EV Policy: త్వరలో పెట్రోల్ బైక్‌లకు గుడ్‌బై.. ఢిల్లీలో కొత్త ఈవీ పాలసీకి ఆమోదం.. | | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పాలసీకి ఆమోదం తెలిపింది. 2026 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ విధానం ప్రకారం దశలవారీగా పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ వాహనాల కొత్త రిజిస్ట్రేషన్లను నిలిపివేయనున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఢిల్లీ మంత్రివర్గం సోమవారం కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పాలసీకి ఆమోదం తెలిపింది. ఈ విధానం ద్వారా దశలవారీగా విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచడంతో పాటు, కొత్త పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్‌ను కొన్ని విభాగాల్లో క్రమంగా నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ముఖ్యమంత్రి రేఖా గుప్తా వెల్లడించిన వివరాల ప్రకారం, లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం అనంతరం ఈ పాలసీ 2026 జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. ఇది 2030 మార్చి 31 వరకు అమలులో ఉంటుంది. ఈ విధానం అమలుకు ప్రభుత్వం సుమారు రూ.7,000 కోట్లు వ్యయం చేయనున్నట్లు తెలిపింది.

దశలవారీగా ఈవీలకే అనుమతి

కొత్త పాలసీ ప్రకారం 2027 జనవరి 1 నుంచి ఢిల్లీలో కొత్తగా ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలు మరియు N1 కేటగిరీ సరుకు రవాణా వాహనాలు మాత్రమే రిజిస్ట్రేషన్‌కు అర్హత పొందుతాయి. అలాగే 2028 ఏప్రిల్ 1 నుంచి కొత్తగా నమోదయ్యే ద్విచక్ర వాహనాలు పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలే కావాలి. దీంతో కొత్త పెట్రోల్, సీఎన్‌జీ ఆధారిత ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్‌కు ముగింపు పలకనున్నారు. ప్రభుత్వం ప్రకారం, ముఖ్యంగా వాణిజ్య వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయాన్ని దశలవారీగా అమలు చేయనున్నారు.

ఈవీ కొనుగోలుదారులకు ప్రోత్సాహకాలు

రవాణా కమిషనర్ నిహారిక తెలిపిన వివరాల ప్రకారం, ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి ప్రత్యేక ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తారు.

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు రూ.30,000 వరకు

ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలకు రూ.50,000 వరకు

N1 కేటగిరీ ఎలక్ట్రిక్ ట్రక్కులకు రూ.1 లక్ష వరకు ప్రోత్సాహకం అందించనున్నారు.

పాత వాహనాలను స్క్రాప్ చేసి కొత్త ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేసే వారికి అదనపు ప్రోత్సాహకాలు కూడా అందిస్తారు. అంతేకాకుండా, పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి మినహాయింపు కొనసాగుతుంది. అయితే హైబ్రిడ్ వాహనాలకు ఎలాంటి సబ్సిడీ ఇవ్వబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పాలసీ కింద ప్రోత్సాహకాల కోసం వాహనాల సంఖ్యపై ఎలాంటి పరిమితి ఉండదని, ఒకటి కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా అర్హత ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.

చార్జింగ్ స్టేషన్లు, ఎలక్ట్రిక్ స్కూల్ బస్సులు

ఈ విధానంలో భాగంగా పాలసీ అమలుకాలంలో ఢిల్లీ వ్యాప్తంగా 23,000 ఈవీ చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే పాఠశాల బస్సులను కూడా దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చనున్నారు. పెరుగుతున్న ఈవీ వినియోగానికి అనుగుణంగా విద్యుత్ మౌలిక వసతులను కూడా బలోపేతం చేయనున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి ఆశిష్ సూద్ తెలిపారు.

స్వచ్ఛమైన గాలి లక్ష్యంగా కొత్త విధానం

రవాణా మంత్రి డాక్టర్ పంకజ్ సింగ్ మాట్లాడుతూ, ఢిల్లీ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ విధానాన్ని రూపొందించినట్లు తెలిపారు. ప్రజలు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు. పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ, ఈ విధానం శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా రూపొందించబడిందని, జాతీయ రాజధానిలో వాయు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. తదుపరి నాలుగేళ్లలో స్వచ్ఛమైన రవాణా వ్యవస్థను వేగవంతం చేయడంతో పాటు, పట్టణ వాయు నాణ్యతను మెరుగుపరచడమే ఢిల్లీ ప్రభుత్వ కొత్త ఈవీ పాలసీ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం వెల్లడించింది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *