Last Updated:
Ras Tanura Refinery: యెమెన్పై సౌదీ అరేబియా విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేసే వరకు ఎర్ర సముద్రం (Red Sea)లో నౌకలను అడ్డుకుంటామని హౌతీలు హెచ్చరించారు. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన బాబ్ ఎల్-మాండెబ్ జలసంధిని మూసివేస్తామని తిరుగుబాటుదారులు ప్రకటించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు నానాటికీ తీవ్రమవుతున్నాయి. ఒకవైపు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య వరుస దాడులు కొనసాగుతుండగా, మరోవైపు సౌదీ అరేబి, యెమెన్ లోని ఇరాన్ మద్దతు దారులైన హౌతీ (Houthis) తిరుగుబాటుదారుల మధ్య జరుగుతున్న దాడులు ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనలో ముంచేస్తున్నాయి.
రాస్ తనురా రిఫైనరీపై డ్రోన్ దాడులు:
తాజాగా, సౌదీ అరేబియాలోని అత్యంత కీలకమైన, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటైన అరామ్కో (Saudi Aramco)కి చెందిన ‘రాస్ తనురా’ (Ras Tanura) రిఫైనరీపై హూతీ తిరుగుబాటుదారులు డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో భారీ దాడికి పాల్పడ్డారు. హౌతీ మిలిటరీ ప్రతినిధి యహ్యా సారియా (Yahya Sarea) ఈ దాడికి తామే బాధ్యులమని అధికారికంగా ప్రకటించారు. యెమెన్పై సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు జరుపుతున్న వైమానిక దాడులకు వ్యతిరేకంగా తాము ఈ ప్రతిదాడులు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ దాడి కారణంగా రిఫైనరీ వద్ద భారీగా మంటలు చెలరేగాయనీ, అయితే మంటలను వెంటనే అదుపులోకి తెచ్చామని, ప్రాణనష్టం లేదా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరగలేదని సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ, ‘సౌదీ ప్రెస్ ఏజెన్సీ (SPA)’ స్పష్టం చేశాయి,. దాడి జరిగిన వెంటనే భద్రతా కారణాల దృష్ట్యా రిఫైనరీని తాత్కాలికంగా మూసివేసి, ఉత్పత్తిని నిలిపివేసినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ ధృవీకరించింది.
యెమెన్పై సౌదీ అరేబియా విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేసే వరకు ఎర్ర సముద్రం (Red Sea)లో నౌకలను అడ్డుకుంటామని హౌతీలు హెచ్చరించారు. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన బాబ్ ఎల్-మాండెబ్ జలసంధిని మూసివేస్తామని తిరుగుబాటుదారులు ప్రకటించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ జలసంధి.. ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఏడెన్ (Gulf of Aden)తో కలిపే అతి ముఖ్యమైన నౌకా రవాణా మార్గం. దీంతో ప్రపంచ వాణిజ్యంలో సుమారు 12 శాతం చమురు రవాణా ఇదే మార్గం గుండా వెళ్తుంది. హౌతీల దాడులు, బెదిరింపుల కారణంగా వాణిజ్య నౌకలు ప్రత్యామ్నాయ, సుదీర్ఘ మార్గాల ద్వారా వెళ్లాల్సి వస్తోంది.
హార్ముజ్ జలసంధి, ముడి చమురు ధరలపై ఎఫెక్ట్:
ఇప్పటికే ఇరాన్-అమెరికా మధ్య ఉన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయ చమురు మార్కెట్ను కుదిపేస్తోంది. ప్రపంచ చమురు, LNG సరఫరాలో 20 శాతం వాటా ఉన్న కీలకమైన ‘హార్ముజ్ జలసంధి’ గుండా నౌకల రాకపోకలు తీవ్ర అంతరాయం ఎదుర్కొంటున్నాయి. సౌదీ అరేబియా ప్రపంచంలోనే అత్యధిక చమురు ఎగుమతి చేసే దేశం కాగా, రాస్ తనురా వంటి కీలక కేంద్రాలపై దాడులు జరగడం వల్ల ప్రపంచ ఇంధన భద్రత ప్రమాదంలో పడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అరామ్కో రిఫైనరీ తాత్కాలిక మూసివేత, సరఫరా ఆందోళనల వార్తలు బయటకు రాగానే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా 9 శాతానికి పైగా పెరిగాయని బ్లూంబెర్గ్, మింట్ నివేదించాయి.
హౌతీలు సౌదీ ఇంధన కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడం కొత్త కాదు. 2019 సెప్టెంబర్లో సౌదీ అరేబియాలోని అబ్ఖైక్ (Abqaiq), ఖురైస్ (Khurais) చమురు కేంద్రాలపై ఇదే తరహా భారీ దాడులు జరిగాయి. అప్పట్లో ఆ దాడుల కారణంగా సౌదీ అరేబియా తన చమురు ఉత్పత్తిని సగానికి పైగా (రోజుకు 5 మిలియన్ బ్యారెళ్లు) నిలిపివేయాల్సి వచ్చింది, తద్వారా ప్రపంచ చమురు సరఫరాలో 5 శాతం మేర ఆగిపోయింది. ప్రస్తుత పరిణామాలు సైతం అటువంటి సంక్షోభాన్నే సృష్టిస్తాయని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఆందోళన చెందుతున్నాయి. ఈ దాడులను అమెరికా, ఐక్యరాజ్యసమితి (UN) తీవ్రంగా ఖండించాయి. కచ్చితమైన చర్యలు తీసుకోకపోతే ఇంధన ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యులపై తీవ్ర భారం పడే ప్రమాదం ఉంటుంది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














