Last Updated:
Allu Arjun: సరిగ్గా పుష్ఫ 2 సినిమా గ్రాండ్ సక్సెస్ అయిన సమయంలో.. జరిగిన విషాద ఘటన.. అల్లు అర్జున్ కెరీర్లో షాడోలా మారింది. ఆ సంధ్య థియేటర్ కేసు ఆయన్ని వెంటాడుతోంది.
నేడు (జూన్ 22) టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతారా? లేదా క్వాష్ పిటిషన్ దాఖలు చేస్తారా? అన్నది ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి రేపుతోంది. పుష్ప 2 సినిమా ప్రదర్శన సమయంలో జరిగిన తొక్కిసలాట కేసుకు సంబంధించి హైదరాబాద్లోని నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ సహా ఇతరులకు ఇటీవల సమన్లు జారీ చేసింది. ఈ సందర్భంగా ఇవాళ అల్లు అర్జున్ కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంది. ఐతే.. ఆయన వర్చువల్గా హాజరవ్వవచ్చా అని అడిగితే.. కోర్టు అందుకు ఒప్పుకోలేదు.
కోర్టు ఎందుకు సమన్లు పంపింది? కేసు పూర్తి వివరాలు:
డిసెంబర్ 4, 2024న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్లో ‘పుష్ప 2: ది రూల్’ సినిమా స్పెషల్ ప్రీమియర్ షో వేశారు. ఆ సమయంలో హీరో అల్లు అర్జున్ను చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున పోటెత్తడంతో తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో రేవతి అనే 39 ఏళ్ల మహిళ ఊపిరాడక మరణించగా, ఆమె ఎనిమిదేళ్ల కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తగిన భద్రతా అనుమతులు లేకుండా కార్యక్రమం నిర్వహించడం, పోలీసుల హెచ్చరికలు పట్టించుకోకపోవడం, సమన్వయ లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని దర్యాప్తులో పోలీసులు నిర్ధారించారు. దర్యాప్తు తర్వాత పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీటులో మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చారు. ఇందులో థియేటర్ యాజమాన్యం, మేనేజర్ తదితరులను ఏ1 (A1) నుంచి ఏ10 (A10) గా చెప్పగా, నటుడు అల్లు అర్జున్ను ఏ11గా చేర్చారు.
ఈ ఛార్జిషీటును పరిశీలించిన నాంపల్లి క్రిమినల్ కోర్టు, నేడు (జూన్ 22న) విచారణకు స్వయంగా హాజరు కావాలని అల్లు అర్జున్తో పాటు మరో 19 మందికి సమన్లు జారీ చేసింది. అంతకుముందు డిసెంబర్ 13, 2024 న ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేయగా, తెలంగాణ హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పొంది విడుదలయ్యారు. తర్వాత ఆయనకు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరైంది.
కోర్టు ఆదేశాల ప్రకారం నేడు అల్లు అర్జున్ స్వయంగా నాంపల్లి కోర్టులో విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే, ఆయన నేరుగా కోర్టుకు వస్తారా? లేక ఈ కేసులో తనపై ఉన్న అభియోగాలను కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ (Quash Petition) వేసి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతారా అనేది ఇంకా సస్పెన్స్గానే ఉంది. దీనిపై అల్లు అర్జున్ న్యాయ బృందం స్పందిస్తూ.. “సోమవారం విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం” అని మాత్రమే చెప్పింది. ఒకవేళ నేడు నిందితులందరూ కోర్టు ముందుకు హాజరైతే, తర్వాతి ట్రయల్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













