ప్రస్తుతం కాంగోలో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. జూలై చివరి నాటికి 2,500కు పైగా నిర్ధారిత కేసులు, 1,000కి పైగా మరణాలు నమోదయ్యాయి. కొన్ని నివేదికల ప్రకారం మరణాల సంఖ్య 1,400 దాటింది. కొత్త కేసుల్లో ఎక్కువ కేసులు.. ఇప్పటివరకూ గుర్తించిన కాంటాక్ట్లను దాటి.. వేరే ప్రాంతాల్లో నమోదైనవి. అంటే దాని అర్థం.. ఈ వ్యాధి.. మరిన్ని కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తున్నట్లే. అంటే.. దీన్ని కంట్రోల్ చెయ్యడం మరింత కష్టం అవుతున్నట్లేనని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది.
ఇదివరకు 2014-16లో ఇలాగే పశ్చిమ ఆఫ్రికాలో ఎబోలా మహమ్మారి వేగంగా వ్యాపించింది. అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ వేగంగా విస్తరిస్తోంది. బుండిబుగ్యో స్ట్రెయిన్కు ప్రస్తుతం లైసెన్స్ పొందిన వ్యాక్సిన్ లేదు. చికిత్స పరిమితంగా ఉంది. చాలా మందికి సరైన ట్రీట్మెంట్ అందట్లేదు. దాంతో.. వారి నుంచి ఇతరులకు ఈ వ్యాధి సోకుతోంది. ముఖ్యంగా కాంగోలో డాక్టర్లు, నర్సుల కొరత బాగా ఉంది. ప్రజల్లో అపోహలు ఎక్కువ. దాంతో ఈ వ్యాధి అక్కడ కంట్రోల్ అవ్వట్లేదు.
ఇండియాపై ప్రభావం ఉందా?
ప్రస్తుతం భారత్లో ఎబోలా కేసులు లేవు. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ, ICMR అప్రమత్తమయ్యాయి. ఎబోలా ప్రభావిత ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా, ఆరోగ్య పరీక్షలు, ఎయిర్పోర్ట్లలో స్క్రీనింగ్ చర్యలు చేపట్టాలని సూచించాయి. ఢిల్లీ ఎయిర్పోర్టు కూడా ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం భారత ప్రజలకు తక్షణ ప్రమాదం తక్కువగానే ఉన్నా పర్యవేక్షణ కొనసాగుతోంది.
ఎబోలా వైరస్ గాలి ద్వారా వ్యాపించదు. వైరస్ సోకిన వ్యక్తి రక్తం, వాంతులు, చెమట, లాలాజలం, ఇతర శరీర ద్రవాలు, వాటితో కలుషితమైన వస్తువులను తాకడం ద్వారా వ్యాపిస్తుంది. మరణించిన బాధితుల శరీరాన్ని తాకినా వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది. లక్షణాలు కనిపించిన తర్వాతే ఎక్కువగా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
లక్షణాలు ఏమిటి?
ప్రారంభంలో అధిక జ్వరం, తీవ్రమైన బలహీనత, తలనొప్పి, కండరాల నొప్పులు కనిపిస్తాయి. తరువాత వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, కొన్నిసార్లు అంతర్గత లేదా బాహ్య రక్తస్రావం సంభవించవచ్చు. వైరస్ ఇంక్యుబేషన్ కాలం సాధారణంగా 2 నుంచి 21 రోజుల వరకు ఉంటుంది.
వ్యాక్సిన్ లేదా చికిత్స ఉందా?
ప్రస్తుతం ప్రపంచంలో జైర్ (Zaire) ఎబోలా స్ట్రెయిన్కు మాత్రమే ఆమోదిత వ్యాక్సిన్ ఉంది. కానీ ప్రస్తుతం కాంగోలో వ్యాపిస్తున్న బుండిబుగ్యో స్ట్రెయిన్కు ఆమోదం పొందిన వ్యాక్సిన్ లేదా నిర్దిష్ట చికిత్స లేదు. కొన్ని ప్రయోగాత్మక వ్యాక్సిన్లు, చికిత్సలపై పరిశోధనలు కొనసాగుతున్నా.. అవి ఇంకా సాధారణ వినియోగానికి అందుబాటులోకి రాలేదు.
ఎబోలా ప్రభావిత దేశాలకు అనవసర ప్రయాణాలు నివారించడం మంచిది. ప్రయాణం తప్పనిసరి అయితే స్థానిక ఆరోగ్య మార్గదర్శకాలను పాటించాలి. అనారోగ్యంతో ఉన్న వ్యక్తుల శరీర ద్రవాలను తాకకుండా ఉండాలి. చేతులను తరచూ సబ్బుతో కడుక్కోవాలి లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ ఉపయోగించాలి. అడవి జంతువుల మాంసం తినకూడదు. విదేశీ ప్రయాణం తర్వాత జ్వరం లేదా ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించి ప్రయాణ చరిత్రను తెలియజేయాలి.
మొత్తంగా కాంగోలో ఎబోలా పరిస్థితి ప్రపంచ ఆరోగ్య రంగానికి పెద్ద సవాలుగా మారింది. ప్రస్తుతం భారతదేశంలో ప్రమాదం తక్కువగా ఉన్నప్పటికీ అప్రమత్తత, పరిశుభ్రత, అధికారిక ఆరోగ్య సూచనలను పాటించడం అత్యంత ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.













