దక్షిణాది రాష్ట్రాల్లో రెండు అతిపెద్ద రాష్ట్రాలుగా ఉన్న కర్నాటక, తెలంగాణలో ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అయితే దేశ వ్యాప్తంగా చాలా చోట్ల అధికారాన్ని కోల్పోయిన హస్తం గుర్తు పార్టీ .. గెలిచిన రాష్ట్రాల్లో అయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే కర్నాటకలో ఆరు గ్యారెంటీల్లో కొన్నింటిని అమలు చేస్తోంది. మొదటి మూడేళ్ల సమయంలో సిద్దరామయ్య సీఎంగా ఉండటంతో ఈ సమయంలో ఆడవాళ్లకు ఆర్టీసీ బస్సులో టికెట్ ఫ్రీ జర్నీ అమలు చేసింది. ఇప్పుడు డీకే శివకుమార్ సీఎం కుర్చిలో కూర్చోవడమే ఆలస్యం తమ ప్రభుత్వం యువతపై దృష్టి సారిస్తోందని నొక్కిచెబుతూనే రాష్ట్ర అభివృద్ధిలో యువత పెద్ద పాత్ర పోషించేలా వారికి అవకాశాలు కల్పించే దిశగా ప్రయత్నాలు జరుగుతాయని శివకుమార్ మాటిచ్చారు.
ప్రమాణస్వీకారం సమయంలో ఆయన చేసిన ప్రసంగంలో కీలక అంశం యువతను ఉద్దేశించి చేసినవే. యువత ఓట్ల టార్గెట్గా కాంగ్రెస్ పార్టీ రాబోయే రెండేళ్లలో వారికి మేలు చేసే దిశగా ప్రణాళికలను రచిస్తోంది. అదే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు. మేము యువత దృక్కోణం నుంచే కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని…ఈ రాష్ట్ర ప్రజలకు తనపై అపారమైన నమ్మకం ఉందని.. గతంలో నన్ను విమర్శించి ఉండవచ్చు. అలాగే ప్రశంసించి ఉండవచ్చు. నాకు రాజకీయ అనుభవం ఉంది. నేను కష్టాల, సుఖాలను చూశాను. చిన్న వయసులోనే అధికారాన్ని చూశాను కాబట్టే నేను ప్రజల్ని నమ్ముతున్నానని చెప్పారు శివకుమార్.
ఇప్పటికే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తున్న కర్నాటక ప్రభుత్వం ఇప్పుడు విద్యార్ధులు, యువతకు మరో శుభవార్త చెప్పింది. డీకే శివకుమార్ తన తొలి కేబినెట్ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా “పాఠశాల, కళాశాల విద్యార్థులందరికీ” ఉచిత బస్సు పాస్లు అందించనున్నట్లు ప్రకటించారు. ఈ రవాణా సౌకర్యం కేవలం బాలికలకే ఎందుకు పరిమితం చేశారని చాలామంది ప్రశ్నించిన నేపథ్యంలో ఈ విస్తరణను ప్రకటించినట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు.
రవాణా శాఖతో సమన్వయం చేసుకుని ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన కార్యాచరణ చట్రాన్ని ఖరారు చేస్తుందని శివకుమార్ తెలిపారు. ఈ పథకం ప్రారంభమైన తర్వాత, అర్హత ప్రమాణాలను చేరుకున్న విద్యార్థులు నిర్దేశిత ప్రక్రియ ద్వారా ఉచిత బస్సు పాస్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
ఇది యువతరం యుగం. కేవలం బాలికలకే ఎందుకు ఉచిత బస్సు అని విద్యార్థులు అడుగుతున్నారు. మేము విద్యార్థులందరికీ పాస్లు ఇస్తున్నామని పాఠశాల, కళాశాల విద్యార్థులందరికీ ఎలాంటి రుసుము లేకుండానే ఉచిత బస్సు పాస్ అందజేస్తామని తెలిపారు. ఇది డీకే శివకుమార్ కేబినెట్ తీసుకున్న తొలి నిర్ణయం. విద్యార్థులు దీని కోసం దరఖాస్తు చేసుకోవాలి, ఈ విషయంపై రవాణా శాఖతో చర్చిస్తామన్నారు.
ఉద్యోగార్థులను యజమానులతో అనుసంధానించే ఒక ప్రైవేట్ రంగ ఉపాధి కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని కర్ణాటక ముఖ్యమంత్రి ప్రకటించారు. 56,000 ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేసేందుకు కూడా అధికారులు కృషి చేస్తారని ఆయన తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల షెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తామని.. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కోరుకునే వారి కోసం ప్రభుత్వమే ఉపాధి కేంద్రం సౌకర్యాన్ని కల్పిస్తుంది. సంప్రదింపుల తర్వాత కచ్చితమైన విధానాన్ని ఖరారు చేసినప్పటికీ, కన్నడిగులకు ప్రాధాన్యత లభిస్తుంది. నెలలోగా విధానాన్ని సిద్ధం చేయాలని మంత్రులను కోరడం జరిగిందన్నారు సీఎం శివకుమార్. ఉద్యోగాలు పొందేందుకు ప్రభుత్వంతో నమోదు చేసుకోవాలని ముఖ్యమంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాము కంపెనీలతో మాట్లాడి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని మాటిచ్చారు.
యువతపై దృష్టి సారించిన తన అజెండాలో భాగంగా కర్ణాటక ముఖ్యమంత్రి రాష్ట్రవ్యాప్తంగా 10,000 ‘భారత్ జోడో’ యూత్ క్లబ్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. గ్రామాల్లో భారత్ జోడో యూత్ క్లబ్లను ఏర్పాటు చేయనున్నారు. దీనికి ప్రభుత్వం రూ. 10 లక్షలు అందిస్తుంది. ఇతర దురలవాట్లకు పాల్పడకుండా యూత్ క్లబ్లను ఏర్పాటు చేసేందుకు ఇది దోహదపడుతోంది. 10,000 భారత్ జోడో క్లబ్లను ఏర్పాటు చేయడమే లక్ష్యమన్నారు. ఈ చొరవ కింద ప్రతి గ్రామ పంచాయతీలో ఒక క్లబ్తో పాటు, పట్టణ వార్డులలో కూడా ఇలాంటి యూనిట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ప్రతి క్లబ్లో 150 నుండి 200 మంది సభ్యులు ఉంటారని అంచనా. ఈ క్లబ్లు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నాయకత్వ శిక్షణ, సామాజిక కార్యక్రమాలకు వేదికగా నిలుస్తాయి. వారి కార్యకలాపాలకు మద్దతుగా, ప్రభుత్వం ప్రతి క్లబ్కు రూ. 10 లక్షలు కేటాయిస్తుంది.
బెంగళూరు రోడ్ల మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే ప్రయత్నంలో భాగంగా, నగరవ్యాప్తంగా రోడ్ల పునరుద్ధరణ , తారు వేయడానికి క్యాబినెట్ రూ. 2,000 కోట్లను కూడా మంజూరు చేసింది. ఇప్పటికే ఉన్న అభివృద్ధి ప్రాజెక్టుల కింద ఉన్నతీకరించబడని ప్రాంతాలకు ఈ నిధులను కేటాయించనున్నారు. రాబోయే మూడు నుంచి నాలుగు నెలల్లో రోడ్ల తారు వేసే పనులను పూర్తి చేయాలని సీఎం భావిస్తున్నారు.
దీర్ఘకాలంగా ఉన్న ఆస్తి సంబంధిత వివాదాలను పరిష్కరించే లక్ష్యంతో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు (ఓసీ), కంప్లీషన్ సర్టిఫికేట్లు (సీసీ) విషయంలో సమస్యలను ఎదుర్కొంటున్న గృహ యజమానులకు ప్రభుత్వం ఒకేసారి క్రమబద్ధీకరణ చర్యను ప్రకటించింది. మే 31వ తేదీన లేదా అంతకంటే ముందు దరఖాస్తులు దాఖలు చేసిన పక్షంలో 20% వరకు నిర్మాణ వ్యత్యాసాలు ఉన్న, 2,500 చదరపు అడుగుల వరకు విస్తీర్ణం గల నివాస గృహాలకు ఈ ప్రయోజనం వర్తిస్తుంది.
కర్ణాటక వ్యాప్తంగా బి ఖాతా నుండి ఎ ఖాతాకు మార్పిడి కార్యక్రమాన్ని విస్తరించడానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమం ఆస్తి యజమానులు తమ ఆస్తులకు స్పష్టమైన చట్టపరమైన హోదాను పొందేందుకు, అలాగే పత్రాలు, యాజమాన్య రికార్డులను క్రమబద్ధీకరించేందుకు సహాయపడటానికి ఉద్దేశించబడింది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జి. పరమేశ్వర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, 13 మంది ఎమ్మెల్యేలు కొత్త ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రులుగా చేరారు.
అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్నాటక, తెలంగాణలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం అందుబాటులో ఉంది. ఇక తాజాగా బెంగాల్లో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లుగా ప్రకటించింది. అంటే రాబోయే కాలంలో ఇతర రాష్ట్రాల్లో కూడా విద్యార్ధులకు ఉచిత బస్ పాస్ ఫ్రీ పథకాన్ని అమలు చేసే దిశగా రాజకీయ పార్టీలు ఎన్నికల వాగ్ధానం రూపొందించడం ఖాయమని స్పష్టమవుతోంది.










