Last Updated:
IND vs SL 1st Test: భారత్, శ్రీలంక జట్ల మధ్య గాలే వేదికగా శనివారం ప్రారంభమైన మొదటి టెస్టు మ్యాచ్లో తీవ్ర గందరగోళం, ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అత్యంత విచిత్రమైన పరిస్థితుల్లో రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు.
సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్తో సరైన సమన్వయం లోపించడంతో ఇద్దరు భారత బ్యాటర్లు ఒకే ఎండ్కు (క్రీజులోకి) చేరడం, చివరకు జైస్వాల్ తన వికెట్ను సమర్పించుకోవడం మ్యాచ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారత ఇన్నింగ్స్ కొనసాగుతున్న సమయంలో శ్రీలంక స్పిన్నర్ కేశర నువాంత వేసిన ఫ్లైటెడ్ డెలివరీని కేఎల్ రాహుల్ మిడ్-ఆన్ దిశగా చక్కగా డ్రైవ్ చేశాడు. బంతిని ఆపేందుకు బౌలర్ నువాంత డైవ్ చేసినప్పటికీ బంతి అతడి చేతికి చిక్కకుండా ముందుకు వెళ్లింది. అయితే అదే సమయంలో నాన్-స్ట్రైకర్ ఎండ్లో ఉన్న యశస్వి జైస్వాల్ను బౌలర్ ఢీకొట్టాడు. దీంతో అదుపు తప్పిన జైస్వాల్ పిచ్పై కిందపడిపోయాడు.














