Last Updated:
Fertilizer Digital Tracking System: రైతులకు సంబంధించిన ఎరువుల కొనుగోలు, పంపిణీ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేస్తోంది. ఇకపై రైతులు కొనుగోలు చేసే ఎరువులను వారి భూమి రికార్డులతో అనుసంధానం చేయడంతో పాటు, క్యూఆర్ కోడ్, డిజిటల్ బుకింగ్ వంటి విధానాలను తీసుకురానుంది. అసలు ఈ కొత్త విధానం ఎలా పనిచేస్తుంది? రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
భారతదేశ వ్యవసాయ రంగాన్ని మరింత పారదర్శకంగా, లాభసాటిగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక అడుగు వేసింది. దేశవ్యాప్తంగా ఎరువుల ఉత్పత్తి కేంద్రాల నుండి మొదలుకుని గ్రామీణ స్థాయిలో జరిగే రిటైల్ అమ్మకాల వరకు.. ప్రతి దశనూ అత్యంత పకడ్బందీగా ట్రాక్ చేసే భారీ డిజిటల్ ప్లాట్ఫారమ్ను మరింతగా విస్తరిస్తున్నట్లు ప్రభుత్వం ఆదివారం అధికారికంగా ప్రకటించింది. కేవలం అమ్మకాలను నమోదు చేయడం మాత్రమే కాకుండా, ఇకపై ప్రతి రైతు కొనుగోలు చేసే ఎరువులను వారి వ్యక్తిగత భూ రికార్డులతో నేరుగా అనుసంధానం చేయనున్నారు. తద్వారా వేలాది కోట్ల రూపాయల సబ్సిడీలు దారిపక్కకు మళ్లకుండా, అర్హులైన నిజమైన రైతులకే చేరేలా ఈ వ్యవస్థను తీర్చిదిద్దుతున్నారు.














