Last Updated:
ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఎనిమిది పేజీలతో కూడిన సుదీర్ఘ అడ్వైజరీని పది జట్ల యజమానులకు, సీఈఓలకు పంపారు.
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతున్న తరుణంలో, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అన్ని ఫ్రాంచైజీలకు కీలకమైన హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్, జట్టు అధికారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని “హనీ ట్రాప్” (Honey Trap) ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఎనిమిది పేజీలతో కూడిన సుదీర్ఘ అడ్వైజరీని పది జట్ల యజమానులకు, సీఈఓలకు పంపారు.
అత్యంత ప్రజాదరణ పొందిన ఐపీఎల్ వంటి టోర్నీల్లో ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని హనీ ట్రాప్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని బీసీసీఐ పేర్కొంది. హై-ప్రొఫైల్ క్రీడల్లో వ్యక్తులను లొంగదీసుకోవడానికి ఇటువంటి పద్ధతులు అనుసరిస్తారని, దీనివల్ల లైంగిక వేధింపుల వంటి తీవ్రమైన చట్టపరమైన చిక్కులు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఫ్రాంచైజీ యాజమాన్యాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఇటువంటి రిస్కులను నివారించాలని సూచించింది.
ప్రస్తుత సీజన్లో ఆటగాళ్ల హోటల్ గదుల్లోకి అనధికారిక వ్యక్తులు ప్రవేశించినట్లు యాంటీ కరప్షన్ యూనిట్ (ACSU) గుర్తించింది. దీనిని తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ కొత్త నిబంధనలను (SOPs) అమలులోకి తెచ్చింది:
లిఖితపూర్వక అనుమతి తప్పనిసరి: టీమ్ మేనేజర్ ముందస్తు అనుమతి మరియు లిఖితపూర్వక ఆమోదం లేకుండా ఆటగాళ్లు లేదా సపోర్ట్ స్టాఫ్ గదుల్లోకి ఎవరినీ అనుమతించకూడదు. వారు స్నేహితులైనా, బంధువులైనా సరే ఈ రూల్ వర్తిస్తుంది.
పబ్లిక్ ఏరియాల్లోనే భేటీ: అతిథులు ఎవరైనా వస్తే హోటల్ లాబీ లేదా రిసెప్షన్ వంటి బహిరంగ ప్రదేశాల్లోనే కలవాలి. మేనేజర్ అనుమతి లేకుండా వారిని ప్రైవేట్ గదుల్లోకి తీసుకెళ్లడం నిషిద్ధం.
కదలికలపై నిఘా: ఆటగాళ్లు హోటల్ వదిలి బయటకు వెళ్లేటప్పుడు సెక్యూరిటీ అధికారులకు (SLO/TIO) సమాచారం ఇవ్వాలి. వారి కదలికలను ఎప్పటికప్పుడు లాగ్ బుక్లో నమోదు చేయనున్నారు.
ఇటీవల రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్లో వ్యాపింగ్ (Vaping) చేస్తూ పట్టుబడటంతో, బీసీసీఐ ఈ విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. స్టేడియాలు, డ్రెస్సింగ్ రూమ్లు, హోటళ్లు, ప్రాక్టీస్ సెషన్లలో ఇ-సిగరెట్లు, వ్యాపింగ్ డివైజ్లు, నిషేధిత పదార్థాల వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది.
మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఫ్రాంచైజీ యజమానులు డగౌట్లోకి రావడం లేదా లైవ్ మ్యాచ్ మధ్యలో ఆటగాళ్లను కౌగిలించుకోవడం, వారితో భౌతికంగా ఇంటరాక్ట్ అవ్వడం వంటి పద్ధతులను కూడా బీసీసీఐ తప్పుబట్టింది. ఇది ఐపీఎల్ ప్రోటోకాల్కు విరుద్ధమని, ఆటపై ప్రభావం చూపే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
ఈ నిబంధనలను అతిక్రమిస్తే భారీ జరిమానాలు విధించడమే కాకుండా, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీసీసీఐ నిర్ణయించింది. ఆటగాళ్ల క్రమశిక్షణ, టోర్నీ ప్రతిష్టను కాపాడటమే తమ ప్రాధాన్యతని బోర్డు స్పష్టం చేసింది.
లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ అప్డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana
May 08, 2026 12:17 PM IST













