Last Updated:
టీటీడీ డొనేషన్ పాలసీలో మార్పులు: వ్యక్తిగత దాతలకు ప్రివిలేజ్లు 20 ఏళ్లకు, సంస్థాగత దాతలకు 15 ఏళ్లకు పరిమితం. కొత్త స్లాబ్లు, కొన్ని ప్రివిలేజ్ల తొలగింపు.
టీటీడీ ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించే భక్తులకు కల్పించే ప్రత్యేక సౌకర్యాల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నో సంవత్సరాలుగా అమలులో ఉన్న డొనేషన్ పాలసీకి పూర్తిగా కొత్త రూపం ఇస్తూ టీటీడీ బోర్డు సంచలన మార్పులకు ఆమోదం తెలిపింది. దాతలకు అందించే దర్శనాలు, వసతి, సేవలు, లడ్డూలు, ప్రత్యేక బహుమతులు వంటి అన్ని ప్రివిలేజీలను పునర్వ్యవస్థీకరించడంతో పాటు, విరాళాల స్లాబ్లను కూడా పెంచుతూ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది.
ఈ కొత్త పాలసీలో అత్యంత కీలకమైన మార్పు వ్యక్తిగత దాతలకు ఇప్పటివరకు జీవితాంతం వర్తించే ప్రత్యేక హక్కులను రద్దు చేయడమే. ఇకపై వ్యక్తిగతంగా విరాళాలు ఇచ్చే భక్తులకు ప్రివిలేజీలు కేవలం 20 సంవత్సరాలపాటు మాత్రమే వర్తించనున్నాయి. అదే సమయంలో కంపెనీలు, ట్రస్టులు, ఇతర సంస్థాగత దాతలకు ఇప్పటివరకు అమలులో ఉన్న 20 ఏళ్ల ప్రివిలేజ్ కాలాన్ని 15 సంవత్సరాలకు తగ్గించింది. దీంతో వ్యక్తిగత, సంస్థాగత దాతలిద్దరికీ కాలపరిమితి విధిస్తూ టీటీడీ కొత్త విధానాన్ని అమలు చేయనుంది.
మధ్యతరగతి భక్తులను దృష్టిలో ఉంచుకుని కొత్తగా రూ.2 లక్షలు, రూ.3 లక్షలు, రూ.4 లక్షలు, రూ.15 లక్షలు, రూ.20 లక్షల విరాళాల స్లాబ్లను ప్రవేశపెట్టింది. గతంలో లేని SED టికెట్లను కొత్తగా చేర్చడమే కాకుండా, అధిక విరాళాలు అందించే దాతలకు కల్యాణోత్సవ సేవలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. మరోవైపు మహాప్రసాదం ప్యాకెట్లు, వేద ఆశీర్వచనం వంటి కొన్ని ప్రివిలేజీలను పూర్తిగా తొలగించింది.
బహుమతుల విషయంలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు అందించే 5 గ్రాముల బంగారు డాలర్ను 2 గ్రాములకు తగ్గించగా, 50 గ్రాముల వెండి నాణెన్ని 10 గ్రాములకు పరిమితం చేసింది. కొన్ని స్లాబ్లలో చిన్న లడ్డూల సంఖ్యను పెంచిన టీటీడీ, పెద్ద లడ్డూల సంఖ్యను మాత్రం తగ్గించింది. అలాగే విరాళాల మొత్తాన్ని బట్టి దర్శనం, వసతి, ఇతర సౌకర్యాల్లోనూ కొత్త మార్గదర్శకాలను రూపొందించింది.
అధిక మొత్తంలో విరాళాలు అందించే దాతలకు మాత్రం మరిన్ని ప్రత్యేక సౌకర్యాలను కల్పించేలా పాలసీని రూపొందించింది. రూ.50 లక్షలు, రూ.75 లక్షలు, రూ.1 కోటి విరాళాలు ఇచ్చే దాతలకు సుప్రభాత సేవలు, కల్యాణోత్సవ సేవల సంఖ్యను పెంచింది. అంతేకాకుండా వ్యక్తిగత దాతలకు రూ.1.5 కోట్లు, సంస్థాగత దాతలకు రూ.2 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ విరాళాల కోసం కొత్త అత్యున్నత స్లాబ్ను ప్రవేశపెట్టింది.
ఈ అత్యున్నత కేటగిరీలో ఉన్న దాతలకు గరిష్ఠంగా 40 సుప్రభాత సేవలు, ఐదు కల్యాణోత్సవ సేవలు, నాలుగు నుంచి ఐదు రోజుల బ్రేక్ దర్శనం, నాలుగు రోజుల సుపథం ప్రవేశం, అధిక సంఖ్యలో లడ్డూలు, బంగారు డాలర్, వెండి నాణెం, ప్రత్యేక వసతి వంటి అనేక సౌకర్యాలు కల్పించనున్నట్లు టీటీడీ నిర్ణయించింది.
మొత్తం మీద దాతలకు అందించే సౌకర్యాలను విరాళాల స్థాయికి అనుగుణంగా మరింత క్రమబద్ధీకరించడం, పారదర్శకతను పెంచడం, అదే సమయంలో సామాన్య భక్తుల దర్శనాలకు ప్రాధాన్యం కల్పించడం లక్ష్యంగా టీటీడీ ఈ కొత్త డొనేషన్ పాలసీని రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ మార్పులతో తిరుమలలో విరాళాల విధానం కొత్త దశలోకి అడుగుపెట్టనుంది.
Tirumala,Chittoor,Andhra Pradesh














