Last Updated:
నిఘా వర్గాలు, ఇమిగ్రేషన్ బ్యూరో సంయుక్తంగా సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో మొత్తం 21,563 మంది అక్రమ వలసదారులు ఉన్నట్లు లెక్కతేల్చారు.
Hyderabad: భాగ్యనగరంలో అక్రమ వలసదారుల ఉనికి కలకలం రేపుతోంది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించే విదేశీయుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో, స్థానిక నిఘా వర్గాలు, పోలీసులు జరిపిన అంతర్గత విచారణలో విస్తుపోయే నిజాలు బహిర్గతమయ్యాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 20 వేలకు పైగా అక్రమ వలసదారులు ఒక్క హైదరాబాద్లోనే తిష్ఠ వేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
నిఘా వర్గాలు, ఇమిగ్రేషన్ బ్యూరో సంయుక్తంగా సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో మొత్తం 21,563 మంది అక్రమ వలసదారులు ఉన్నట్లు లెక్కతేల్చారు. వీరిలో అత్యధికంగా రోహింగ్యాలు సుమారు 9,500 మంది కాగా, నేపాల్ దేశస్థులు 6,400 మంది, బంగ్లాదేశీయులు 3,900 మంది ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు సోమాలియా (785), సూడాన్ (432), యెమెన్ (225) వంటి ఆఫ్రికా మరియు అరబ్ దేశాలకు చెందిన వారు కూడా వేలల్లో ఉన్నారు.
అధికారిక రికార్డుల ప్రకారం బంగ్లాదేశీయుల సంఖ్య కేవలం 40 గానే ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో భద్రతా బలగాల కళ్లుగప్పి అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చిన వారి సంఖ్య 4 వేలకు పైనే ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
సాధారణంగా సరిహద్దు దేశాల నుండి వచ్చే వలసదారులు సరిహద్దు రాష్ట్రాల్లోనే ఆవాసం పొందుతుంటారు. అయితే దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో జీవన వ్యయం (Living Cost) తక్కువగా ఉండటం, అలాగే సులభంగా ఉపాధి అవకాశాలు లభిస్తుండటంతో వీరంతా భాగ్యనగరం బాట పడుతున్నట్లు ఉన్నతాధికారులు విశ్లేషిస్తున్నారు. మరికొందరు విదేశీయులు విద్య, వ్యాపారాల కోసం అధికారిక వీసాలతోనే నగరంలోకి ప్రవేశించినప్పటికీ, వీసా గడువు ముగిసిన తర్వాత కూడా తమ సొంత దేశాలకు వెళ్లకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. ఢిల్లీ, ముంబయి తర్వాత ఇలాంటి వారు హైదరాబాద్కే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
బతుకుదెరువు కోసం వలస వచ్చిన వారి పట్ల అధికారులు కొంత మానవతా దృక్పథంతో వ్యవహరిస్తున్నప్పటికీ, అక్రమంగా దేశంలోకి ప్రవేశించడం చట్టరీత్యా నేరం కావడంతో వారిని గుర్తించి వెనక్కి పంపే ప్రక్రియను వేగవంతం చేశారు. ముఖ్యంగా ఆఫ్రికా దేశాలకు చెందిన కొందరు వలసదారులు నగరంలో మత్తుమందుల (మాదకద్రవ్యాల) వ్యాపారంలో మునిగితేలుతున్నట్లు విచారణలో తేలింది. గతేడాది (2025) డ్రగ్స్ కేసుల్లో కేవలం ఆఫ్రికా దేశాలకు చెందిన 24 మందిని ఈగల్ అధికారులు అరెస్ట్ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ, ఇప్పటివరకు వివిధ కేసుల్లో చిక్కుకున్న నైజీరియా (22), కామెరూన్ (5), ఘనా (4) తో కలిపి మొత్తం 42 మంది విదేశీయులను అధికారులు డిపోర్టేషన్ ద్వారా వారి సొంత దేశాలకు పంపించివేశారు.
అక్రమంగా నగరంలో నివసిస్తున్న వారి వివరాలు ఎక్కడా ప్రభుత్వ అధికారిక రికార్డుల్లో నమోదు కాకపోవడం వల్ల వారి ఖచ్చితమైన సంఖ్యను తేల్చడం నిఘా వర్గాలకు పెద్ద సవాల్గా మారింది. ప్రస్తుతం ఇమిగ్రేషన్ బ్యూరో, రాష్ట్ర పోలీసు విభాగాలు మరియు కేంద్ర నిఘా సంస్థలు సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టి నగరంలోని అక్రమ వలసదారుల పూర్తి ఆచూకీ కనుగొనే పనిలో నిమగ్నమయ్యాయి.
Hyderabad,Telangana













