Last Updated:
ఈ క్లిష్ట సమయంలో భారతదేశం వెనిజులాకు అండగా ఉంటుందని, దేశ పునర్నిర్మాణానికి, బాధితుల రక్షణకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించడానికి సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
Venuzuela Earthquakes: దక్షిణ అమెరికా దేశమైన వెనెజులాలో సంభవించిన భారీ భూకంపాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రకృతి విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన తన ఘాఢ సంతాపం తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో భారతదేశం వెనిజులాకు అండగా ఉంటుందని, దేశ పునర్నిర్మాణానికి, బాధితుల రక్షణకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించడానికి సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
గురువారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెనిజులా ప్రజలకు సంఘీభావం తెలుపుతూ సందేశాన్ని పంచుకున్నారు. “వెనెజులాలో సంభవించిన తీవ్ర భూకంపాల వల్ల జరిగిన నష్టం నన్ను ఎంతగానో కలచివేసింది. భారత ప్రజల తరపున వెనెజులా ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు, ముఖ్యంగా తమ ప్రియతములను కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము. ఈ కష్టకాలంలో బాధితులందరికీ భారతదేశం సంఘీభావంగా నిలుస్తుంది. వెనెజులాకు సాధ్యమైన అన్ని సహాయ సహకారాలను అందించడానికి భారతదేశం సిద్ధంగా ఉంది” అని ప్రధాని పేర్కొన్నారు.
Deeply saddened by the devastation caused by the severe earthquakes in Venezuela.
On behalf of the people of India, I extend our heartfelt condolences to the Government and people of Venezuela, especially to the families who have lost their loved ones. We pray for the speedy…
— Narendra Modi (@narendramodi) June 25, 2026
వెనెజులా రాజధాని కారకస్కు పశ్చిమంగా బుధవారం సాయంత్రం 6 గంటల తర్వాత కేవలం ఒక నిమిషం వ్యవధిలో 7.2 మరియు 7.5 తీవ్రతతో రెండు భారీ భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ భూకంపాల ధాటికి రాజధాని నగరంలోని పలు భవనాలు కుప్పకూలాయి. ఇప్పటివరకు అందిన అధికారిక సమాచారం ప్రకారం, ఈ విపత్తులో కనీసం 32 మంది మరణించగా, 700 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. రెస్క్యూ టీమ్లు శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తాత్కాలిక ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్స్ ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నష్టం వాటిల్లడంతో ప్రభుత్వం వెనెజులాలో ‘అత్యవసర పరిస్థితి’ ప్రకటించింది. భూకంపం వచ్చిన వెంటనే యూఎస్ సునామీ హెచ్చరికల కేంద్రం కరేబియన్ దీవులైన ప్యూర్టో రికో, వర్జిన్ ఐలాండ్స్ ప్రాంతాలకు జారీ చేసిన సునామీ హెచ్చరికలను, సముద్రంలో ఎలాంటి ప్రమాదకర అలలు నమోదు కాకపోవడంతో సుమారు గంట తర్వాత ఉపసంహరించుకుంది. భారతదేశం విపత్తు నిర్వహణలో (Disaster Management) అంతర్జాతీయంగా ఎల్లప్పుడూ ముందుంటుందని, వెనిజులా ప్రభుత్వం కోరిన వెంటనే మందులు, రెస్క్యూ మెటీరియల్స్ మరియు అవసరమైన సహాయక సామగ్రిని పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు విదేశాంగ వర్గాలు వెల్లడించాయి.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Jun 25, 2026 12:10 PM IST













