Last Updated:
ఈ వ్యూహానికి తుది రూపు ఇచ్చేందుకు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ అధ్యక్షతన ఇస్లామాబాద్లో మంగళవారం ఒక ఉన్నత స్థాయి సివిల్-మిలిటరీ సమావేశం షెడ్యూల్ అయింది.
IND-PAK: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) అంశాన్ని అంతర్జాతీయీకరించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో, పాకిస్తాన్ సివిల్-మిలిటరీ కూటమి ఇప్పుడు సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తెస్తోంది. భారత్-పాక్ మధ్య ఉన్న ‘సింధు నదీ జలాల ఒప్పందం’ (Indus Waters Treaty – IWT) వివాదాన్ని ప్రపంచ దేశాల ముందుకు తీసుకెళ్లి సరికొత్త అంతర్జాతీయ ప్రచారానికి పాక్ సైనిక, రాజకీయ నాయకత్వం సిద్ధమవుతున్నట్లు అగ్రశ్రేణి నిఘా (ఇంటెలిజెన్స్) వర్గాలు వెల్లడించాయి.
ఈ వ్యూహానికి తుది రూపు ఇచ్చేందుకు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ అధ్యక్షతన ఇస్లామాబాద్లో మంగళవారం ఒక ఉన్నత స్థాయి సివిల్-మిలిటరీ సమావేశం షెడ్యూల్ అయింది. లభించే ప్రతి అంతర్జాతీయ వేదికపైనా ఈ సింధు జలాల వివాదాన్ని తీవ్రతరం చేయడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం.
నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ఒప్పందాన్ని ఒక అంతర్జాతీయ సమస్యగా ప్రపంచం ముందు ప్రదర్శించాలని పాకిస్తాన్ భావిస్తోంది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలన్న భారత్ నిర్ణయానికి వ్యతిరేకంగా తాము ఏమాత్రం రాజీపడే ప్రసక్తే లేదని పాక్ ప్రకటించనుంది. భారత్ తమ దేశాన్ని “ఎండబెట్టడానికి” (నీరు లేకుండా చేయడానికి) ప్రయత్నిస్తోందని, ఇది తమ ఆర్థిక, వ్యవసాయ జీవనరేఖకు ముప్పని చిత్రీకరిస్తూ ప్రపంచ దేశాల ముందు ఏడవాలని ఇస్లామాబాద్ ప్లాన్ చేస్తోంది.
ఈ సమావేశానికి ముందే పాక్ నేతలు తమ మాటల పదును పెంచారు. సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించడం కోసం పాకిస్తాన్ “పోరాడుతుందని” అక్కడి ఫెడరల్ మంత్రులు ప్రకటిస్తున్నారు. “మా నీటిని తాకే చేతులను నరికేస్తాం” అని ఒక మంత్రి హెచ్చరించగా, భారత ప్రధాని నరేంద్ర మోదీ “జల ఉగ్రవాదానికి” పాల్పడుతున్నారని సీనియర్ నాయకులు ఆరోపిస్తున్నారు. దేశ నీటి భద్రతకు వచ్చే ఎలాంటి ముప్పుకైనా పూర్తిస్థాయిలో సమాధానం ఇచ్చేందుకు పాక్ సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని ప్రగల్భాలు పలుకుతున్నారు.
అయితే, ప్రపంచవ్యాప్తంగా ఒప్పందాలు లేకపోయినా నదీ జలాలు ప్రవహిస్తాయని, నదీ ప్రవాహాన్ని అడ్డుకునే హక్కు భారత్కు లేదని పాక్ వాదిస్తోంది. మరోవైపు, ఆ దేశ వాతావరణ శాఖ మంత్రి డాక్టర్ ముసాదిక్ మాలిక్ మాత్రం.. పాకిస్తాన్లోకి వచ్చే నదీ ప్రవాహాలను విచక్షణారహితంగా అడ్డుకునే మౌలిక సదుపాయాల సామర్థ్యం (ఇన్ఫ్రాస్ట్రక్చర్) ప్రస్తుతం భారత్కు లేదని పేర్కొన్నారు. నిధుల కొరత కారణంగా పాక్కు చెందిన డయామర్-భాషా, దాసు డ్యామ్ ప్రాజెక్టులు కుంటుపడినప్పటికీ, ఈ జల వివాదాన్ని అంతర్జాతీయ జోక్యం అవసరమైన ప్రపంచ సమస్యగా చూపించడానికే ఇస్లామాబాద్ ప్రయత్నిస్తోంది.
అగ్రశ్రేణి నిఘా వర్గాల విశ్లేషణ ప్రకారం.. పీఓకే (PoK) విషయంలో అంతర్జాతీయ ఒత్తిడిని తీసుకురావడంలో ఘోరంగా విఫలమైన పాక్ సివిల్-మిలిటరీ యంత్రాంగం, ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే ఉద్దేశపూర్వకంగా ఈ కొత్త బాహ్య సంక్షోభాన్ని సృష్టిస్తోంది.
పాకిస్తాన్లో రోజురోజుకూ దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ, రాజకీయ అస్థిరత, వ్యూహాత్మక పరాజయాలు, ముఖ్యంగా పీఓకేలో ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న తీవ్ర ఆగ్రహాన్ని పక్కదారి పట్టించేందుకే ఇస్లామాబాద్ ఈ డ్రామా ఆడుతోంది. “జల ఉగ్రవాదం” వంటి ఎమోషనల్ పదాలను వాడుతూ, అతి-జాతీయవాద భావజాలాన్ని రేకెత్తించడం ద్వారా.. దేశంలోని వనరుల దుర్వినియోగం, నాయకత్వంపై ప్రజల్లో నశించిన నమ్మకం వంటి అంతర్గత సమస్యల నుంచి ప్రజల మైండ్ను డైవర్ట్ చేయడమే పాక్ పాలకుల అసలు ప్లాన్ అని ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టం చేశాయి.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Jun 30, 2026 11:54 AM IST













