“నాకు తెలిసినంత వరకు, ఇండోనేషియా, వియత్నాం రెండింటితోనూ ఒప్పందాలు తుది దశలో ఉన్నాయి. వాస్తవానికి, వియత్నాంతో ఒప్పందం ఇప్పటికే కుదిరిందని నేను భావిస్తున్నాను. బహుశా బహిరంగంగా ప్రకటించకపోయినా, ఇప్పటికే కుదిరింది,” అని షాంగ్రి-లా డైలాగ్లో భారత రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ విలేకరులతో అన్నారు.
ఈ దేశాలు మిత్ర, విదేశీ దేశాల కోవలోకి వస్తాయనీ, ఈ రకమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడానికి భారతదేశం సంతోషిస్తుందని సింగ్ నొక్కి చెప్పారు. “ఆసియాన్ దేశాల పట్ల భారతదేశానికి బలమైన నిబద్ధత ఉంది. మనం వారందరినీ మిత్ర విదేశీ దేశాలుగా పరిగణిస్తాం, వారితో మనం అధునాతన రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోగలం,” అని ఆయన చెప్పారు.
భారతదేశంతో ఏ దేశాలు బ్రహ్మోస్ ఒప్పందాలపై సంతకాలు చేశాయి?
స్థానిక వినియోగం, ఎగుమతుల కోసం దేశీయ రక్షణ తయారీని అభివృద్ధి చేస్తున్న భారతదేశం,.. సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను అమ్మడానికి ఫిలిప్పీన్స్తో ఒక ఒప్పందం కుదుర్చుకుందని న్యూస్18 ఇంగ్లీష్ తెలిపింది. రిపోర్టుల ప్రకారం, ఈ నెల ప్రారంభంలో తన 3 రోజుల భారత పర్యటన సందర్భంగా.. వియత్నాం అధ్యక్షుడు టో లామ్.. బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలుపై చర్చించారు.
భారతదేశం బ్రహ్మోస్ క్షిపణుల్ని ఎందుకు అమ్ముతోంది? కారణం సింపుల్.. మన దేశం ‘యాక్ట్ ఈస్ట్’ పాలసీ కలిగివుంది. అందువల్ల తూర్పూ ఆసియా దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పుకుంటోంది. అలాగే.. ఆగ్నేయాసియాలో చైనా ప్రభావాన్ని ఎదుర్కోవాలంటే.. అక్కడి దేశాలకు భారత్ దగ్గరవ్వాలి. బ్రహ్మోస్ అమ్మకాలతో ఇది సాధ్యమవుతుంది. దక్షిణ చైనా సముద్రంలో తరచూ చైనా ఉద్రిక్తతలను పెంచుతోంది. అందువల్ల.. ఫిలిప్పీన్స్, వియత్నాం, ఇండొనేసియా.. జాగ్రత్త పడుతూ.. మన బ్రహ్మోస్ తమ దగ్గర ఉంటే.. చైనాకి చెక్ పెట్టవచ్చని భావిస్తున్నాయి.
టో లామ్ పర్యటన సందర్భంగా, క్షిపణులను కొనుగోలు చేయడానికి 700 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందంపై భారత్, వియత్నాం చర్చలను ముందుకు తీసుకెళ్లాయి. “మేము (భారత్, వియత్నాం) అనేక ప్లాట్ఫారమ్ల గురించి మాట్లాడుకుంటాము, బ్రహ్మోస్ ప్లాట్ఫారమ్ కూడా వాటిలో ఒకటి,” అని అప్పటి విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
మార్చిలో, 200 మిలియన్ డాలర్ల నుంచి 350 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందంపై బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయడానికి ఇండోనేషియా భారతదేశంతో చర్చలు ప్రారంభించింది. ఈ ఒప్పందం వల్ల, క్షిపణి కార్యక్రమానికి విడిభాగాలు, ఉపవ్యవస్థలను సరఫరా చేసే అనేక భారతీయ రక్షణ కంపెనీలకు ప్రయోజనం కలుగగలదు.
ఈ ఒప్పందం ఖరారైతే, ఫిలిప్పీన్స్ తర్వాత బ్రహ్మోస్ క్షిపణికి ఇండోనేషియా రెండో అంతర్జాతీయ కొనుగోలుదారుగా నిలుస్తుంది. అయితే, ఈ ఒప్పందం విలువ, కొనే క్షిపణి వ్యవస్థల సంఖ్యను ఇంకా వెల్లడించలేదు.
బ్రహ్మోస్ ఒక సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, అత్యంత అధునాతనమైన వాటిలో ఒకటి. ఇది భారతదేశ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO), రష్యాకి చెందిన NPO మషినోస్ట్రోయెనియా కలిసి తయారుచేస్తున్న క్షిపణి. ఈ సంస్థను బ్రహ్మోస్ ఏరోస్పేస్గా పిలుస్తారు. ఈ పేరు రెండు నదుల కలయిక. అంటే బ్రహ్మపుత్ర (భారతదేశం), మాస్క్వా (రష్యా).
ఇది మాక్ 2.8 నుంచి 3.0 వేగంతో (ధ్వని వేగానికి దాదాపు 3 రెట్లు) ప్రయాణిస్తుంది, అందువల్ల ప్రస్తుతం ఉన్న వాయు రక్షణ వ్యవస్థలు దీనిని అడ్డగించడం దాదాపు అసాధ్యం. దీని అసలు పరిధి 290 కి.మీ. కాగా, విస్తరించిన (ER) పరిధి 450 కి.మీ. నుంచి 800 కి.మీ. వరకు ఉంటుంది. ఇది రాడార్ నుంచి తప్పించుకోవడానికి 3-10 మీటర్ల తక్కువ ఎత్తులో సముద్ర ఉపరితలానికి దగ్గరగా ప్రయాణించగలదు లేదా 15 కి.మీ.ల ఎత్తు వరకు ఎగరగలదు.












