Last Updated:
Gurdwara demolition in Pakistan: పాకిస్థాన్ చేస్తున్న తప్పు అదే. ఇండియాతో పెట్టుకుంటోంది. పక్క దేశమైన మనతో కలిసి అడుగులు వేస్తే, అభివృద్ధిని చూడగలదు. మనతో శత్రుత్వాన్ని పెట్టుకుంటే.. అన్ని విధాలా నష్టమే. గురుద్వారాని కూల్చివేయడానికి వెనక కుట్ర ఉందా?
పాకిస్థాన్.. ఫరూకాబాద్లోని ప్రాచీన గురుద్వారా శ్రీ గురు సింగ్ సభా సాహిబ్ను ఇటీవల కూల్చివేశారు. ఇది మైనార్టీల ప్రదేశాలపై కావాలని చేస్తున్న దాడులే అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తీవ్రంగా ఖండించింది. News18 రిపోర్టు ప్రకారం.. జూన్ 24 రాత్రి స్థానిక వ్యాపారవేత్త ఈ 125 సంవత్సరాల పురాతన గురుద్వారాను కూల్చివేశారు. లాహోర్ నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఫరూకాబాద్ ఉంది.
భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ దీనిపై స్పందించారు. “ఫరూకాబాద్లోని 125 సంవత్సరాల పవిత్ర గురుద్వారా శ్రీ గురు సింగ్ సభా సాహిబ్ కూల్చివేయడంపై మేము తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాము. ఇది అత్యంత ప్రాచీన కట్టడాలు, ప్రార్థనా స్థలాలపై కావాలని చేస్తున్న కుట్ర పూరిత చర్య” అని అన్నారు. ఈ కూల్చివేతపై స్థానిక అధికారులు, ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు (ETPB).. సరైన చర్యలు లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందనీ, ఇది పాకిస్థాన్లో మైనార్టీలు, వారి ఆరాధనా స్థలాలపై తరచూ జరుగుతున్న దాడుల్లో ఒకటిలా ఉందని ఆయన అన్నారు హిందుస్థాన్ టైమ్స్ రిపోర్ట్ చేసింది.
పాకిస్తాన్ అధికారుల ప్రకారం, ఈ గురుద్వారా కూల్చివేతకు ముందస్తు అనుమతి తీసుకోలేదు. నో అబ్జెక్షన్ సర్టిఫికెటన్ (NOC) తీసుకోలేదు. దీనిపై స్థానిక సిక్కు సమాజం నిరసనలు చేయడంతో.. అధికారుల దృష్టికి వచ్చింది. పంజాబ్ ముఖ్యమంత్రి ఈ విషయాన్ని స్వయంగా గమనించారు. పునర్నిర్మాణ పనులు తక్షణం ప్రారంభించాలని ఆదేశించారు.
ఈ ఘటనపై స్థానిక వ్యాపారులు తమ ఆందోళనలు వ్యక్తంచేశారు. గురుద్వారా ప్రాంగణం సుమారు 80 ఏళ్లుగా ఖాళీగా ఉండటంతో అనేక కుటుంబాలు అక్కడ స్థిరపడి, వ్యాపారాలు నడుపుతున్నారు. పునర్నిర్మాణం వల్ల వెళ్లిపోవాల్సి వస్తే ప్రత్యామ్నాయ నివాసం, ఉపాధికి మద్దతు అందించాలని వారు డిమాండ్ చేశారు. ఇది సిక్కు సమాజం, స్థానికుల మధ్య ఉద్రిక్తతలను పెంచుతోంది.
సిక్కు సంప్రదాయంలో గురుద్వారాలు ఆరాధనా స్థలాలు మాత్రమే కావు. అవి సామాజిక, సంస్కృతిక కేంద్రాలు. సింగ్ సభా ఉద్యమంలో భాగమైన ఈ గురుద్వా..రా సిక్కుల చరిత్రలో ముఖ్యమైనది. దీని కూల్చివేత సిక్కు సమాజంలో తీవ్ర విషాదం, ఆగ్రహాన్ని కలిగించింది. స్థానిక సిక్కులు నిరసనలు చేపట్టడంతో పునర్నిర్మాణం ప్రక్రియ ముందుకు వచ్చింది. అయితే, ఇలాంటి ఘటనలు పాకిస్థాన్లో పర మత సహనం లోపం, మైనారిటీల హక్కుల్ని కాలరాయడాన్ని హైలైట్ చేస్తాయి. అంతర్జాతీయ సమాజం కూడా ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
పాకిస్థాన్ ప్రభుత్వం.. మైనారిటీల రక్షణకు చట్టపరమైన, పరిపాలనా చర్యలు తీసుకోవాలి. భారత్ ఎప్పటికప్పుడు సిక్కు సమాజం భావాల్ని సమర్థిస్తూ, అంతర్జాతీయంగా ఈ సమస్యల్ని ఎత్తి చూపుతోంది. ఈ ఘటన రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది. అయితే, పునర్నిర్మాణం త్వరగా పూర్తి చేసి, సిక్కు భక్తులకు మళ్లీ ఆరాధనా సౌకర్యం కల్పించడం ద్వారా పాకిస్థాన్ సానుకూల సంకేతం ఇవ్వాలి.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Jul 02, 2026 10:29 AM IST













