Hrithik Roshan: విడాకుల కోసం రూ.400 కోట్లు భరణం.. హృతిక్ రోషన్-సుసానే డైవర్స్ సీక్రెట్స్ రివీల్.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

హృతిక్ రోషన్, సుస్సానే ఖాన్ విడాకుల సమయంలో రూ.400 కోట్ల భరణం తీసుకున్నారనే వార్తలు పూర్తిగా అబద్ధమని సుస్సానే సోదరి ఫరా ఖాన్ అలీ స్పష్టం చేశారు. సుస్సానే ఎలాంటి భరణం తీసుకోలేదని, ఇద్దరూ పరస్పర గౌరవంతో విడిపోయారని ఆమె వెల్లడించారు.

News18
News18

బాలీవుడ్‌లో అత్యంత చర్చనీయాంశమైన సెలబ్రిటీ విడాకుల్లో నటుడు హృతిక్ రోషన్, సుసానే ఖాన్ విడాకులు కూడా ఒకటి. దాదాపు 14 ఏళ్ల వైవాహిక జీవితాన్ని కలిసి గడిపిన ఈ జంట, ఇద్దరు కుమారులకు తల్లిదండ్రులుగా ఉన్నప్పటికీ 2014లో అధికారికంగా విడిపోయారు. అయితే వీరి విడాకుల సమయంలో సోషల్ మీడియాలో, మీడియా వర్గాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన ఒక వార్త ఏమిటంటే.. సుసానే ఖాన్, హృతిక్ రోషన్ నుంచి రూ.400 కోట్ల భరణం తీసుకుందని.

అయితే తాజాగా ఈ వార్తలపై సుసానే ఖాన్ సోదరి, ప్రముఖ జ్యువెలరీ డిజైనర్ ఫరా ఖాన్ అలీ స్పందిస్తూ అసలు నిజాన్ని బయటపెట్టారు. ఇటీవల విక్కీ లాల్వానీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, రూ.400 కోట్ల భరణం తీసుకున్నట్లు వచ్చిన వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని, అలాంటి ప్రచారం తమ కుటుంబాన్ని తీవ్రంగా బాధించిందని చెప్పారు.

“హృతిక్, సుసానే విడాకుల సమయంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చాలా మంది వారి వ్యక్తిగత జీవితంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కానీ వారు ఇద్దరూ ఎంతో పరిపక్వంగా, గౌరవప్రదంగా ఆ పరిస్థితిని ఎదుర్కొన్నారు. వారి విడాకులు పూర్తిగా పరస్పర అంగీకారంతో జరిగాయి. ఒక విషయం మాత్రం నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. రూ.400 కోట్ల భరణం అనే వార్త పూర్తిగా అబద్ధం. సోషల్ మీడియాలో ఇప్పటికీ అలాంటి వార్తలు చూస్తే నాకు చాలా బాధగా ఉంటుంది” అని ఫరా ఖాన్ అలీ పేర్కొన్నారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ, “నా సోదరి సుసానే హృతిక్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. మా కుటుంబం ఎప్పుడూ డబ్బు కంటే బంధాలకు ఎక్కువ విలువ ఇవ్వాలని నేర్పింది. అందుకే ఆమె ఎలాంటి ఆర్థిక ప్రయోజనం ఆశించలేదు. అందుకే ఇప్పటికీ హృతిక్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు రాకేష్ రోషన్, పింకీ రోషన్‌లతో సుసానేకు ఎంతో మంచి సంబంధాలు ఉన్నాయి. వారు ఇప్పటికీ ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుంటారు” అని వెల్లడించారు.

సుసానే ఖాన్ వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తూ ఫరా ఖాన్ అలీ మాట్లాడుతూ, “ఆమె ఎప్పుడూ డబ్బు కోసం సంబంధాలను ఉపయోగించుకునే వ్యక్తి కాదు. ఆమె ఒక గౌరవనీయమైన కుటుంబానికి చెందిన మహిళ. ఎంతో సొగసైన వ్యక్తిత్వం కలిగిన ఆమె, ఈ మొత్తం వ్యవహారాన్ని ఎంతో హుందాగా నిర్వహించింది. హృతిక్ కూడా చాలా మంచి వ్యక్తి. వారి వైవాహిక జీవితం సక్సెస్ కాలేదంతే కానీ, దానిని మీడియా కోసం పెద్ద వివాదంగా మార్చాల్సిన అవసరం లేదని వారు భావించారు” అన్నారు.

అలాగే విడాకులు ఖరారైన తర్వాత, ఈ భరణం వార్తలపై స్పందించాలని తాను సుసానేకు చాలాసార్లు సూచించానని ఫరా తెలిపారు. అయితే సుసానే మాత్రం వాటిపై ఎప్పుడూ స్పందించడానికి ఇష్టపడలేదని చెప్పారు. “నేను ఆమెను చాలాసార్లు ఈ వార్తలను ఖండించమని అడిగాను. కానీ ఆమె ‘ప్రజలు నా గురించి ఏమనుకుంటారో నాకు సంబంధం లేదు. నేను ఎవరినీ ఒప్పించాల్సిన అవసరం లేదు’ అని చెప్పేది” అంటూ ఫరా గుర్తు చేసుకున్నారు.

హృతిక్ రోషన్, సుసానే ఖాన్‌ల పరిచయం చిన్నప్పటి నుంచే ప్రారంభమైంది. అనేక సంవత్సరాల ప్రేమ తర్వాత, హృతిక్ తొలి చిత్రం ‘కహో నా… ప్యార్ హై’ ఘన విజయం సాధించిన కొద్ది రోజులకే, 2000 డిసెంబర్‌లో వీరు వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు హ్రేహాన్, హృదాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 2013లో విడిపోతున్నట్లు ప్రకటించిన ఈ జంట, 2014లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు.

అయితే విడాకుల తర్వాత కూడా హృతిక్, సుసానే మధ్య స్నేహబంధం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా తమ పిల్లల పెంపకం విషయంలో ఇద్దరూ కలిసి బాధ్యతలు తీసుకుంటున్నారు. పలు కుటుంబ వేడుకలు, సెలవు ప్రయాణాల్లో కూడా వీరిద్దరూ కలిసి కనిపించడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఫరా ఖాన్ అలీ చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి హృతిక్-సుసానే విడాకుల చర్చను సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మార్చాయి.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports