ్య నిష్ఠ ఉన్నవారే ప్రజల నమ్మకాన్ని గెలుచుకోగలరని స్పష్టం చేశారు. నిరంతరం ప్రజల సంక్షేమం కోరే వినయపూర్వకమైన పాలకుడే అత్యున్నత కీర్తిని పొందుతాడనే అర్థం వచ్చే సంస్కృత శ్లోకాన్ని ఆయన పంచుకున్నారు.
ఈ అరుదైన మైలురాయిని చేరుకున్న ప్రధాని మోదీకి దేశ విదేశాల ప్రముఖుల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మోదీ 12 ఏళ్ల సుదీర్ఘ పరిపాలన స్వతంత్ర భారత చరిత్రలో ఒక స్వర్ణయుగమని మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కొనియాడారు. భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు ‘ప్రజాస్వామ్యానికి తల్లి’గా నిలబెట్టారని కొనియాడారు.
जनसेवा ही सुशासन की सबसे बड़ी कसौटी है। विनम्रता, समर्पण और कर्तव्यनिष्ठा के साथ निरंतर कार्य करने वाला व्यक्ति ही जनविश्वास अर्जित करता है।
सदानुरक्तप्रकृतिः प्रजापालनतत्परः।विनीतात्मा हि नृपतिर्भूयसी श्रियमश्नुते॥ pic.twitter.com/mn0Ax0F8hs
— Narendra Modi (@narendramodi) June 10, 2026
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అభినందనలు తెలుపుతూ, ఈ విజయం కోట్ల మంది భారతీయుల ప్రేమాభిమానాలకు నిదర్శనమని అన్నారు. అటు అంతర్జాతీయంగా మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, అమెరికా రాయబారి సెర్గియో గోర్ సైతం మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు.
ఈ చారిత్రాత్మక వేడుకల నడుమ న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) కీలక సమావేశానికి సర్వం సిద్ధమైంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో 22 రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, అగ్రనేతలు పాల్గొననున్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ హాజరయ్యే ఈ భేటీలో వికసిత్ భారత్ 2047 రోడ్మ్యాప్, సంక్షేమ పథకాలపై సమీక్ష జరగనుంది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Jun 10, 2026 11:36 AM IST













