నదియాలో జరిగిన ఒక పరిపాలనా సమావేశం తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అన్నపూర్ణ యోజన కింద మహిళలకు నెలకు రూ.3,000 అందించేందుకు మే 27 నుంచి ఫారాలు జారీ చేయడం ప్రారంభిస్తామని ప్రకటించారని న్యూస్18 తెలిపింది.
పాఠశాలలు, కళాశాలలు, ప్రార్థనా స్థలాలకు ఒక కిలోమీటరు పరిధిలో మద్యం దుకాణాలను అనుమతించబోమని కూడా ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి సుమారు 400 ప్రత్యేక క్యాంటీన్లలో వారానికి రెండుసార్లు రూ.5 రాయితీ ధరతో చేపలు, అన్నం భోజనాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.
పశ్చిమ బెంగాల్లో అధికారం చేపట్టినప్పటి నుంచి, సువేందు అధికారి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం.. గత మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న వివిధ నిర్ణయాలను రద్దు చేస్తూ, అనేక కార్యక్రమాలను, పథకాలను ప్రకటించింది.
2026 అసెంబ్లీ ఎన్నికలలో టీఎంసీపై బీజేపీ భారీ విజయం సాధించి, బెనర్జీ 15 ఏళ్ల పాలనకు ముగింపు పలికిన తర్వాత, మే 9న సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
అక్రమ వలసలు: సువేందు అధికారి నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం “గుర్తించండి, తొలగించండి, బహిష్కరించండి” విధానం కింద కఠినమైన ఆంక్షలను ప్రకటించింది. అక్రమ విదేశీయులు, విదేశీ సంతతికి చెందిన ఖైదీలను నిర్బంధించడానికి “హోల్డింగ్ సెంటర్లను” ఏర్పాటు చెయ్యాలని జిల్లా మేజిస్ట్రేట్లందరికీ ఆదేశాలు జారీ చేసింది.
నియామక విధానం: ప్రభుత్వ రంగ నియామకాలలో అవకతవకలను అరికట్టడానికి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం కొత్త నియామక విధానాన్ని ప్రవేశపెడుతుందని సువేందు అధికారి తెలిపారు.
ఆయుష్మాన్ భారత్ పథకం: కేంద్రం తెచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకంలో రాష్ట్రం కూడా చేరబోతోందని, జూలై నుంచి కార్డులు పంపిణీ చేస్తామని సీఎం ప్రకటించారు.
సరిహద్దు కంచె: ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దు వెంట కంచె కోసం 27 కిలోమీటర్ల భూమిని అప్పగించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారి తెలిపారు. సరిహద్దు అవుట్పోస్టులు (BOPs), సరిహద్దు భద్రతా దళం (BSF) మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా భూమిని అందిస్తామని ఆయన ప్రకటించారు.












