Last Updated:
Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో రౌడీ మూకలు మరోసారి రెచ్చిపోయాయి. తమ బస్తీలోకి ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించి, ధైర్యంగా ఎదిరించిన ఓ ఇంటర్ విద్యార్థిని రౌడీ షీటర్ తన గ్యాంగ్తో కలిసి కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చాడు.
ఈ ఘోర ఘటన కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. ఈనాడు కథనం ప్రకారం.. బిలాల్ నగర్ బస్తీకి చెందిన ఎజాజ్ మహమ్మద్ అనే ఆటో డ్రైవర్ పెద్ద కుమారుడు ఫైజాన్ (18) అలియాస్ అజాన్. అతను షాహీన్నగర్లోని ఒక కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు.
ఆదివారం తెల్లవారుజామున ఫైజాన్ తన స్నేహితులైన అమీర్ (19), సాహిల్ (19)లతో కలిసి స్థానికంగా ఉండే బిలాల్నగర్ కొండ ప్రాంతానికి వెళ్లాడు. అదే సమయంలో బాలాపూర్ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ ఇబ్రార్ (22), తన గ్యాంగ్ సభ్యులైన జేబుదొంగ ఫర్హాన్ (21), అష్ఫాక్ (22)లతో కలిసి అక్కడికి చేరుకున్నాడు.
ఎదిరించాడని కత్తులతో దాడి..
రౌడీ ముకలు అక్కడ తిరుగుతుండటాన్ని గమనించిన ఫైజాన్.. ధైర్యంగా ముందుకు వచ్చి, “మన బస్తీకి వీళ్లు ఎందుకు వచ్చారు?” అని రౌడీషీటర్ ఇబ్రార్ను ప్రశ్నించాడు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మాట మాట పెరగడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన రౌడీ గ్యాంగ్ సభ్యుడు ఫర్హాన్ హఠాత్తుగా తన వద్ద ఉన్న కత్తి తీసి ఫైజాన్ తలపై బలంగా వేటు వేశాడు.
ఆ వెంటనే రౌడీషీటర్ ఇబ్రార్ కూడా అదే కత్తిని అందుకుని ఫైజాన్ కడుపులో, శరీరంలోని ఇతర భాగాల్లో విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఫైజాన్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
ముందస్తు ప్లాన్తోనే హత్య: కుటుంబ సభ్యులు
రౌడీషీటర్ ఇబ్రార్ గ్యాంగ్ ముందస్తు వ్యూహంతోనే తమ అల్లుడు ఫైజాన్ను టార్గెట్ చేసి దాడికి పాల్పడిందని మృతుడి మామ సాకీర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కాలాపత్తర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రశాంతంగా ఉండే బస్తీలో రౌడీ షీటర్ రెచ్చిపోయి విద్యార్థిని హత్య చేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
Hyderabad,Telangana














