భారతదేశం తన సంస్కృతిని కేవలం చరిత్రగా మాత్రమే చూడకుండా, దానిని భవిష్యత్తు భాగస్వామ్యాల నిర్మాణానికి బలమైన పునాదిగా వాడుకుంటోందని ఈ పర్యటన నిరూపించింది. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో తన “ఇండియన్ డీఎన్ఏ” గురించి ప్రస్తావించడం, ప్రధాని మోదీ సుపరిపాలనను ప్రశంసించడం ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి పెరుగుతున్న గౌరవానికి నిదర్శనం. రామాయణం, మహాభారతం, సంస్కృతం, గరుడ, బాలి వంటి భాగస్వామ్య చిహ్నాలు ఇరు దేశాల బంధానికి ప్రధాన పునాదులుగా మారాయి.
1965 యుద్ధ సమయంలో ఇండోనేషియా పాకిస్తాన్కు మద్దతు ఇచ్చింది. కానీ నేడు ప్రధాని మోదీ సమర్థవంతమైన విదేశాంగ విధానం కారణంగా, ఆ దేశం భారత్కు అత్యంత సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామిగా మారింది. ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య కీలక రక్షణ ఒప్పందాలు జరిగాయి:
బ్రహ్మోస్ మరియు అస్త్ర క్షిపణులు: ఇండోనేషియా భారత్ నుండి ‘బ్రహ్మోస్’ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుంది. అలాగే భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ వైమానిక క్షిపణి సామర్థ్యాల విజయం తర్వాత, ఇండోనేషియా ‘అస్త్ర’ ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులను కూడా కొనుగోలు చేసింది.
సైనిక శిక్షణ: ఇండోనేషియా సైనిక అధికారులకు భారతదేశపు ప్రతిష్టాత్మక NDA (నేషనల్ డిఫెన్స్ అకాడమీ), DSSC (డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్) లలో శిక్షణ ఇవ్వనున్నారు.
సబాంగ్ పోర్ట్ అభివృద్ధి: మలక్కా జలసంధి ముఖద్వారంలో, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాంతంలో ఉన్న ఇండోనేషియా ‘సబాంగ్ పోర్ట్’ (Sabang Port) ను ఇరు దేశాలు ఉమ్మడిగా అభివృద్ధి చేయనున్నాయి. ఇది భారత్ చేపట్టిన గ్రేట్ నికోబార్ పోర్ట్ ప్రాజెక్ట్కు కేవలం 100 మైళ్ల దూరంలో ఉండటం విశేషం. దీనితో పాటు కోస్ట్ గార్డ్ సహకారం, బ్లూ ఎకానమీ మరియు హిందూ మహాసముద్రంలో సముద్ర వాణిజ్యంపై పటిష్టమైన ఫ్రేమ్వర్క్ ఖరారైంది.
యూపీఐ – క్యూఆర్ఐఎస్ అనుసంధానం: భారతదేశపు UPI తరహా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఇండోనేషియాతో పంచుకోవడానికి భారత్ అంగీకరించింది. దీని ద్వారా భారత UPI మరియు ఇండోనేషియా QRIS వ్యవస్థలను అనుసంధానించనున్నారు. ఇది ‘స్టార్టప్ ఇండియా మిషన్’ కు కూడా ఊతం ఇవ్వనుంది.
క్రిటికల్ మినరల్స్ & రేర్ ఎర్త్ మాగ్నెట్స్: భారత సంస్థలైన NFTDC, మిడ్వెస్ట్ లిమిటెడ్ మరియు ఇండోనేషియాకు చెందిన PT PERMINAS ల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. దీని ద్వారా ఇండోనేషియాలో స్టీల్, నికెల్ మరియు రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్ల తయారీలో భారత్ పెట్టుబడులు పెట్టనుంది.
అంతరిక్ష రంగం: ఉపగ్రహ సాంకేతికత, రిమోట్ సెన్సింగ్ రంగాలలో సంయుక్త పరిశోధనల కోసం ఒప్పందం కుదిరింది. ఈ ఉపగ్రహ డేటా షేరింగ్ వల్ల వ్యవసాయ పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ మరియు కమ్యూనికేషన్ రంగాలకు ప్రయోజనం చేకూరుతుంది.
భారతదేశ సాఫ్ట్ పవర్ అనేది కేవలం యోగా, సంస్కృతికే పరిమితం కాకుండా విద్య, ఆరోగ్యం, ప్రజాస్వామ్య వ్యవస్థల విస్తరణకు వాడుకవుతోంది.
ఐఐఎం బెంగళూరు ఓవర్సీస్ క్యాంపస్: ఇండోనేషియాలోని సింఘసారీ సెజ్ (Singhasari SEZ) లో ఐఐఎం బెంగళూరు (IIM Bangalore) తన మొదటి విదేశీ క్యాంపస్ను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా ఆసియాన్ (ASEAN) దేశాల్లో భారత్ ప్రభావం మరింత పెరగనుంది.
ఈవీఎం (EVM) ల తయారీకి సహాయం: ప్రపంచంలోనే అతిపెద్ద మరియు మూడవ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్-ఇండోనేషియాల ఎన్నికల కమిషన్ల (ECI & KPU) మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. దీని ద్వారా ఇండోనేషియా సొంతంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (EVMs) అభివృద్ధి చేసుకోవడానికి భారత్ సాంకేతిక సహాయం అందిస్తుంది.
ఆరోగ్యం మరియు ఆహార భద్రత: ఇండోనేషియాలోని 28 కోట్ల మంది పౌరులకు తక్కువ ధరకే భారతీయ మందులు అందుబాటులోకి రానున్నాయి. అలాగే భారతదేశపు ‘మధ్యాహ్న భోజన పథకం’, ‘పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS)’ నమూనాలను భారత్ వారితో పంచుకుంది. ఆహార భద్రతలో భాగంగా 100 టన్నుల హై-క్వాలిటీ “DWR 162” గోధుమ విత్తనాలను భారత్ ఇండోనేషియాకు సరఫరా చేయనుంది.
విపత్తు నిర్వహణ: ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా సంభవించే దేశాలు కావడంతో భారత NDMA, ఇండోనేషియా BNPB ల మధ్య ఒప్పందం కుదిరింది. దీని ద్వారా టెక్నాలజీ ఆధారిత ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు.
ప్రధాని మోదీ ఆశయమైన “వికాస్ భీ, విరాసత్ భీ” ఫ్రేమ్వర్క్ కింద, ఇండోనేషియాలోని యోగ్యకర్తలో ఉన్న 9వ శతాబ్దపు పురాతన యునెస్కో ప్రపంచ వారసత్వ హిందూ దేవాలయమైన ‘ప్రాంబనన్ టెంపుల్ కాంప్లెక్స్’ (Prambanan Temple Complex) పునరుద్ధరణ మరియు పరిరక్షణకు భారతదేశం సహాయం ప్రకటించింది.
ప్రధాని మోదీ ప్రారంభించిన మహాసాగర్ (MAHASAGAR) విజన్ ఆధారంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రత, స్థిరత్వం మరియు సమగ్ర వృద్ధిని సాధించడంలో ఈ పర్యటన మరియు చారిత్రక ఒప్పందాలు అత్యంత కీలకమైనవని విశ్లేషకులు భావిస్తున్నారు.













