Last Updated:
Fact Check: ప్రధాని మోదీ తన గురించి గొప్పగా చెప్పమని ఎవర్నీ అడగరు. కానీ కొంతమంది ఆయన్ని అదే పనిగా ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. ఈ క్రమంలో వారు అతి చేస్తారు. ఒక్కోసారి వారి ఈ చర్యలు.. కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారతాయి. అలాంటి ఓ ఘటనపై కేంద్రం వెంటనే స్పందించి.. ప్రజలను అలర్ట్ చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ.. ఆధార్ కార్డు ఉన్న విద్యార్థులకు ఉచిత ఎలక్ట్రిక్ సైకిళ్లు ప్రకటించారని చూపిస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రధాని మాట్లాడుతున్నట్లు కనిపించి, విద్యార్థులకు ఉచిత ఎలక్ట్రిక్ సైకిళ్లు ఇస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ యూనిట్.. ఈ వీడియోని పూర్తిగా ఖండించింది.
2026 ఆగస్టు 5న PIB ఫాక్ట్ చెక్.. తమ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది: “సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వీడియో ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ ఆధార్ కార్డు ఉన్న విద్యార్థులకు ఉచిత ఎలక్ట్రిక్ సైకిళ్లు ప్రకటించారని చెబుతున్నారు. ఇది ఫేక్. ఇది డిజిటల్గా మానిప్యులేషన్ చేసిన వీడియో. ప్రధాని అలాంటి ఏ ప్రకటనా చేయలేదు” అని PIB ఫాక్ట్ చెక్ తెలిపింది.
అకాశవాణి న్యూస్ కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. 2026 ఆగస్టు 5న ప్రచురించిన రిపోర్టులో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ విషయాన్ని కేంద్రం తిరస్కరించిందనీ, PIB ఫాక్ట్ చెక్ యూనిట్.. ఈ వీడియోని ఫేక్ తేల్చిందనీ.. ప్రధాని అలాంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేసింది. ప్రజలు ఇలాంటి అసత్య, అనుమానాస్పద కంటెంట్ గురించి.. ప్రభుత్వానికి రిపోర్ట్ చెయ్యాలని కూడా సూచించింది.
📹 Do not fall for fake videos!
⚠️ A video circulating on social media claims that Prime Minister Narendra Modi has announced free electric bicycles for students having their Aadhaar card.#PIBFactCheck:
❌ This video is #Fake and digitally manipulated
✅ The Prime Minister… pic.twitter.com/7E67TKsmip
— PIB Fact Check (@PIBFactCheck) August 5, 2026
ఇలాంటి ఫేక్ వీడియోలు గతంలో కూడా చాలా వచ్చాయి. FACTLY వంటి స్వతంత్ర ఫ్యాక్ట్ చెక్ సంస్థలు ఇంతకు ముందు కూడా ఇలాంటి వాటిని పరిశీలించి, కేంద్ర ప్రభుత్వం లేదా ఏ రాష్ట్ర ప్రభుత్వమూ విద్యార్థులకు ఉచిత ఎలక్ట్రిక్ సైకిళ్లు అందించే పథకం ఏదీ ప్రారంభించలేదని నిర్ధారించాయి. కొంతమంది పాత ప్రసంగాలను AI సాయంతో మార్చి, ఇలాంటి వీడియోలను తయారుచేస్తున్నారు. ఉదాహరణకు, 2019లో గోరఖ్పూర్లో PM-KISAN పథకం ప్రారంభోత్సవంలో ప్రధాని చేసిన ప్రసంగాన్ని మార్చి ఇలాంటివి చేస్తున్నట్లు గత ఫ్యాక్ట్ చెక్లలో తేలింది.
కేంద్ర ప్రభుత్వం.. అధికారిక పోర్టల్ MyScheme లేదా PIB వెబ్సైట్లో ఇలాంటి ఏ పథకం గురించీ సమాచారం లేదు. కొన్ని రాష్ట్రాలు అంటే.. అసోం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు వంటివి.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు, ముఖ్యంగా బాలికలకు సాధారణ (నాన్-ఎలక్ట్రిక్) సైకిళ్లు ఉచితంగా అందించే పథకాలు నడుపుతున్నాయి. ఢిల్లీలోనూ ఇటీవల ‘విద్యా వాహిని’ పథకం కింద క్లాస్ 9 బాలికలకు సాధారణ సైకిళ్లు పంపిణీ చేస్తున్నారు. కానీ ఇవన్నీ రాష్ట్ర స్థాయి పథకాలు. ఇచ్చేవి ఎలక్ట్రిక్ సైకిళ్లు కావు. ఇవి కేంద్ర ప్రభుత్వం లేదా ప్రధాని ప్రకటనలు కావు.
ప్రజలు ఇలాంటి ఆకర్షణీయమైన వీడియోలను చూసి నమ్మకుండా, అధికారిక వెబ్సైట్లు (pib.gov.in, myscheme.gov.in) చూడాలనీ, అనుమానాస్పద కంటెంట్ను PIB ఫాక్ట్ చెక్కు (+91 8799711259 లేదా factcheck@pib.gov.in) రిపోర్ట్ చేయాలని కేంద్రం సూచిస్తోంది. AI-జనరేటెడ్ డీప్ఫేక్ వీడియోలు పెరుగుతున్న ఈ రోజుల్లో జాగ్రత్తగా ఉండటం అవసరం.
Hyderabad,Telangana
Aug 05, 2026 11:40 AM IST














