బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వర్ధన్నపేటలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. తన తండ్రి కేసీఆర్లా తాను అంత మంచివాడిని కాదని, కార్యకర్తలను వేధించిన వారిని ఎక్కడున్నా వెతికి తీసుకువస్తానని అన్నారు. తమకు అండగా నిలిచిన వారిని కూడా ఎప్పటికీ మర్చిపోమని కేటీఆర్ స్పష్టం చేశారు.
——————————-
2. జగన్, దమ్ముంటే కాకినాడలో పోటీ చెయ్!
కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తీవ్రస్థాయిలో బహిరంగ సవాల్ విసిరారు. దమ్ముంటే కాకినాడ రూరల్లో తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించిన ఆయన.. వైసీపీ జైల్లో పుట్టిన పార్టీ అని, జనసేన జనం కోసం పుట్టిన పార్టీ అని మండిపడ్డారు.
———–
3.బీబీ-కా-అలావాలో కవిత.. ప్రభుత్వంపై విమర్శలు
తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నేత కల్వకుంట్ల కవిత తన కుమారుడితో కలిసి హైదరాబాద్లోని చారిత్రాత్మక ‘బీబీ కా అలవా’ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మొహర్రం పండుగకు కనీస వసతులు కూడా కల్పించకపోవడం దురదృష్టకరమని, ఊరేగింపు ఏనుగు వివాదంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని విమర్శించారు.
———
4.కుట్రతో ప్రభుత్వంపై దుష్ప్రచారం..!
ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో కొన్ని పార్టీలు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ కుల, మత రంగులు పులుముతున్నాయని విమర్శించారు. ఫేక్ ప్రచారాలతో ఉద్యోగులు, అధికారులను బద్నాం చేస్తూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. మానసిక సమస్యలు, డ్రగ్స్, గంజాయి ప్రభావంతో కొందరు నేరాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. తప్పు చేసినవారు ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందేనని హెచ్చరిస్తూ, ప్రజలతో అధికారులు సౌమ్యంగా వ్యవహరించాలని సూచించారు.
———-
5.నాపై కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు..!
ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వెనుక కాంగ్రెస్లో ఎలాంటి కుట్ర లేదని స్పష్టం చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఎన్నికల సంఘం భాజపాతో రాజీపడటంతోనే నామినేషన్ తిరస్కరణ జరిగిందని ఆరోపించారు. తనపై కుట్ర జరిగిందన్న ప్రచారం భాజపా సృష్టించిందని పేర్కొన్నారు. తెలంగాణలో తన కోసం ఎవరూ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం లేదని, తన రాజకీయ భవిష్యత్ మధ్యప్రదేశ్కే పరిమితమని వెల్లడించారు.
——–
6. కోర్టుకు హాజరైన అల్లు అర్జున్
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో సినీనటుడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. షూటింగ్ కారణంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరినట్లు సమాచారం. ఈ కేసులో నిందితులంతా కోర్టులో హాజరై బాండ్లపై సంతకాలు చేయగా, విచారణను జులై 6కు వాయిదా వేశారు. 2024 డిసెంబర్ 4న పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు.
———
7.సీఎం విజయ్ బర్త్డే..
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విజయ్, తొలి ఎన్నికలలోనే విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి. అభిమానులు కూడా పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్, నటుడు కమల్ హాసన్, నటి నయనతార, నటి ఖుష్బూ తదితర సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విజయ్కు శుభాకాంక్షలు తెలిపారు.
———–
8.ప్రకాశ్ రాజ్కు నాన్బెయిలబుల్ వారెంట్
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్పై ఓటరు గుర్తింపు కార్డుల వ్యవహారంలో వివాదం చెలరేగింది. ఒకే వ్యక్తికి నాలుగు వేర్వేరు రాష్ట్రాల్లో ఓటరు కార్డులు ఉన్నాయంటూ 2019లో ఫిర్యాదు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా బెంగళూరులోని 48వ ఏసీజేఎం కోర్టు ప్రకాశ్ రాజ్పై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఓటరు హక్కు కలిగి ఉండటం ఎన్నికల చట్టానికి విరుద్ధమని పిటిషనర్ ఆరోపించారు. కోర్టు సమన్లను పలుమార్లు పట్టించుకోకుండా విచారణలకు గైర్హాజరైన ప్రకాశ్ రాజ్పై బెంగళూరు కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో ఆయనపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
———
9.హర్మూజ్ మీ క్యాసినో కాదు
ఇజ్రాయెల్పై దాడులు ఆపించాలని హెజ్బొల్లాకు మద్దతు నిలిపేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించగా, ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కమిటీ ఛైర్మన్ ఇబ్రహీం అజీజి ఘాటుగా స్పందించారు. హర్మూజ్ మీ క్యాసినో కాదని అన్నారు, హర్మూజ్ జలసంధిపై నిర్ణయాలు పూర్తిగా ఇరాన్ చేతిలోనే ఉంటాయని స్పష్టం చేశారు. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హర్మూజ్ను మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించగా, దీనిపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 రోజుల్లో ఒప్పందం కుదరకపోతే జలసంధి మార్గంలో టోల్ విధిస్తామని హెచ్చరించారు.
———
10.అమెరికా- ఇరాన్ శాంతి చర్చలు
ప్రపంచ రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన మరియు చారిత్రాత్మకమైన ఘట్టం స్విట్జర్లాండ్లో మొదలైంది. అమెరికా, ఇరాన్ మరియు పాకిస్తాన్ దేశాల అగ్రనేతలు శాంతి చర్చల కోసం స్విస్ రిసార్ట్కు చేరుకున్నారు. పశ్చిమ ఆసియా (Middle East) లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మూడు దేశాల నేతలు ఒకే చోట భేటీ కావడం తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది.












