Last Updated:
చార్మినార్ వద్ద ఉన్న నిజామియా యునానీ కళాశాలలో చదువు పూర్తి చేసిన ఆయన, గత రెండు నెలలుగా మల్లాపూర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నైట్ డ్యూటీ (రాత్రి విధులు) నిర్వర్తిస్తున్నారు.
Hyderabad: నిద్రలేమి సమస్యకు మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఓ యువ వైద్యుడు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న వైద్యుడే ఆసుపత్రి గదిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. విశాఖపట్నానికి చెందిన మొహమ్మద్ ఇనాయతుల్లా కుమారుడు ఖాసిం (27) పాతబస్తీలోని యాకుత్పురాలో నివాసముంటున్నారు. చార్మినార్ వద్ద ఉన్న నిజామియా యునానీ కళాశాలలో చదువు పూర్తి చేసిన ఆయన, గత రెండు నెలలుగా మల్లాపూర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నైట్ డ్యూటీ (రాత్రి విధులు) నిర్వర్తిస్తున్నారు.
ఎప్పటిలాగే సోమవారం రాత్రి విధులకు హాజరైన డాక్టర్ ఖాసిం, కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు ఆసుపత్రిలోని తన గదిలోకి వెళ్లి లోపల గడియ పెట్టుకున్నారు. అయితే, ఎంతసేపటికీ ఆయన బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆసుపత్రి సిబ్బంది గది తలుపులు కొట్టారు. లోపలి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తలుపులు విరగ్గొట్టి చూడగా, అప్పటికే డాక్టర్ ఖాసిం అపస్మారక స్థితిలో మృతి చెంది ఉండడాన్ని గమనించారు.
సమాచారం అందుకున్న బాలాపూర్ ఇన్స్పెక్టర్ ఎం.సుధాకర్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
మృతుడి తండ్రి పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్ ఖాసిం గత కొంతకాలంగా తీవ్ర నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. తనకు సరిగ్గా నిద్ర పట్టడం లేదని తరచూ ఇంట్లో చెప్పేవారు. ఈ క్రమంలోనే నిద్ర కోసం ఆయన కొన్ని రకాల మాత్రలతో పాటు మత్తు ఇంజెక్షన్ స్వయంగా తీసుకుని ఉంటారని, అది డోస్ ఎక్కువై (Overdose) మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
మరోవైపు, ఖాసిం మృతి చెందిన విషయాన్ని ఆసుపత్రి యాజమాన్యం తమకు వెంటనే సమాచారం అందించకుండా నిర్లక్ష్యం వహించిందంటూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బాలాపూర్ పోలీసులు, అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.
Hyderabad,Telangana













