తేజస్విని ప్రకాష్ కేవలం బుల్లితెరకు పరిమితమైన నటి కాదు. ఆమె వెండితెరపై కూడా తన సత్తా చాటిన నటి. నటన ఆమెకు పుట్టుకతోనే అబ్బింది. కన్నడ చిత్ర పరిశ్రమలో సుప్రసిద్ధ స్టంట్ మాస్టర్, కోఆర్డినేటర్ అయిన దివంగత ప్రకాష్ (2020లో మరణించారు), కన్నడ టెలివిజన్ సీనియర్ నటి వినయ దంపతుల కుమార్తె తేజస్విని. పుట్టింట్లో కన్నడ, కొంకణి సంస్కృతుల్లో పెరిగిన ఆమె, 2022లో ఫణి వర్మ నడింపల్లి అనే తెలుగు వ్యక్తిని వివాహం చేసుకుని అచ్చమైన తెలుగు కోడలిగా మారింది. వీరికి ఒక పాప కూడా ఉంది. ఈ బ్యాగ్రౌండ్ కారణంగానే తేజస్విని తెలుగు భాషను చాలా స్పష్టంగా మాట్లాడుతూ, ఇక్కడి ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా నటిస్తోంది.













