Last Updated:
తిరుమలలో భక్తుల భారీ రద్దీ కొనసాగుతోంది, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లు నిండగా సర్వదర్శనానికి 18-24 గంటలు, టీటీడీ అన్నప్రసాదం, భద్రత, వైద్య సేవలను పెంచింది
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ శనివారం కూడా భారీగా కొనసాగుతోంది. వారాంతం కావడంతో దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. దీంతో ఉచిత సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. క్యూలైన్లు ఆక్టోపస్ భవనం వరకు విస్తరించడంతో వేలాది మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఓర్పుతో నిరీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనం పూర్తయ్యేందుకు సుమారు 18 నుంచి 24 గంటల సమయం పడుతోంది. మరోవైపు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా వెళ్లే భక్తులకు 3 నుంచి 5 గంటల్లో, సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 4 నుంచి 6 గంటల్లో దర్శనం కల్పిస్తున్నారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అన్ని విభాగాలను అప్రమత్తం చేసింది. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన ఏర్పాట్లు చేపడుతోంది. ముఖ్యంగా గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల కోసం అన్నప్రసాదాల పంపిణీని గణనీయంగా పెంచింది. సాధారణ రోజుల కంటే రెట్టింపు స్థాయిలో అన్నప్రసాదాలను సిద్ధం చేసి పంపిణీ చేస్తుండగా, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో భోజన ఏర్పాట్లు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్న దాదాపు 50 వేల మంది భక్తులకు క్యూలైన్లలోనే అన్నప్రసాదాలను నేరుగా అదజేస్తున్నారు. చిన్నారులకు అవసరమైన పాలను కూడా ఎప్పటికప్పుడు పంపిణీ చేస్తూ టీటీడీ సిబ్బంది సేవలందిస్తున్నారు. ఎక్కువసేపు క్యూలైన్లలో ఉండే భక్తులకు తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
భక్తుల భద్రత విషయంలో కూడా టీటీడీ ఎలాంటి రాజీ పడటం లేదు. విజిలెన్స్ సిబ్బందితో పాటు పోలీసులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, ఆలయ పరిసరాలు, ప్రధాన రహదారుల్లో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎక్కడా తొక్కిసలాట వంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ భక్తులను క్రమబద్ధంగా దర్శనానికి పంపిస్తున్నారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులకు అవసరమైన సహాయాన్ని కూడా అందిస్తూ భద్రతా చర్యలను మరింత బలోపేతం చేశారు.
ఇక శుక్రవారం శ్రీవారిని మొత్తం 81,340 మంది భక్తులు దర్శించుకోగా, వారిలో 44,874 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారి హుండీ ద్వారా రూ.3.76 కోట్ల ఆదాయం లభించింది. అలాగే 4.42 లక్షల లడ్డూలు విక్రయించగా, 3.31 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించారు. మరో 3,916 మంది భక్తులకు టీటీడీ వైద్య సేవల ద్వారా చికిత్స అందించారు. భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో దర్శనం, అన్నప్రసాదం, భద్రత, వైద్య సేవలు వంటి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ చర్యలు కొనసాగిస్తోంది.
Tirupati,Chittoor,Andhra Pradesh
Jun 27, 2026 11:59 AM IST












