Last Updated:
కెనడా టూరిస్ట్ వీసాలు ఇప్పిస్తానని నమ్మించి, వారి వద్ద నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఘటన కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ (KPHB) పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
FIFA World Cup 2026: ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న ఫిఫా వరల్డ్కప్ మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించాలనుకున్న ముగ్గురు స్నేహితులకు వీసా పేరుతో ఒక ఏజెంట్ భారీగా టోకరా వేశాడు. కెనడా టూరిస్ట్ వీసాలు ఇప్పిస్తానని నమ్మించి, వారి వద్ద నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఘటన కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ (KPHB) పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్బీ కాలనీలోని ‘మహేంద్ర ఆశ్రిత’ గేటెడ్ కమ్యూనిటీకి చెందిన ముగ్గురు మిత్రులు ఈ ఏడాది జరగనున్న ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్ను చూడటానికి కెనడా వెళ్లాలని నిశ్చయించుకున్నారు. ఇందుకోసం వీసాల ప్రక్రియ నిమిత్తం వారు అమీర్పేటలోని ‘ఎడ్యుకేర్ సొల్యూషన్స్’ అనే సంస్థకు చెందిన ఒక వీసా ఏజెంట్ను సంప్రదించారు. గతంలో సదరు ఏజెంట్ వీరికి విజయవంతంగా సింగపూర్ వీసా ఇప్పించి ఉండటంతో, అతడిపై నమ్మకంతో కెనడా వీసాల బాధ్యతను కూడా అప్పగించారు.
కెనడా వీసా ప్రాసెసింగ్ ఫీజు మరియు ఇతర ఖర్చుల నిమిత్తం ముగ్గురు మిత్రులు కలిసి మొత్తం రూ. 5,03,829 సదరు ఏజెంట్కు చెల్లించారు. అయితే, డబ్బులు తీసుకున్న తర్వాత ఏజెంట్ వీసా ప్రక్రియను ప్రారంభించకుండా కాలయాపన చేస్తూ వచ్చాడు. బాధితులు ఎన్నిసార్లు నిలదీసినా సరైన సమాధానం చెప్పకుండా, ఆ మొత్తాన్ని తన సొంత అవసరాలకు వాడుకున్నాడు.
చివరికి సదరు ఏజెంట్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు బుధవారం కేపీహెచ్బీ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
గమనిక: విదేశాలకు వెళ్లే ప్రయాణికులు ఇటువంటి అనధికారిక, మోసపూరిత వీసా ఏజెంట్ల బారిన పడకుండా, కేవలం గుర్తింపు పొందిన అధికారిక సంస్థల ద్వారానే వీసా ప్రక్రియలు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
Hyderabad,Telangana













