Last Updated:
శనివారం ఆయన భార్య పేరిట ఉన్న బ్యాంకు లాకర్లను ఏసీబీ అధికారులు తెరిచారు. అందులో ఊహించని విధంగా భారీ ఎత్తున నగదు, బంగారం నిల్వలు పట్టుబడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
Hyderabad: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన సర్వే బందోబస్తు, భూమి రికార్డుల కార్యాలయం మల్టీజోన్-2 ఉపసంచాలకుడు (డిప్యూటీ డైరెక్టర్) సుంకరి నరహరిరావు అక్రమాస్తుల పరంపర ఏసీబీ సోదాల్లో రోజుకో కొత్త సంచలనాన్ని సృష్టిస్తోంది. గతంలో ఆయన ఇంట్లో దొరికిన కోట్ల రూపాయల నగదు, ఫిక్స్డ్ డిపాజిట్ల ఉదంతం మరువక ముందే.. తాజాగా శనివారం ఆయన భార్య పేరిట ఉన్న బ్యాంకు లాకర్లను ఏసీబీ అధికారులు తెరిచారు. అందులో ఊహించని విధంగా భారీ ఎత్తున నగదు, బంగారం నిల్వలు పట్టుబడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఈ నెల 16న నరహరిరావు ఇంట్లో జరిపిన సోదాల సమయంలో, శాలిబండలోని కెనరా బ్యాంకులో ఆయన భార్య వందన పేరిట ఉన్న లాకర్ల వివరాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే ఆ లాకర్ల తాళాలు ఇచ్చేందుకు నరహరిరావు నిరాకరించడంతో, ఏసీబీ డీఎస్పీ మాజిద్ ఖాన్, ఇన్స్పెక్టర్ గౌస్ ఆజాద్ బృందం న్యాయస్థానం నుండి ప్రత్యేక సెర్చ్ వారెంట్ పొందింది. శనివారం బ్యాంకుకు వెళ్లిన అధికారులు లాకర్లను పగలగొట్టగా.. అందులో రూ. 1.50 కోట్ల పసిడి నోట్ల కట్టలతో పాటు, సుమారు 2 కిలోల బరువు గల బంగారం బిస్కెట్లు, విలువైన ఆభరణాలు లభ్యమయ్యాయి.
ఏసీబీ సోదాల చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా నరహరిరావు వద్ద అక్రమ సంపద వెలికితీశారు. ఇప్పటివరకు జరిపిన సోదాలలో అధికారులకు దొరికిన వివరాలు ఇలా ఉన్నాయి:
ఇంట్లో లభించిన నగదు: రూ. 1.54 కోట్లు
బ్యాంకు లాకర్లలో లభించిన నగదు: రూ. 1.50 కోట్లు
బ్యాంకు ఖాతాల నిల్వలు: రూ. 2.29 కోట్లు
ఫిక్స్డ్ డిపాజిట్లు (FDs): రూ. 5.04 కోట్లు
బంగారం: సుమారు 2 కిలోల బంగారం బిస్కెట్లు, ఆభరణాలు
చర, స్థిరాస్తుల విలువ (రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం): రూ. 13.05 కోట్లు
గౌలిపురాకు చెందిన నరహరిరావుది అత్యంత సాధారణ మధ్యతరగతి కుటుంబం. తండ్రి మరణించడంతో 1987లో కారుణ్య నియామకం కింద సాధారణ మండల సర్వేయర్గా ఉద్యోగంలో చేరారు. వారసత్వంగా కేవలం ఒక పాత ఇల్లు మాత్రమే వచ్చినప్పటికీ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సుదీర్ఘకాలం సర్వేయర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన కాలంలోనే ఆయన అక్రమార్జనకు తెరలేపారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ బూమ్ను ఆసరాగా చేసుకుని, ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులవిగా మారుస్తూ అడ్డగోలుగా సర్వే నివేదికలు సృష్టించి కోట్లాది రూపాయలు దండుకున్నారు. ఎవరిపైనా నమ్మకం లేకనే ఈ అక్రమ సంపాదననంతా ఇంట్లో, బ్యాంకు లాకర్లలో దాచినట్లు ఏసీబీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ఏసీబీ నివేదికల ప్రకారం, నరహరిరావు 39 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగ కాలంలో అధికారికంగా వచ్చిన మొత్తం ఆదాయం రూ. 1.60 కోట్లు మాత్రమే కాగా, అందులో ఆయన ఏకంగా రూ. 1.01 కోట్లు ఖర్చు చేశారు. లెక్క ప్రకారం ఆయన వద్ద కేవలం రూ. 59 లక్షలు మాత్రమే మిగిలి ఉండాలి. కానీ, ఆయన సంపాదనకు మించి రూ. 3.08 కోట్ల అదనపు ఆస్తులతో పాటు కోట్ల రూపాయల నగదు దొరకడం ఆయన అవినీతికి అద్దం పడుతోంది. అవినీతి నిరోధక శాఖ అధికారులు నరహరిరావును అరెస్ట్ చేయగా, ప్రస్తుతం ఆయన చంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఏసీబీ అధికారులు ఈ కేసుపై దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
Hyderabad,Telangana













