Last Updated:
కామన్వెల్త్ గేమ్స్ 2026 ప్రారంభోత్సవానికి ముందే భారత్ ఖాతాలో పతకం చేరింది. 75 కేజీల మహిళల బాక్సింగ్ విభాగంలో కేవలం ఐదుగురు పోటీదారులు ఉండటంతో స్టార్ బాక్సర్ లవ్లీనాకు బై లభించి నేరుగా సెమీఫైనల్ చేరుకుంది. బాక్సింగ్ రూల్స్ ప్రకారం సెమీస్ చేరిన వారికి కనీసం కాంస్య పతకం వస్తుంది. దీంతో లవ్లీనా పతకం ఖాయమైంది.
గ్లాస్గో వేదికగా జరగనున్న కామన్వెల్త్ గేమ్స్ 2026 ప్రారంభోత్సవానికి ముందే భారత్ తన పతకాల వేటను ఘనంగా మొదలుపెట్టింది. టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన స్టార్ బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ (Lovlina Borgohain), మహిళల 75 కేజీల విభాగంలో నేరుగా సెమీఫైనల్కు అర్హత సాధించింది. దీంతో భారత్కు కనీసం కాంస్య పతకం ఖాయమైంది. ఈ విభాగంలో కేవలం ఐదుగురు బాక్సర్లు మాత్రమే పోటీ పడుతుండటంతో లవ్లీనాకు బై లభించింది.
కామన్వెల్త్ గేమ్స్ నిబంధనల ప్రకారం, బాక్సింగ్ సెమీఫైనల్లో ఓడిన ఇద్దరు క్రీడాకారులకు కూడా కాంస్య పతకాలు ప్రదానం చేస్తారు. కాబట్టి, రింగ్లోకి దిగకముందే లవ్లీనా పతకం సాధించినట్లైంది. ఆమె జులై 31న జరగనున్న సెమీఫైనల్ బౌట్లో తలపడనుంది.
ఈ పతకంతో లవ్లీనా ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలలో పతకాలు సాధించిన అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో ఆమెకు ఇదే తొలి పతకం కావడం విశేషం.
ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్లో క్రీడల సంఖ్యను పదికి కుదించారు. బ్యాడ్మింటన్, హాకీ, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్ వంటి క్రీడలు లేకపోవడంతో భారత బృందం సంఖ్య 125కి తగ్గింది. అయినప్పటికీ, అథ్లెటిక్స్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్లలో భారత్ మంచి ప్రదర్శన కనబరుస్తుందని క్రీడాభిమానులు ఆశిస్తున్నారు.
లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ అప్డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana














