Last Updated:
వీఐపీ దర్శనాల్లో టీటీడీ ద్వంద్వ వైఖరి.. దాతల ఆగ్రహానికి కారణమవుతున్న ఆ దర్శనం ఏంటో తెలుసా?
పది వేలు ఇచ్చిన వారికి ఒక న్యాయం.. పది లక్షలు ఇచ్చిన వారికి మరో న్యాయమా? టీటీడీ దాతల దర్శన విధానంపై తీవ్ర పెదవి విరుపు! తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు. స్వామివారికి తమ భక్తిని చాటుకుంటూ ఎంతోమంది భక్తులు తమ స్థోమతకు తగ్గట్లుగా భారీగా విరాళాలు సమర్పిస్తుంటారు. అయితే, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రస్తుతం అమలు చేస్తున్న ‘దాతల దర్శన విధానం’ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పది వేల రూపాయలు ఇచ్చిన భక్తులకు కల్పిస్తున్న దర్శన భాగ్యం.. ఏకంగా పది లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చిన దాతలకు ఎందుకు కల్పించడం లేదన్న ప్రశ్న తెరపైకి వచ్చింది. టీటీడీ అనుసరిస్తున్న ఈ ద్వంద్వ వైఖరిపై భక్తుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఈ దర్శన వ్యత్యాసాలను తక్షణం సరిదిద్దాలని బాలాజీ ప్రత్యేక రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ టీటీడీని డిమాండ్ చేశారు. ప్రస్తుతం శ్రీవాణి ట్రస్ట్కు రూ.10,500 చెల్లించి టికెట్లు పొందిన భక్తులకు శ్రీవారి ఆలయంలో అత్యంత సమీపమైన ‘కులశేఖర పడి’ వరకు వెళ్లి స్వామిని దర్శించుకునే అదృష్టం కల్పిస్తున్నారు. కానీ, టీటీడీకి ఏకంగా రూ.10 లక్షలు, ఆపై భారీగా విరాళాలు అందించే దాతలకు మాత్రం కేవలం ‘లఘు దర్శనం’ (దూరం నుంచి దర్శనం) కల్పించడం ఏమాత్రం సమంజసం కాదని ఆయన స్పష్టం చేశారు. భారీగా విరాళాలు ఇచ్చే వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు.
దర్శన విధానం మార్పు వల్ల స్వామివారి దర్శనంలో అదనపు రద్దీ పెరగదనే విషయాన్ని గిరిధర్ గణాంకాలతో సహా వివరించారు. ప్రస్తుతం శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల ద్వారా ప్రతిరోజూ సుమారు 1,500 మంది భక్తులు కులశేఖర పడి వరకు వెళ్లి దర్శనం పొందుతున్నారు. అదే సమయంలో పది లక్షల రూపాయలకు పైగా విరాళాలు అందించిన దాతల్లో రోజుకు కేవలం 300 నుంచి 400 మంది మాత్రమే దర్శనానికి వస్తుంటారు. ఈ చిన్నపాటి సంఖ్యలో వచ్చే భారీ దాతలకు కూడా శ్రీవాణి టికెట్ భక్తులతో సమానంగా దర్శన సౌకర్యం కల్పించడం వల్ల ఆలయ నిర్వహణపై గానీ, భక్తుల రద్దీపై గానీ ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదన్నారు.
తాను వ్యక్తిగతంగా టీటీడీకి ఇప్పటివరకు సుమారు రూ.50 లక్షల వరకు విరాళాలు అందించినట్లు కుప్పాల గిరిధర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. విరాళాల మొత్తం ఎంతైనా దాతలందరినీ సమానంగా గౌరవించాల్సిన ప్రాథమిక బాధ్యత టీటీడీపై ఉందన్నారు. ఒకరికి ఒక రకమైన దర్శనం, మరొకరికి ఇంకో రకమైన దర్శనం కల్పించడం వల్ల దాతల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. టీటీడీ చేపట్టే ధార్మిక, సామాజిక, అన్నదాన కార్యక్రమాలకు ఈ భారీ విరాళాలే అత్యంత కీలకమని, దాతల సేవలను గుర్తించి వారికి మరింత సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలని ఆయన సూచించారు.
భారీ మొత్తంలో విరాళాలు ఇచ్చే దాతలకు తగిన గౌరవం, సముచితమైన దర్శన సౌకర్యాలు కల్పించకపోతే భవిష్యత్తులో దాతల సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ సున్నితమైన అంశాన్ని టీటీడీ పాలకమండలి సమగ్రంగా పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాల దాతలకు సమానమైన గౌరవం లభించే విధంగా, ఎవరికీ ఎలాంటి అసంతృప్తి కలగకుండా దర్శన విధానంలో వెంటనే మార్పులు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. దాతలందరికీ సమాన న్యాయం జరిగేలా పారదర్శకమైన కొత్త విధానాన్ని అమలు చేస్తే, భక్తుల్లో టీటీడీ పట్ల విశ్వాసం మరింత బలపడుతుందని కుప్పాల గిరిధర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Tirumala,Chittoor,Andhra Pradesh
Jun 24, 2026 11:47 AM IST












