Last Updated:
Commonwealth Games 2026: కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games) నుంచి బ్యాడ్మింటన్ క్రీడను తొలగించడంపై భారత బ్యాడ్మింటన్ దిగ్గజం, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అదే సమయంలో పి.వి. సింధు మళ్లీ పాత ఫామ్ను అందుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తూనే, భారత బ్యాడ్మింటిన్ భవిష్యత్తు కోసం మరింత మంది యువ ఆటగాళ్లు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ‘న్యూస్18 రైజింగ్ భారత్ ఇండియా సమ్మిట్ (సౌత్ ఎడిషన్)’ వేదికగా సైనా నెహ్వాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కామన్వెల్త్ క్రీడల నుంచి ప్రధాన ఆటలను తీసివేయడంపై సైనా మాట్లాడుతూ: “బ్యాడ్మింటన్, హాకీ, షూటింగ్ వంటి క్రీడల్లో కామన్వెల్త్ గేమ్స్లో మనం ఎన్నో స్వర్ణ పతకాలు సాధించాం. ఈసారి ఆ క్రీడలు అక్కడ లేకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. 2006 నుండి 2022 వరకు జరిగిన ప్రతి కామన్వెల్త్ క్రీడల్లోనూ మేము పాల్గొన్నాం. ప్రస్తుతం ఆయా ఆటల ప్లేయర్లు ఎలా భావిస్తున్నారో ఊహించుకుంటే బాధగా ఉంది. 2030లో భారత్ మళ్లీ కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వబోతోంది. అప్పుడు ఈ ఈవెంట్లు మళ్లీ వస్తాయని నమ్ముతున్నాను. కానీ, అంతటి పెద్ద క్రీడలను ఇప్పుడు ఎలా తొలగిస్తారో నాకు అర్థం కావడం లేదు. ఇది తీవ్రంగా నిరాశపరిచే అంశం.” అని వ్యాఖ్యానించారు.
ఈ నిర్ణయం వల్ల యువ అథ్లెట్లు మానసికంగా కుంగిపోకూడదని సైనా సూచించారు. “ఆటగాళ్లు ఎప్పుడూ ఆగిపోరు. వారు నిరంతరం శ్రమిస్తూ, రాబోయే టోర్నమెంట్లపై దృష్టి పెట్టాలి. అయితే, యువ క్రీడాకారులకు ఇది చాలా కష్టమైన సమయం. ఒక పెద్ద అంతర్జాతీయ టోర్నమెంట్ చేతిజారిపోయిందని వారు భావిస్తారు. ఉదాహరణకు ఉన్నతికి ఈసారి అవకాశం వచ్చి ఉండేది. అంతర్జాతీయ అనుభవాన్ని గడించడానికి ఇదొక మంచి టోర్నమెంట్, కానీ ఆమె ఆ అవకాశాన్ని కోల్పోతోంది. రాబోయే ఆసియా గేమ్స్లో ఆమె ఎలా రాణిస్తుందో చూడాలి.” అని పేర్కొన్నారు.
సింధుపై ప్రశంసల జల్లు
ఇటీవల జపాన్లో అద్భుత ప్రదర్శనతో తిరిగి పాత ఫామ్ను అందుకున్న రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధుపై సైనా ప్రశంసలు కురిపించారు. “గత వారం సింధు ఆడిన తీరు అద్భుతం! చాలా కాలం తర్వాత ఆమె ఎటాకింగ్ గేమ్, కోర్టులో వేగవంతమైన మూవ్మెంట్స్ను చూశాను. దిగ్గజ క్రీడాకారులను ఎప్పటికీ తక్కువ అంచనా వేయలేం. వారికి ఎంతో అనుభవం ఉంటుంది, తమ భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలో బాగా తెలుసు. 2019, 2020 నాటి ప్రదర్శనను మళ్లీ పునరావృతం చేస్తున్నందుకు ఉపశమనం కంటే కూడా ఆమె ఎంతో సంతోషంగా ఉండి ఉంటుంది.
భారత బ్యాడ్మింటన్ భవిష్యత్తుపై స్పందిస్తూ, తదుపరి తరం ఆటగాళ్ల కొరత ఉందన్న విషయాన్ని సైనా గుర్తుచేశారు: “గత కొన్ని సంవత్సరాలుగా సింధు అద్భుతంగా రాణిస్తోంది. కానీ, ఈపాటికే ఆమె వెనుక మరో నలుగురైదుగురు యువ ఆటగాళ్లు సిద్ధంగా ఉండాలి. సింధు రిటైర్ అయ్యే సమయానికి బాధ్యతలు స్వీకరించేందుకు తదుపరి తరం సిద్ధంగా ఉండాలి, కానీ మహిళల బ్యాడ్మింటిన్లో మనం ఇంకా ఆ ఎదురుచూపుల్లోనే ఉన్నాం. పురుషుల విభాగానికీ ఇది వర్తిస్తుంది. లక్ష్య సేన్ తర్వాత ఆయుష్ శెట్టి తప్ప మరో బలమైన లైన్-అప్ కనిపించడం లేదు. ఇక్కడే మనం వెనుకబడుతున్నాం.” అని ఆవేదన వ్యక్తం చేశారు.
లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ అప్డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana














