Last Updated:
ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జరుగుతున్న జగన్నాథ రథయాత్రలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. స్వామివారి రథం సాగే బడా దండా (గ్రాండ్ రోడ్) ప్రాంతంలో జనసంద్రం పోటెత్తడంతో విపరీతమైన రద్దీ నెలకొంది. ఈ క్రమంలో ఊపిరాడక 200 మంది భక్తులు అస్వస్థతకు గురవగా.. ఒకరు మరణించారు.
ఒడిశా పూరీ జగన్నాథ రథయాత్రలో భారీ రద్దీ కారణంగా అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామివారి రథం సాగే బడా దండా (గ్రాండ్ రోడ్) వీధిలో భక్తులు పోటెత్తడంతో విపరీతమైన తోపులాట జరిగి, శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. ఈ క్రమంలో 200 మందికి పైగా భక్తులకు ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇప్పటికే ఒకరు మరణించగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమచారం. బాధితులను స్పెషల్ రెస్క్యూ యూనిట్ (SRU) బృందాలు వేగంగా స్పందించి రక్షించాయి. తక్షణమే చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం వారికి వైద్యుల పర్యవేక్షణలో అత్యవసర చికిత్స అందుతోంది. కుండపోత వర్షంలోనూ భక్తులు లక్షలాదిగా తరలిరావడంతో రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎక్కడా తొక్కిసలాట జరగకుండా పోలీసులు, సహాయక బృందాలు జనసందోహాన్ని అదుపు చేస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని అధికారులు స్పష్టం చేశారు.
VIDEO | Puri, Odisha: A person, who appeared to have fainted, taken for medical treatment as huge number of people gather to attend the annual Jagannath Rath Yatra.
Heavy security arrangements have been put in place to manage the surge in footfall and ensure the smooth conduct… pic.twitter.com/jhf32hhPKo— Press Trust of India (@PTI_News) July 16, 2026
గత ఏడాది (2025) జరిగిన పూరీ జగన్నాథ రథయాత్రలో కూడా ఒక ఘోరమైన ప్రమాదం చోటుచేసుకుంది. వార్షిక రథయాత్ర సందర్భంగా శ్రీ గుండిచా ఆలయం సమీపంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ దురదృష్టకర ఘటనలో కనీసం ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పవిత్ర పూజా సాగగ్రిని తీసుకువస్తున్న రెండు ట్రక్కులు అప్పటికే భక్తులతో కిక్కిరిసిపోయిన శరధాబలి ప్రాంతంలోకి ప్రవేశించాయి. ట్రక్కులు లోపలికి రావడంతో అక్కడ ఉన్న జనసందోహంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా తోపులాట జరిగి తొక్కిసలాటకు దారితీసింది.
స్వామివారి పవిత్ర ‘పహుడా’ ఆచారాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయం వద్ద వేచి చూశారు. ఈ ఆచారం ప్రకారం దేవతామూర్తుల ముఖాలను కప్పిన వస్త్రాన్ని తొలగిస్తారు. ఈ అద్భుత ఘట్టాన్ని చూడాలనే ఆరాటంలో భారీగా తరలివచ్చిన జనసందోహం నడుమ ట్రక్కులు రావడంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














