Last Updated:
సీబీఎస్ఈ పోర్టల్పై హ్యాకర్లు సైబర్ దాడి చేశారు. దాంతో సైట్లో రీ వ్యాల్యూయేషన్ కోసం ఫీజుల మధ్య భారీ వ్యత్యాసం కనిపించింది. రూ. 1 నుంచి రూ. 67 వేల మధ్య కనిపించింది. దీనిపై విద్యాశాఖా అధికారి స్పందించారు.
CBSE Portal Hack: సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులు తమ జవాబు పత్రాల స్కాన్డ్ కాపీలను పొందేందుకు దరఖాస్తు చేసుకునే సమయంలో ఎదుర్కొన్న ప్రధాన చెల్లింపుల (Payment) సమస్యలకు దాదాపు 50 మంది విద్యార్థుల ‘ఆకతాయి పనులే’ కారణమని, వారు బోర్డు పోర్టల్ను హ్యాక్ చేశారని ఒక సీనియర్ విద్యాశాఖ అధికారి శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. “అందువల్లనే కొందరు విద్యార్థులకు జవాబు పత్రం యాక్సెస్ కోసం ఏకంగా రూ. 67,000 చెల్లించాలనే మెసేజ్ రాగా, మరికొందరికి కేవలం రూ. 1 మాత్రమే చూపించింది” అని ఆ అధికారి వివరించారు.
బోర్డు ప్రవేశపెట్టిన ‘ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్’ (OSM)ను సమర్థిస్తూ, డిజిటల్ మూల్యాంకన ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, సురక్షితంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులకు వేరొకరి జవాబు పత్రాలు వచ్చాయనే ఫిర్యాదులపై స్పందిస్తూ, కేవలం 20 నిదర్శనాలు మాత్రమే తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. “మొదటిసారిగా ఇంత భారీ స్థాయిలో ఈ ప్రక్రియను అమలు చేయడం వల్ల కొన్ని లోపాలు తలెత్తాయి. విద్యార్థులు కోరిన దాదాపు 11.38 లక్షల జవాబు పత్రాలతో పోలిస్తే, ఇబ్బంది ఎదుర్కొన్న వారి సంఖ్య చాలా స్వల్పం” అని ఆయన పేర్కొన్నారు.
పోర్టల్పై హానికరమైన అటాక్ (Malicious Attack) జరిగిన నేపథ్యంలో, పేమెంట్ గేట్వే ప్రక్రియ నుండి హెచ్డీఎఫ్సీ (HDFC) బ్యాంక్ను తొలగించామని, ప్రస్తుతం చెల్లింపుల సమస్యలు పరిష్కారమయ్యాయని అధికారి తెలిపారు. ప్రభుత్వ రంగానికి చెందిన నాలుగు బ్యాంకులు—బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ గేట్వేలను నిన్న పరీక్షించామని, అవి సజావుగా పనిచేస్తున్నాయని వెల్లడించారు. సాంకేతిక లోపాలు, విద్యార్థుల ఫిర్యాదుల నేపథ్యంలో జూన్ 1 నుండి 12వ తరగతి రీ-ఇవాల్యుయేషన్ పోర్టల్ను సీబీఎస్ఈ తిరిగి ప్రారంభించనుంది.
డిజిటల్ మూల్యాంకన కాంట్రాక్ట్ను ‘కోఎంప్ట్’ సంస్థకు అప్పగించడంపై రేగిన వివాదంపై కూడా సదరు అధికారి క్లారిటీ ఇచ్చారు. నిబంధనల ప్రకారం మల్టిపుల్ రౌండ్ల బిడ్డింగ్ తర్వాతే ఈ సంస్థను ఎంపిక చేశామన్నారు.
మొదటి రౌండ్: టెక్నికల్ నైపుణ్యానికి 70%, ఆర్థిక సామర్థ్యానికి 30% వెయిటేజీ ఇచ్చిన మొదటి రౌండ్లో కేవలం ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’ (TCS) మాత్రమే అర్హత సాధించింది. అయితే నిబంధనల ప్రకారం ఒకే ఒక్క బిడ్ను ఆమోదించలేము కాబట్టి దానిని రద్దు చేయాల్సి వచ్చింది.
రెండో రౌండ్: ఈ రౌండ్లో ఏ ఒక్క బిడ్డర్ కూడా అర్హత సాధించలేకపోయారు.
మూడో రౌండ్: ఫైనాన్షియల్ బిడ్ నిర్వహించిన మూడో రౌండ్లో కోఎంప్ట్ సంస్థ పన్నులతో కలిపి ఒక జవాబు పత్రానికి రూ. 24.75 కోట్ చేయగా, టీసీఎస్ పన్నులు కాకుండానే రూ. 60 (దీనికి అదనంగా 18% జీఎస్టీ ఉంటుంది) కోట్ చేసింది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉండటం, నిబంధనల ప్రకారం తక్కువ ధరకు కోట్ చేసిన వారికే (Lowest Bidder) కాంట్రాక్ట్ ఇవ్వాలి కాబట్టి కోఎంప్ట్ను ఎంపిక చేశామని వివరించారు.
ప్రస్తుతం ఈ కోఎంప్ట్ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్ వంటి పలు రాష్ట్రాల్లో ఇటువంటి మూల్యాంకన పనులను నిర్వహిస్తోందని చెప్పారు. 2019లో తెలంగాణలో ఈ సంస్థపై వచ్చిన పరీక్షల వివాదంపై స్పందిస్తూ.. హైకోర్టు ఆ సంస్థ తప్పిదమేమీ లేదని తేల్చిందని, సుప్రీంకోర్టులో దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా కొట్టివేయబడిందని గుర్తుచేశారు. అయినప్పటికీ, ప్రస్తుత మూల్యాంకన ప్రక్రియలో జరిగిన లోపాలకు గానూ ఆ సంస్థపై జరిమానాలు (Penalties) విధిస్తామని అధికారి స్పష్టం చేశారు. మరోవైపు, ఈ వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ, సీబీఎస్ఈ మూల్యాంకన, పోర్టల్ సమస్యలను త్వరలోనే వేగంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
May 30, 2026 11:22 AM IST













