Last Updated:
వణికిస్తున్న మృత్యు రహదారి.. డేంజరస్ రోడ్ ఇదే, 5 నెలలు.. 259 యాక్సిడెంట్లు.
కారు లేదంటే టూవీలర్.. ఏదైనా సరే రోడ్లపై, రహదారులపై వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మాత్రం ఊహించని ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రహదారులపై కూడా బ్లాక్ స్పాట్స్ ఉంటాయి. అంటే ఓవర్ స్పీడ్తో వెళ్లినా, ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదాల బారిన పడే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇలాంటి రోడ్లపై వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మన తెలంగాణలో హైదరాబాద్ మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో విస్తరించి ఉన్న జాతీయ రహదారి-65 (విజయవాడ హైవే) ప్రయాణికులకు అత్యంత ప్రమాదకరంగా మారింది. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు కేవలం ఐదు నెలల వ్యవధిలోనే ఈ మార్గంలో ఏకంగా 259 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ భయానక ఘటనల్లో 17 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు స్పష్టమైన అద్దం పడుతోంది. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలు, దానికి తోడు మితిమీరిన వేగం వాహనదారుల పాలిట అతిపెద్ద శాపంగా మారుతున్నాయి. నిత్యం పదుల సంఖ్యలో వాహనాలతో రద్దీగా ఉండే ఈ హైవేపై ప్రయాణించాలంటేనే సామాన్య జనాలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
కమిషనరేట్ వ్యాప్తంగా గడిచిన ఐదు నెలల గణాంకాలను పరిశీలిస్తే మొత్తం 1,466 రోడ్డు ప్రమాద కేసులు నమోదు కాగా, అందులో 134 ప్రాణాంతక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఏకంగా 143 మంది అమాయకులు తమ విలువైన ప్రాణాలు విడిచారు. రోడ్డు భద్రతను మెరుగుపరిచే ఉద్దేశంతో ఉన్నతాధికారులతో కలిసి పోలీసు శాఖ ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) ప్రచారంలో భాగంగా నాలుగో దశ సమీక్షా సమావేశాన్ని ప్రత్యేకంగా నిర్వహించింది. ఈ కీలక సమావేశంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తక్షణమే తీసుకోవాల్సిన పటిష్టమైన చర్యలపై పౌర సంబంధాల అధికారులతో కలిసి లోతుగా చర్చించారు.
కమిషనరేట్ పరిధిలో ఉన్న జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు ప్రధాన జిల్లా రోడ్లను కలుపుకుని మొత్తం 401.8 కిలోమీటర్ల మేర రోడ్ల నెట్వర్క్ విస్తరించి ఉంది. ఈ మార్గంలో 43 బ్లాక్ స్పాట్లు, 20 హాట్ స్పాట్లను పోలీసులు పక్కాగా గుర్తించారు. ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా అత్యంత ప్రమాదకరమైన ఐదు ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు విస్తృత అవగాహన సదస్సులు నిర్వహించారు. హయత్నగర్లోని కుంట్లూర్ టీ-జంక్షన్, అబ్దుల్లాపూర్మెట్ కొత్తగూడెం ఎక్స్ రోడ్, బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ జంక్షన్, ఉప్పల్ ఎక్స్ రోడ్స్, సికింద్రాబాద్ రతిఫైల్ బస్టాండ్ సిగ్నల్ వద్ద వాహనదారులను ప్రత్యేకంగా అప్రమత్తం చేశారు.
భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు తక్షణమే రోడ్ల ఇంజనీరింగ్ లోపాలు సవరించాలని, స్పష్టమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పోలీసు యంత్రాంగం నిర్ణయించింది. హైవే పెట్రోలింగ్ వ్యవస్థను మరింత పెంచడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రతి ఒక్క వాహనదారుడు విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు నడిపే వారు సీట్ బెల్ట్ కచ్చితంగా ధరించాలని మల్కాజిగిరి సీపీ బి. సుమతి కోరారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం మానుకోవాలని, గోల్డెన్ అవర్లో క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆదుకునే గుడ్ సమరిటన్స్కు ‘రాహ్-వీర్’ (RAH-VEER) పథకం కింద రూ. 25,000 రివార్డు అందిస్తామని సీపీ ప్రకటించారు. పీఎం రాహత్ స్కీమ్ ద్వారా ప్రమాద బాధితులకు రూ. 1.5 లక్షల వరకు నగదు రహిత అత్యవసర చికిత్స అందుతుంది. హిట్ అండ్ రన్ కేసుల్లో మరణిస్తే రూ. 2 లక్షలు, తీవ్ర గాయాలైతే రూ. 50 వేల పరిహారం నేరుగా లభిస్తుంది. కాగా, 2021 సెప్టెంబర్ నుంచి 2026 మార్చి వరకు 401 పరిహారం క్లెయిమ్ దరఖాస్తులను జిల్లా కలెక్టరేట్లకు పంపగా, కేవలం 32 కేసుల్లో మాత్రమే పరిహారం మంజూరైంది. మిగిలిన 369 దరఖాస్తులు ఇంకా అధికారుల వద్ద పెండింగ్లోనే ఉన్నాయి. మరోవైపు, ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం ద్వారా జనవరి నుంచి ఏప్రిల్ వరకు 95 వేల మందికి పైగా పౌరులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం విశేషం.
Hyderabad,Telangana
Jun 11, 2026 10:29 AM IST













